Tamilsai :  తనను ఎంత అవమానించినా వెనక్కి తగ్గబోనని గవర్నర్ తమిళిసై అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడారు.  గవర్నర్‌గా తెలంగాణలో తాను అడుగుపెట్టిన సమయానికి కేబినెట్‌లో ఒక్క మహిళా మంత్రి కూడా లేదని అన్నారు. తాను వచ్చాక ఇద్దరు మహిళా మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించానని కీలక వ్యాఖ్యలు చేశారు. తాను రావడంతో ఇద్దరు మహిళలకు మంత్రులుగా అవకాశం రావడం సంతోషం అని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ప్రొటోకాల్ ఇచ్చినా, ఇవ్వకపోయినా నా పని నేను చేసుకుంటూ పోతా అని స్పష్టం చేశారు.  


తనపై పువ్వులు వేసే వారు ఉన్నారని, రాళ్లు వేసే వారు కూడా ఉన్నారని అన్నారు. అందరూ అందరికీ నచ్చాలని లేదని తెలిపారు. అయితే మంచి పనులు చేయడానికి అధికారం ఉండాలన్న గవర్నర్‌.. ఎన్ని అవమానాలు ఎదురైనా వెనక్కి తగ్గనని స్పష్టం చేశారు. తనపై రాళ్లు విసిరితే ఇల్లు కట్టుకుంటా.. పిన్స్‌ వేస్తే ఆ పిన్స్‌ గుచ్చుకొని వచ్చే రక్తంతో నా చరిత్ర పుస్తకం రాస్తానంటూ తమిళిసై వ్యాఖ్యానించారు. ఈ మేరకు శనివారం గవర్నర్‌ మాట్లాడుతూ.. లోక్‌సభ, శాసనసభలో 33% మహిళా రిజర్వేషన్ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీకి కృతజ్ఞతలు తెలిపారు. గత 27 ఏళ్లుగా ఈ బిల్లు గురించి మాట్లాడుతున్నారు కానీ అమలు కాలేదని పేర్కొన్నారు. ఓ మహిళా రాష్ట్రపతి ఈ బిల్లుపై సంతకం చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. 


ప్రతి ఒక్కరూ ఒక కలతోనే రాజకీయాల్లోకి వస్తారని, అవకాశం వచ్చినప్పుడు పురుషులతో పోలిస్తే 20 రేట్లు ఎక్కువగా పని చేస్తే కానీ మహిళకు గుర్తింపు లభించదని తమిళిసై అన్నారు. ఒకప్పుడు తాను బీజేపీ నేతనని, ఇప్పుడు గవర్నర్‌ అని పేర్కొన్నారు. అప్పట్లో బీజేపీలో 33 శాతం రిజర్వేషన్‌ను మహిళలకు కల్పిస్తూ పార్టీ నిర్ణయించిందని, ఫలితంగా ఎంతోమంది మహిళలు పార్టీలో చేరారని ప్రస్తావించారు. రాజకీయాలపై మక్కువతోనే తను ఎంతగానో ఇష్టమైన వైద్యవృత్తిని కూడా పక్కన పెట్టాల్సి వచ్చిందన్నారు గవర్నర్‌.  రాజకీయాల్లో పురుషాధిక్యత ఎక్కువ. భారత్‌లో 15 లక్షల పంచాయతీలకు ప్రెసిడెంట్‌లుగా  మహిళలు ఉన్నారు.  నేను పురుషులకంటే మెరుగ్గానే పని చేస్తున్నానని గుర్తుచేశారు. గతంలో తాను బీజేపీ అధ్యక్షురాలిగా పని చేశానని.. తన గతం దాచేస్తే దాగేది కాదన్నారు. దాయాల్సిన అవసరం లేదన్నారు.                         


తెలంగాణ ప్రభుత్వానికి, గవర్నర్ తమిళిసైకి మధ్య సత్సంబంధాలు లేవు. ఎమ్మెల్సీలుగా తెలంగాణ కేబినెట్ సిఫారసు చేసిన ఇద్దర్ని అనర్హులని.. గవర్నర్ తిరస్కరించి  పైల్ ను వెనక్కి పంపారు . ఈ అంశంపై గవర్నర్ ను బీఆర్ఎస్ నేతలు ఘాటుగా విమర్శలు గుప్పించారు. ఈ కారణంగానే  తమిళిసై ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది. వచ్చే వారం జరగనున్నకేబినెట్ భేటీలో మళ్లీ వారి పేర్లనే గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా సిఫారసు చేస్తారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.