CM KCR Tour : జాతీయ రాజకీయాలపై మరోసారి సీఎం కేసీఆర్ దృష్టిసారించారు. ఇవాళ్టి నుంచి పలు రాష్ట్రాల్లో పర్యటించి వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జాతీయ స్థాయిలో పలు రాజకీయ, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనున్నారు.  పర్యటనలో సీఎం కేసీఆర్ రాజకీయ, ఆర్థిక, మీడియా రంగాలకు చెందిన ప్రముఖులతోనూ భేటీ కానున్నారు. జాతీయ స్థాయిలో పలు రాజకీయ, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ దేశవ్యాప్తంగా పర్యటించనున్నారు. దేశం కోసం వీర మరణం పొందిన సైనిక కుటుంబాలను ఆదుకోనున్నారు. రైతుల హక్కుల కోసం పోరాడి, రైతు ఉద్యమంలో అసువులు బాసిన రైతుల కుటుంబాలను సీఎం కేసీఆర్ పరామర్శించనున్నారు. 
 
సీఎం కేసీఆర్ పర్యటన షెడ్యూల్ 


శుక్రవారం మధ్యాహ్నం సీఎం కేసీఆర్ దిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. దిల్లీలోని వివిధ రాజకీయ పార్టీల నేతలతో సీఎం సమావేశం కానున్నారు. ప్రముఖ ఆర్థికవేత్తలతో భేటీలో దేశ ఆర్థిక పరిస్థితులపై చర్చించనున్నారు. దీంతో పాటు జాతీయ మీడియా సంస్థల జర్నలిస్టులతోనూ సీఎం కేసీఆర్ సమావేశాలు నిర్వహిస్తారు.  మే 22వ తేదీన మధ్యాహ్నం సీఎం కేసీఆర్ దిల్లీ నుంచి చంఢీఘర్ వెళ్లనున్నారు. గతంలో ప్రకటించిన విధంగా జాతీయ రైతు ఉద్యమంలో అసువులు బాసిన సుమారు 600 రైతు కుటుంబాలను సీఎం కేసీఆర్ పరామర్శిస్తారు. ఒక్కో కుటుంబానికి రూ.3 లక్షల చొప్పున చెక్కుల పంపిణీ చేస్తారు. ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్ లతో కలిసి సీఎం కేసీఆర్ చేపడతారు. రైతు ఉద్యమంలో చనిపోయిన పంజాబ్, హరియాణా ఉత్తర్ ప్రదేశ్, దిల్లీ రాష్ట్రాలకు చెందిన రైతుల కుటుంబాలకు చెక్కులు అందచేస్తారు.


బెంగాల్, బిహార్ లో పర్యటన 


మే 26న సీఎం కేసీఆర్ బెంగళూరులో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా మాజీ ప్రధాని దేవగౌడ, కర్నాటక మాజీ సీఎం కుమారస్వామితో సమావేశమౌతారు. బెంగుళూరు నుంచి మే 27న రాలేగావ్ సిద్ది పర్యటనను చేపట్టనున్నారు. అక్కడ సామాజికి ఉద్యమకారుడు అన్నా హజారేతో సీఎం కేసీఆర్ భేటీఅవుతారు. సాయిబాబా దర్శనం కోసం సీఎం కేసీఆర్ షిరిడీ వెళతారు. అక్కడ నుంచి పర్యటనలను ముగించుకుని తిరిగి హైద్రాబాద్ చేరుకుంటారు. మే 29 లేదా 30న బెంగాల్, బిహార్ రాష్ట్రాల పర్యటనకు సీఎం కేసీఆర్ సంసిద్ధం కానున్నారు. గాల్వాన్ లోయలో వీరమరణం పొందిన భారత సైనిక కుటుంబాలను సీఎం పరామర్శిస్తారు. గతంలో తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన విధంగా వారి కుటుంబాలను ఆర్థిక సాయం చేయనున్నారు.