Telangana Budget 2024-25 Highilights: రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ వర్గాల సంక్షేమం, వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) స్ఫష్టం చేశారు. ఈ మేరకు బడ్జెట్‌లో ఆయా వర్గాలకు భారీగా నిధులు కేటాయించారు. ఎస్సీ సంక్షేమం కోసం రూ.33,124 కోట్లు, ఎస్టీ సంక్షేమం కోసం రూ.17,056 కోట్లు ప్రతిపాదించారు. 'షెడ్యూల్డ్ కులాల, తెగల అభివృద్ధికి చట్టపరంగా కేటాయించాల్సిన నిధులు కచ్ఛితంగా అందిస్తాం. ఆ నిధులు వేరే ఎలాంటి పథకాలకు మళ్లించకుండా వంద శాతం షెడ్యూల్డ్ కులాల, తెగల కోసమే ఉపయోగిస్తాం. ప్రభుత్వం మైనార్టీల సంక్షేమం కోసం పలు చర్యలు చేపట్టింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులతో పాటు మైనార్టీ విద్యార్థులకు 2024-25 లో యూపీఎస్సీ సివిల్ సర్వీస్ పరీక్షలకు ఉచిత శిక్షణ అందిస్తున్నాం.' అని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. మైనార్టీ విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం సహా లోకల్ అభ్యర్థులకు నెలకు రూ.2,500, నాన్ లోకల్ అభ్యర్థులకు రూ.5,000 స్టైఫండ్ ఇస్తున్నట్లు చెప్పారు.

 

'రంజాన్ వేడుకలకు రూ.33 కోట్లు'

 

ఈ ఏడాది రంజాన్ వేడుకల కోసం రూ.33 కోట్లు కేటాయించినట్లు మంత్రి భట్టి తెలిపారు. అషూర్ ఖానాల పునరుద్ధరణకు, నిర్వహణకు రూ.50 లక్షలు మంజూరు చేశామన్నారు. 'ఈ ఏడాది జనవరిలో జరిగిన తబ్లీగీ జమాత్ ఇస్లామిక్ సమావేశానికి రూ.2.40 కోట్లు విడుదల చేశాం. ముస్లిం సోదర సోదరీమణుల హజ్ యాత్రకు రూ.4.43 కోట్లు మంజూరు చేశాం. మైనార్టీ సంక్షేమ శాఖకు బడ్జెట్‌లో రూ.3,003 కోట్లు ప్రతిపాదిస్తున్నాం.' అని పేర్కొన్నారు.

 

బీసీ సంక్షేమానికి..

 

మన రాష్ట్ర జనాభాలో అత్యధిక శాతం ఉన్న వెనుకబడిన తరగతుల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని భట్టి తెలిపారు. వారి వికాసానికి పలు పథకాలను ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. బీసీ సంక్షేమానికి రూ.9,200 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. 'గీత కార్మికులు కల్లు గీసే క్రమంలో ప్రమాదాలకు గురి కాకుండా కిట్స్ అందిస్తున్నాం. క్రొత్తగా ముదిరాజ్, యాదవ కుర్మ, మున్నూరు కాపు, పద్మశాలి, పెరిక, లింగాయత్, మేరా, గంగపుత్ర కులాలకు 8 కార్పొరేషన్లను ఏర్పాటు చేసింది. ఆర్ధికంగా వెనుకబడిన కులాల (EBC) సంక్షేమం కోసం ఒక వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేశాం. ఇవి వెనుకబడిన తరగతుల అభ్యున్నతికి తోడ్పడుతాయి.' అని పేర్కొన్నారు.

 

స్కిల్ యూనివర్శిటీ..

 

మరోవైపు, తెలంగాణ యువకుల్లో ప్రపంచ స్థాయి నైపుణ్యాలను పెంపొందించాలనే లక్ష్యంగా ఉన్నామని భట్టి తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే హైదరాబాద్‌లో పబ్లిక్ - ప్రైవేట్ భాగస్వామ్యంతో స్కిల్ యూనివర్శిటీ (Skill University)ని స్థాపించి నడిపించనున్నట్లు చెప్పారు. ఈ వర్శిటీలో పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను యువతకు శిక్షణ ఇస్తామని వెల్లడించారు. 17 రకాల నైపుణ్యాలను నేర్పనున్నామని.. వీటిలో సర్టిఫికెట్, డిప్లొమా, డిగ్రీ కోర్సులు ఉంటాయని పేర్కొన్నారు. దీని ద్వారా పరిశ్రమల్లో యువతకు సులువుగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని స్పష్టం చేశారు.