Budget Allocations For Hyderabad Development: తెలంగాణకు మణిహారమైన హైదరాబాద్ (Hyderabad) అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో నగర అభివృద్ధికి రూ.10 వేల కోట్లు కేటాయించారు. శంషాబాద్ విమానాశ్రయం వరకూ మెట్రో విస్తరణకు రూ.100 కోట్లు, మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకు రూ.1500 కోట్లు, ఆర్ఆర్ఆర్ (రీజనల్ రింగ్ రోడ్డు) ప్రాజెక్టుకు రూ.1,525 కోట్లు, ఔటర్ రింగ్ రోడ్డుకు రూ.200 కోట్లు, హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుకు రూ.500 కోట్లు, హైడ్రా సంస్థకు రూ.200 కోట్లు, మెట్రో వాటర్ వర్క్స్‌కు రూ.3,385 కోట్లు కేటాయించారు. నగరంలో పారిశుద్ధ్య, మురుగు, నీటి, తాగునీటి సమస్యలు గత పదేళ్లుగా నిర్లక్ష్యానికి గురైనట్లు భట్టి విమర్శించారు. భాగ్యనగరాన్ని మరింత ప్రణాళికాబద్ధంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడతామన్నారు.


విపత్తుల నిర్వహణకు ఏకీకృత సంస్థ



  • హైదరాబాద్, ఓఆర్ఆర్ వరకూ గల ప్రాంతాలను కోర్ అర్బన్ రీజియన్‌గా గుర్తించి వాటి అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తామని భట్టి విక్రమార్క అన్నారు. ఔటర్ రింగ్ రోడ్డును నగర సరిహద్దుగా పరిగణిస్తామన్నారు. 'ఓఆర్ఆర్ పరిధిలో విపత్తుల నిర్వహణకు ఒక ఏకీకృత సంస్థ ఏర్పాటు చేస్తాం. జీహెచ్ఎంసీ సహా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ - మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాలు దీని పరిధిలోకి వస్తాయి' అని పేర్కొన్నారు.

  • పట్టణ విపత్తుల నివారణకు, వాటిని ఎదుర్కొనడానికి తీసుకోవాల్సిన చర్యలను చేపట్టడంతో పాటు, ఎలాంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కొని తక్షణ రక్షణ చర్యలు తీసుకొనే విషయంలో జాతీయ, రాష్ట్రేతర సంస్థలతో సమన్వయాన్ని HYDRAA చేస్తుంది. ఈ సంస్థలో ఆస్తుల పరిరక్షణకు, విపత్తుల నిర్వహణకు ప్రత్యేక విభాగాలు ఉంటాయి. బడ్జెట్‌లో హైడ్రా సంస్థకు రూ.200 కోట్లు కేటాయించారు.

  • మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టులో భాగంగా సుమారు 110 చదరపు కి.మీల పట్టణ ప్రాంతం పునరుజ్జీవనం చెందుతుంది. అలాగే, నదీ తీర ప్రాంతంలో క్రొత్త వాణిజ్య, నివాస కేంద్రాలు వెలిసి, పాత హెరిటేజ్ ప్రాంతాలు క్రొత్తదనాన్ని సంతరించుకుంటాయి. ఈ ప్రాజెక్టు కోసం బడ్జెట్‌లో రూ.1500 కోట్లు ప్రతిపాదించారు. 

  • GHMC పరిధిలో మౌలిక వసతుల కల్పనకు రూ.3,065 కోట్లు కేటాయింపు. HMDA పరిధిలో మౌలిక వసతుల కల్పనకు రూ.500 కోట్ల, మంచినీరు, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరచడానికి మెట్రో వాటర్ వర్క్స్‌కి రూ.3,385 కోట్లు ఈ బడ్జెట్‌లో ప్రతిపాదించారు. 

  • ఎయిర్ పోర్ట్ వరకూ మెట్రో విస్తరణకు రూ.100 కోట్లు, ఓఆర్ఆర్‌కు రూ.200 కోట్లు, హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు రూ.500 కోట్లు, పాత నగరానికి మెట్రో విస్తరణకు రూ.500 కోట్లు, మల్టీ మోడల్ సబర్బన్ రైలు ట్రాన్స్ పోర్ట్ సిస్టమ్‌కు రూ.50 కోట్లు కేటాయింపు. రీజనల్ రింగ్ రోడ్డు అభివృద్ధి వేగవంతం చేసేలా చర్యలు.

  • ఉత్తర ప్రాంతంలోని 158.6 కి.మీ. పొడవున్న సంగారెడ్డి – తూప్రాన్ – గజ్వేల్ -  చౌటుప్పల్ రోడ్డును, దక్షిణ ప్రాంతంలోని 189 కి.మీ.ల పొడవున్న చౌటుప్పల్ -షాద్ నగర్-సంగారెడ్డి రోడ్డును, జాతీయ రహదారులుగా ప్రకటించడానికి వీలుగా అప్ గ్రేడ్ చేయాలని ప్రతిపాదన. ఆర్ఆర్ఆర్ హైదరాబాద్ నగర ఉత్తర దక్షిణ ప్రాంతాలనూ, తూర్పు పశ్చిమ ప్రాంతాలనూ కలుపుతూ జాతీయ రహదారి నెట్ వర్క్‌తో అనుసంధానం.

  • ఎక్స్ ప్రెస్‌వే ప్రమాణాలను దృష్టిలో ఉంచుకొని దీని నిర్మాణానికి తగినంత భూమిని సేకరించే ప్రయత్నం. ట్రాఫిక్ రద్దీకి అనుగుణంగా తొలుత నాలుగు లేన్లతో నిర్మించి దానిని 8 లేన్ల సామర్థ్యానికి విస్తరణ. దీంతో ఓఆర్ఆర్ (ORR)కు ఆర్.ఆర్.ఆర్ (RRR) కు మధ్య పలు పరిశ్రమలు, వాణిజ్య సేవలు, రవాణా పార్కుల అభివృద్ధి. ప్రాథమిక అంచనాల ప్రకారం ఆర్.ఆర్.ఆర్ ఉత్తర ప్రాంతం అభివృద్ధికి రూ.13,522 కోట్లు, దక్షిణ ప్రాంతాభివృద్ధికి రూ.12,980 కోట్లు ఖర్చు. ఈ మేరకు బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి భట్టి ప్రతిపాదనలు వివరించారు.