తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేసింది. అందుకే బడ్జెట్‌లో స్పెషల్ ఫోకస్ పెట్టింది. సుసంపన్నమైన వ్యవసాయానికి ప్రతీకంగా తెలంగాణ నిలుస్తోందని భావిస్తున్న ప్రభుత్వం మరింత జాగ్రత్తగా బడ్జెట్‌ కేటాయింపులు చేసింది. బడ్జెట్ ప్రసంగం సందర్భంగా మాట్లాడిన హరీష్‌రావు.. తెలంగాణలో అమలవుతున్న విధంగా రైతు సంక్షేమ విధానలు తమ రాష్ట్రంలో అమలు చేయాలని చాలా రాష్ట్రాల రైతులు ఆయా ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తున్నారని అన్నారు.


భారీగా నిధులు
ఈ బడ్జెట్ లో వ్యవ‌సాయ రంగానికి రూ.26,831 కోట్ల కేటాయింపులు చేశారు. రైతు రుణ మాఫీ కోసం 6,385 కోట్లను కేటాయించారు. దీంతో రైతులు కాస్త ఊరట చెందుతున్నారు. 


ఎలాంటి ఛార్జీలు లేకుండా విద్యుత్
రైతులకు ఛార్జీలు లేకుండా విద్యుత్, పన్నులు లేకుండా సాగు నీరు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి హరీష్ కొనియాడారు. ఇలాంటి ఎన్నో చర్యల కారణంగానే దేశంలోని వ్యవసాయ వృద్ధి రేటు కంటే తెలంగాణ వ్యవసాయ వృద్ధి రేటు దాదాపు రెండు రెట్లు అధికంగా ఉందన్నారు. దేశ వ్యవసాయ వృద్ధి రేటు 4 శాతం ఉంటే తెలంగాణ వ్యవసాయ వృద్ధి రేటు 7.4 శాతంగా ఉందని వివరించారు. 2014-15లో మొత్తం పంట సాగు విస్తీర్ణం 131.33 లక్షల ఎకరాలు ఉంటే... 2020-21 నాటికి 215.37 ఎకరాలకు చేరిందన్నారు. రాష్ట్రంలో వరి ఉత్పత్తి మూడు రెట్లు పెరిగిందని తెలిపారు. 2014-15లో 68.17 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 2021-22లో రెండు కోట్ల రెండు లక్షల మెట్రిక్ టన్నులకు చేరిందని వివరించారు.


రైతు బంధు పేరుతో 65 లక్షల మంది రైతులకు 65 వేల కోట్ల రూపాయలు సాయం చేసినట్టు సభకు తెలిపారు. చనిపోయిన రైతు కుటంబాలకు 5,384 కోట్ల ఆర్థిక సాయం చేసినట్లు తెలిపారు. 2014-15లో 24 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరిస్తే... 2022-23లో ఇప్పటి వరకు 65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించినట్టు వివరించింది. 
తెలంగాణలో ఆయిల్‌పామ్ సాగు పెంచాలనే ఉద్దేశంతో ఈసారి బడ్జెట్‌లో వెయ్యి కోట్లు ప్రతిపాదించారు మంత్రి హరీష్‌రావు. వీటన్నింటితో కలిపి వ్యవసాయ శాఖకు బడ్జెట్‌లో 26, 831 కోట్లు ప్రతిపాదించారు.


ఇన్నాళ్లు తెలంగాణకు పరిమితమైన బీఆర్‌ఎస్‌ ఈ మధ్యే దేశంలో పార్టీని విస్తరించాలని వ్యూహాలు రచిస్తున్నారు. అందుకే పార్టీ పేరును కూడా మార్చేశారు. తన విధానం రైతు విధానం అని ఇప్పటికే చా౪లా సార్లు ప్రకటించారు. అందుకే ఆ నినాదం ప్రతిబింబించేలా బడ్జెట్‌లో వ్యవసాయ రంగంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు.


ఒకప్పుడు సంక్షోభంలో కూరుకుపోయిన వ్యవసాయ రంగం తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతే గాడిలో పడిందన్నారు హరీష్‌రావు. రైతుల్లో ఆత్మవిశ్వాసం నింపామంటున్నారు.  కరవు కాటకాలతో అలమటించే తెలంగాణ నేడు సుజల, సుఫల, సస్యశ్యామల తెలంగాణగా అవతరించిందంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు పదేళ్లలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు అప్పటి ప్రభుత్వాలు కేవలం 7,994 కోట్ల నిధులు మాత్రమే ఖర్చు చేస్తే.. తెలంగాణ వచ్చాక 2023 వరకు కేసీఆర్ ప్రభుత్వం రూ.1,91,612 కోట్లు ఖర్చు పెట్టిందని అన్నారు. అంటే గతంతో పోల్సితే 20 రెట్లు అధికంగా నిధులు వెచ్చించినట్టు పేర్కొన్నారు హరీష్‌రావు.


గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా రైతు బంధు, రైతు బీమా, వ్యవసాయానికి 24 గంటల పాటు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్, రైతు రుణమాఫీ, చెరువుల పునరుద్ధరణ, పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి, భారీ ప్రాజెక్టుల నిర్మాణం, సకాలంలో ఎరువులు, విత్తనాల పంపిణీ, కల్తీ విత్తనాల నియంత్రణ, వ్యవసాయ విస్తరణాధికారల నియామకం, రైతు వేదికలు, పంట కల్లాల నిర్మాణం, రైతు బంధు సమితుల ఏర్పాటు ఇలా చాలా సంస్కరణలు పథకాలతో రైతులకు అండగా నిలిచామని అన్నారు.