Telangana Elections 2023: సిర్పూర్ అసెంబ్లీ బీఎస్పీ అభ్యర్థి, తెలంగాణ బీఎస్పీ చీఫ్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక ఇంటివారయ్యారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ నియోజకవర్గంలో ఇల్లు కొనుక్కున్నారు. ఇదే విషయాన్ని ఆయన ట్విటర్ ద్వారా వెల్లడించారు. ‘‘ఎట్టకేలకు సిర్పూర్ గడ్డ మీద చిన్న ఇల్లు కొనుక్కున్నాము. మా ఇంటి నంబరు 3-8, కోసిని గ్రామ పంచాయితీ, నిజానికి తెలంగాణ మొత్తంతో నా ప్రస్థానం ముడిపడినప్పటికీ, మీ శేష జీవితం మా వద్దే గడపండి అని నన్ను అక్కున చేర్చుకున్న సిర్పూర్ నియోజకవర్గ ప్రజలకు ఏం చేసినా తక్కువే, ఈ ప్రాంత ప్రజలందరికీ నా హృదయపూర్వక పాదాభివందనాలు, చివరి శ్వాస వరకూ మీ మధ్యనే ఉంటానని, మీ కోసమే శ్రమిస్తానని మాటిస్తున్నా.. ఇక ఎవరు లోకలో ఎవరు నాన్ లోకలో నిర్ణయించాల్సింది సిర్పూర్ ప్రజలే, అక్టోబర్ 29 నాడు ఉదయం 11 గంటలకు మహనీయుల సాక్షిగా గృహప్రవేశం’’ అని చెప్పారు.


సిర్పూర్ విముక్తి కోరుకునే అందరికీ ఇదే మా మా ఆహ్వానం అంటూ పరోక్షంగా బీఆర్ఎస్ అభ్యర్థి కోనేరు కోనప్పకు ఝలకిచ్చారు. తాను కొనుగోలు చేసిన ఇంటికి సంబంధించిన ఇంటి ట్యాక్స్, లైబ్రరీ సెస్, డ్రైనేజీ ట్యాక్స్, వాటర్ ట్యాక్స్ లను కలిపి మొత్తం రూ.22796 గ్రామ పంచాయతీకి చెల్లించిన వివరాలను ఆయన వెల్లడించారు. 


మరణించేది మాత్రం సిర్పూర్ గడ్డ మీదనే


బీఎస్పీ అధికారంలోకి వచ్చిన వెంటనే పోడు, అసైన్డ్ భూములకు పట్టాలు కల్పిస్తామని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ హామీ ఇచ్చారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ లోని పార్టీ కార్యాలయంలో గురువారం బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన పలువురు నాయకులు భారీ సంఖ్యలో బీఎస్పీలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని అడిగితే ఆదివాసీ, గిరిజన రైతులపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిన దుర్మార్గపు కేసీఆర్ ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో ఓడించాలన్నారు. ఆదివాసీలు సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు పంపిణీ చేయలేదు, కాని కొంతమందికే పోడు పట్టాలిచ్చి నమ్మించే ప్రయత్నం చేసిందని విమర్శించారు. 


అధికారాన్ని అడ్డంపెట్టుకుని స్థానిక ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆయన బినామీలు పోడు భూములను ఆక్రమించుకున్నారని విమర్శించారు. ఎమ్మెల్యే కోనప్ప అక్రమ కేసులు పెట్టి ప్రజలను నిరంతరం భయంలో పెడుతున్నారని విమర్శించారు. ఎన్నికల్లో అత్యధికంగా ఓట్లేసేది పేద ప్రజలయితే అధికారం మాత్రం ఆధిపత్య కులాలకు దక్కుతుందన్నారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లో ఉండే సంపన్న వర్గాల వారు ఎన్నికల్లో ఓట్లు వేయరని, అక్కడుండే పేద ప్రజల ఓట్లతోనే గెలుస్తున్నారని అన్నారు. 


తాను పుట్టింది అలంపూర్ లో అయినా, మరణించేది మాత్రం సిర్పూర్ గడ్డ మీదనేనని అన్నారు. నవంబర్ 30 ఎన్నికల తర్వాత ఎవరు లోకల్, ఎవరు గ్లోబల్ అనేది ప్రజలు తీర్పునిస్తారని ఎమ్మెల్యే కొనప్ప వ్యాఖ్యలపై పరోక్షంగా విమర్శించారు. ఎమ్మెల్యేను ప్రశ్నించే వారిపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసులు బనాయించి వేధిస్తున్నారని అన్నారు. 26 ఏళ్ల పోలీస్ సర్వీస్ లో ఏనాడు అమాయకులపై అక్రమంగా ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలేదన్నారు. సిర్పూర్ ప్రజల సమస్యలపై ఏనాడు అసెంబ్లీలో మాట్లాడలేదన్న ఆయన ఎస్పీఎం కార్మికులకు తీరని అన్యాయం చేసిన ఎమ్మెల్యే కోనప్పను వచ్చే ఎన్నికల్లో ఓడించాలన్నారు.


అక్రమంగా డబ్బు తరలింపు - ప్రవీణ్ కుమార్
ఎమ్మెల్యే కోనప్ప ఎన్నికల్లో డబ్బు పంపిణీ కోసం గత రాత్రి రూ.10 కోట్ల నగదును గుంటూరు నుంచి అక్రమంగా తరలించారని, దీనిపై పోలీసులకు సమాచారం ఇచ్చిన చర్యలు తీసుకోలేదన్నారు. నకిలీ బంగారు ఉంగరాలు, దళిత బంధు బీసీ బంధు,బతుకమ్మ చీరలు, గృహా లక్ష్మీ వంటి పథకాలకు మోసపోకుండా వచ్చే ఎన్నికల్లో బీఎస్పీని గెలిపించాలని కోరారు. అనంతరం రాస్ పల్లి, బారెగూడెం, అంకుశాపూర్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీ కార్యదర్శి అర్షద్ హుస్సేన్, రాష్ట్ర కార్యదర్శి సిడాం గణపతి, పిల్లల తిరుపతి, జిల్లా కోశాధికారి నవీన్,మోర్ల గణేష్, రాంప్రసాద్ అసెంబ్లీ అధ్యక్షులు డోకే రాజన్న తదితరులు పాల్గొన్నారు.