Telangana BJP :  తెలంగాణ బీజేపీ ఎన్నికల ఇంచార్జ్ ప్రకాష్ జవదేకర్ .. పార్టీ నేతలతో విస్తృతంగా మంతనాలు జరుపుతున్నారు. ఆయనకు గతంలో తెలంగాణ ఎన్నికల కోసం పని చేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం  రాష్ట్రంలో  పరిస్థితులు.. బీజేపీని బలోపేతం చేసే అంశంపై ఆయన పార్టీ నేతలతో చర్చలు జరుపుతున్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రెడీగా ఉండేలా..  పార్టీ క్యాడర్ ను ఆయన రెడీ చేయాలనుకుంటున్నారు. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా ముఖ్య నేతల జాబితా, నియోజకవర్గాల వారీగా పార్టీ కీలక నేతలు అనుసరించాల్సిన స్ట్రాటజీలపై ఇప్పటికే కసరత్తు చేశారు. 


బీఆర్ఎస్ పై పోరాటం విషయంలో రాజీ పడకూడదన్న నడ్డా                        


అంతకు ముందు  జేపీ నడ్డా కూడా పార్టీ నేతలతో సమావేశం అయ్యారు. తెలంగాణ బీజేపీని గాడిన పెట్టేందుకు ఆ పార్టీ పెద్దలు విస్తృతంగా మంతనాల ుజరుపుతున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్ లో  రాష్ట్ర నేతలతో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. వారిలో కొందరు నడ్డాను విడివిడిగా కలుసుకున్నారు. పార్టీలో క్రమశిక్షణే అత్యంత ప్రధాన అంశం అని నడ్డా వారికి స్పష్టం చేశారు. ఇతర అంశాలు ఏవైనా సరే పక్కనపెట్టేయాలని, వచ్చే ఎన్నికల్లో బీజేపీని గెలిపించడమే అందరి లక్ష్యం కావాలని కర్తవ్యబోధ చేశారు. రాష్ట్రంలో బీజేపీ అంతర్గత వ్యవహారాలు మునుపెన్నడూ లేనంతగా చర్చకు దారితీశాయని, దీన్ని జాతీయ నాయకత్వం సహించబోదని నడ్డా ఘాటుగా హెచ్చరించారు. 


తరచుగా తెలంగాణకు బీజేపీ జాతీయ నేతలు                                  
 
పార్టీ జాతీయ స్థాయి పెద్దలు ఇకపై క్రమం తప్పకుండా తెలంగాణలో పర్యటిస్తుంటారని, రాష్ట్ర నేతలు కూడా క్రమశిక్షణతో మెలగాలని హితబోధ చేశారు. ఒకరిపై ఒకరు బురదచల్లే కార్యక్రమాలు కట్టిపెట్టాలని, పరస్పర ఆరోపణలు చేసుకుంటే చర్యలు కఠినంగా ఉంటాయని నడ్డా స్పష్టం చేశారు.  శంషాబాద్ లోని నోవాటెల్ హోటల్ లో జరిగిన ఈ సమావేశంలో కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ చుగ్, తెలంగాణ బీజేపీ ఎన్నికల ఇన్చార్జి ప్రకాశ్ జవదేకర్, సహ ఇన్చార్జి సునీల్ బన్సల్, ఎంపీ బండి సంజయ్, సీనియర్ నేత డాక్టర్ కె.లక్ష్మణ్, ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, డీకే అరుణ, విజయశాంతి, వివేక్ తదితరులు హాజరయ్యారు.


బీఆర్ఎస్ తో అవగాహన దుష్ప్రచారమేనని నిరూపించాలని బీజేపీ నిర్ణయం                              


తెలంగాణలో అధికారాన్ని దక్కించుకోవాలనుకుంటున్న బీజేపీకి.. బీఆర్ఎస్‌తో అవగాహన కుదిరిందని ప్రజల్లో ప్రచారం అవుతూండటం ఇబ్బందికరంగా మారింది. దీంతో బీఆర్ఎస్‌తో ఎలాంటి సంబంధం లేదని.. ఆ పార్టీని ఓడించేందుకే తాము ప్రయత్నిస్తున్నామని ప్రజలకు నమ్మకం కలిగించాల్సిన రాజకీయ అవసరం ఏర్పడింది. ఈ కారణంగా మరింత ఉద్ధృతంగా 
బీఆర్ఎస్ సర్కార్‌పై పోరాటం చేయాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు.