Telangana BCs Rs 1 Lakh Scheme : తెలంగాణలో బీసీ కుల వృత్తి, చేతివృత్తిదారులకు ప్రభుత్వం షాకింగ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సందర్భంగా బీసీలను ఆదుకునేందుకు రూ.1 లక్ష ఆర్థిక సాయం అందించాలని నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. అయితే పథకానికి అర్హులైన వారికి దరఖాస్తుల కోసం ఇచ్చిన నేటితో ముగిసింది. దరఖాస్తు ప్రక్రియలో జాప్యం అవుతుందని, తుది గడువు పొడిగిస్తారని భావించిన లబ్దిదారులకు నిరాశే ఎందురైంది. దరఖాస్తులకు గడువు పొడించేది లేదని మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. ఈరోజు వరకు దరఖాస్తు చేసుకున్న వారికి లక్ష రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు. దరఖాస్తులు పరిశీలించిన అనంతరం లబ్ధిదారులకు జులై 15న చెక్కులు పంపిణీ చేస్తామని చెప్పారు.


దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని బీసీలకు లక్ష రూపాయలు సాయం అందిస్తామని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాటు చేసినమంత్రులు గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్ కమిటీ విధి విధానాలు రూపొందించింది. బీసీ కుల వృత్తి, చేతివృత్తిదారుల నుంచి జూన్ 6 నుంచి దరఖాస్తులు స్వీకరించింది ప్రభుత్వం. కులం, ఆదాయం ధ్రువీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉండగా.. వాటి కోసం ప్రభుత్వ కార్యాలయాలకు బీసీ వర్గాల లబ్దిదారులు క్యూ కట్టారు. పడిగాపులు కాసినా తమకు కావాలసిన పత్రాలు చేతికి అందకపోవడంతో బీసీలకు రూ.1 లక్ష సాయానికి లబ్దిదారులు చాలా మంది అప్లై చేసుకోలేకపోయారు. ఆన్ లైన్లో అప్లై చేసేందుకు సైతం ఇబ్బందులు ఎదురయ్యాయని కొందరు లబ్దిదారులు వాపోయారు. ఈ క్రమంలో ప్రభుత్వం నిర్ణయించిన తుది గడువు నేడు (మంగళవారం) ముగిసింది. తమ కష్టాలు చూస్తున్న ప్రభుత్వం దరఖాస్తుల తుది గడువును పొడిగిస్తుందని లబ్దిదారులు భావించారు. కానీ దరఖాస్తుల గడువు ముగిసిందని, ఈరోజు వరకు దరఖాస్తు చేసిన వారి అప్లికేషన్లు మాత్రమే పరిశీలిస్తామని మంత్రి గంగుల చేసిన ప్రకటనతో వారికి షాకిచ్చినంత పనైంది. 


ప్రతినెల 15వ తేదీన లబ్దిదారులకు రూ.1 లక్ష చెక్కులను అందిస్తామన్నారు. దాదాపు 5 లక్షల వరకు అప్లికేషన్లు వచ్చుంటాయని, వాటిని పరిశీలించి అర్హులైన వారికి చెక్కులు ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని మంత్రి గంగుల తెలిపారు. అప్లికేషన్లు చెక్ చేసి, ఎంక్వైరీ చేయడానికి రెండు నుంచి మూడు వారాల సమయం పడుతుందని వివరించారు.


సర్వర్లు మొరాయిస్తున్నాయని దరఖాస్తులకు ఇబ్బంది అవుతుందని షాబాద్, షాద్ నగర్ రహదారిపై లబ్దిదారులు ఆందోళన చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు ఎమ్మార్వో ఆఫీసుల వద్ద బీసీ వర్గాలకు చెందిన వారు ప్రభుత్వం అందించే రూ.1 లక్ష ఆర్థిక సాయం కోసం క్యూ కట్టారు. విద్యాభ్యాసం పూర్తయ్యాక ఎడ్యుకేషన్ సర్టిఫికెట్లు తీసుకున్నారు కానీ వారి వద్ద ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు లేవు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించడంతో ఒక్కసారిగా తహశీల్దార్ కార్యాలయాలకు బీసీలు క్యూ కట్టారు. సర్వర్లు మొరాయించడంతో పత్రాలు ప్రింట్ తీసుకోవడానికి వీలు కాలేదని కొందరు వాపోతుంటే, డెడ్ లైన్ పొడిగిస్తే అర్హులమైన తాము ప్రభుత్వం అందించే లక్ష సాయం పొందడానికి దరఖాస్తు చేసుకుంటామని కోరుతున్నారు.