BRS MLA Rohit Reddy Car Accident: బీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కారు ఎదురుగా వాహనాన్ని తప్పించబోయి అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. కారు టైరు కూడా పేలినట్లు తెలుస్తోంది. అయితే డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ఎమ్మెల్యేకు పెను ప్రమాదం తప్పింది. రోహిత్ రెడ్డి సురక్షితంగా ఉన్నారని పార్టీ నేతలు చెబుతున్నారు.


తాండూరు ఎమ్మెల్యే రోహిత్ కర్ణాటకకు వెళ్లారు. శృంగేరి పీఠాన్ని దర్శించుకునేందకు శనివారం ఆయన వెళ్తుండగా.. మంగళూరు సమీపంలో ముడూరు - నల్లూరు క్రాస్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న వాహనాన్ని డ్రైవర్ తప్పించే ప్రయత్నం చేయగా, ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. కారు టైరు పేలడంతోనే అదుపుతప్పి వాహనం చెట్టు ఢీకొట్టిందని సైతం వినిపిస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు.   


రోడ్డు ప్రమాదం గురించి తెలియగానే పైలట్ రోహిత్ రెడ్డి కుటుంబసభ్యులు, అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఆందోళనకు గురయ్యారు. అయితే దేవుడి దయ, నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో తాను క్షేమంగానే ఉన్నానని ఎమ్మెల్యే చెప్పారు. తాను ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురికావడం వాస్తమేనని, అయితే తనకు ఎలాంటి గాయాలు కాలేదని, సురక్షితంగా బయట పడ్డానని వెల్లడించారు. తన గురించి వదంతులు నమ్మవద్దని, తాను క్షేమంగా ఉన్నానని ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial