Delhi Liquor Scam News :   మనీలాండరింగ్ కేసులో జైల్లో ఉన్న హవాలా వ్యాపారి సుఖేష్ చంద్రశేఖర్ మరో లేఖ రిలీజ్ చేశారు. ఈ సారి ఆ లేఖలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో పాటు కేజ్రీవాల్‌ పైనా ఆరోపణలు చేశారు. వారిద్దరూ త్వరలో తీహార్ జైలుకు వస్తారన్నారు. ముందు కేజ్రీవాల్ వస్తారని.. తర్వాత కవిత వస్తారని జోస్యం చెప్పారు. ఇటీవల తాను విడుదల చేసిన వాట్సాప్ చాట్‌ల పై కవిత ట్విట్టర్‌లో స్పందించారు. అవి ఫేక్ చాట్‌లని స్పష్టం చేశారు. దీనిపై సుఖేష్ చంద్రశేఖర్తన లేఖలో మండిపడ్డారు. తాను వాట్సాప్‌లో చాట్ చేసింది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితతోనే నంటూ స్పష్టం చేస్తూ తాజా లేఖలో పేర్కొన్నాడు. 


కవిత ఫోన్ నెంబర్లు రిలీజ్ చేసిన సుఖేష్ 


తాను చాట్ చేసింది ఎమ్మెల్సీ కవితక్కతోనే. ఆమె నెంబర్లు ఇవే అంటూ లేఖ ద్వారా స్క్రీన్‌షాట్‌ను విడుదల చేశాడు సుఖేష్‌. ఆ నెంబర్లు 6209999999, 8985699999గా ఉన్నాయి. నన్ను దొంగ, ఆర్థిక నేరగాడని విమర్శించారు. మీరు కూడా అందులో భాగస్వాములే. దేశ ప్రయోజనాల రీత్యా సత్యం మాట్లాడాలి. ధైర్యం ఉంటే సరైన రీతిలో, సక్రమంగా విచారణ జరిగేలా సహకరించాలంటూ కవితకు లేఖ ద్వారా సవాల్‌ విసిరాడు సుఖేష్‌ చంద్రశేఖర్‌.అలాగే ఇంకో ఛాట్‌లో సత్యేంద్ర జైన్‌ వ్యక్తిగత ఫోన్‌ నెంబర్‌ 919810154102గా లెటర్‌లో పేర్కొన్నాడు సుఖేష్‌. కవిత, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ 'తీహార్‌ క్లబ్‌'కు వస్తున్నారంటూ వెల్‌కమ్‌ చెబుతూ రాశాడు. 


కేజ్రీవాల్, కవిత కూడా తీహార్ జైలుకు వస్తారని వెల్కం చెప్పిన సుఖేష్ 


''కేజ్రీవాల్‌ తర్వాత నీ వంతే అంటూ కవితను ఉద్దేశించాడు సుఖేష్‌. కవితను తాను కవితక్క అని పిలుస్తానని, ఆమెను తన పెద్దక్కగా భావించానని సుఖేష్‌ తెలిపాడు. ట్విటర్‌ ద్వారా సమాధానలు ఇవ్వొద్దని, అవన్నీ పాత ట్రిక్కులనీ, పని చేయవంటూ లేఖలో కవితను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అతి త్వరలో కేజ్రీవాల్‌తో చేసిన ఛాటింగ్‌ను సైతం రిలీజ్‌ చేస్తా అంటూ లేఖ ద్వారా పేర్కొన్నాడు. కోర్టు ధ్రువీకరణతో ఎవిడెన్స్ చట్టం 65 బి కింద తాను స్క్రీన్ షాట్లను విడుదల చేశానని వెల్లడించిన సుఖేష్‌.. కవితక్క కు రూ. 15 కోట్ల డెలివరీ తర్వాత ఫేస్ టైం లో కేజ్రీవాల్, సత్యెంద్ర జైన్ తోనూ మాట్లాడిన స్క్రీన్‌ షాట్లను విడుదల చేస్తానంటూ ప్రకటించారు. 


తనకు తెలుగు, తమిళం వచ్చని లేఖలో పేర్కొన్న సుఖేష్


తనకు తెలుగు రాదని.. అయినా అక్కా అని పిలుస్తూ మాట్లాడారంటే అది ఫేక్ చాట్ అంటూ చేస్తున్న ఆరోపణలపై సుఖేష్ చంద్రశేఖర్ స్పందించారు. తనకు తెలుగు, తమిళం వచ్చన్నారు. తన తల్లిదండ్రులు ఇంట్లో తెలుగులోనే మాట్లాడుకుంటారన్నారు. ఇదర దక్షిణాది ప్రాంతీయ భాషలు కూడా వచ్చని సుఖేష్ చెప్పారు.  తనను రాజకీయంగా ప్రభావితం చేసి లేఖలు రాయిస్తున్నారని వస్తున్న విమర్శలకు కూడా సుఖేష్ వివరణ ఇచ్చారు. అలాంటి విమర్శలు అర్థరహితం అన్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానంటూ లేఖలో  సుఖేష్ ప్రకటించడం  కీలకంగా మారింది.