Minister KTR : మంత్రి కేటీఆర్ కు నిరసన సెగ తగిలింది. కేటీఆర్ శుక్రవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కోరుట్ల నుంచి వేములవాడ వైపు వెళుతూ ఉండగా కాన్వాయ్ పై చెప్పు విసిరేందుకు చెరకు ఉత్పత్తి దారుల సంఘం అధ్యక్షుడు మామిడి నారాయణ రెడ్డి ప్రయత్నించారు. అయితే అప్పటికే ముందస్తు అరెస్టు చేయడంతో పోలీస్ స్టేషన్ లోనే నారాయణరెడ్డి ఉన్నారు. దీంతో వెంటనే స్పందించిన పోలీసులు నారాయణ రెడ్డిని అడ్డుకోవడంతో ఆయనను కాన్వాయ్ కి దూరంగానే ఆపగలిగారు. అక్రమ అరెస్టులకి నిరసనగానే ఇలా చేశానని నారాయణరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 


అసలేం జరిగింది? 


 మంత్రి కేటీఆర్ సిరిసిల్ల పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జిల్లా వ్యాప్తంగా రైతు సంఘాల నాయకులతో పాటు పలువురు ప్రజాప్రతినిధులను పోలీసులు ముందస్తుగా అరెస్టులు చేశారు. తాము ఎలాంటి తప్పు చేయకపోయినా అరెస్టులు చేయడం అన్యాయమని రైతు సంఘాల నేతలు  పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో మెట్‌పల్లిలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్తోన్న మంత్రి కేటీఆర్ కాన్వాయ్ పై చెరకు రైతు ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు మామిడి నారాయణ రెడ్డి చెప్పు విసిరేందుకు ప్రయత్నించారు. మెట్‌పల్లి పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో ఉన్న నారాయణ రెడ్డి స్టేషన్ ముందు నుంచి మంత్రి కేటీఆర్ కాన్వాయ్ వెళ్లడం గమనించి పరిగెత్తుకుంటూ వెళ్లి చెప్పు విసిరే ప్రయత్నం చేశారు. అప్రమత్తమైన పోలీసులు అతన్ని అడ్డుకుని స్టేషన్ లోపలికి తీసుకెళ్లారు. 


కేటీఆర్ ఖమ్మం పర్యటన 


మూడు నెలల వెయిటింగ్‌.. మూడుసార్లు రద్దు.. ఇది ఖమ్మం జిల్లాలో మంత్రి కేటీఆర్‌ పర్యటన షెడ్యూల్‌.. మూడు సార్లు రదై్దన పర్యటన ఎట్టకేలకు ఖరారైంది. దీంతో కేటీఆర్‌కు ఘనస్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు సిద్దమయ్యాయి. అయితే ఖమ్మం గులాబీలో అసంతృప్తులు అధికమైన నేపథ్యంలో కేటీఆర్‌ టూర్‌లో ఎవరెవరు మెరుస్తారో.. ఎవరెవరు ముఖం చాటేస్తారు..? అనే విషయం ఇప్పుడు ఉమ్మడి జిల్లాలో జోరుగా ప్రచారం సాగుతుంది.


గత కొద్ది కాలంగా రాజకీయ వేడిన పుట్టించిన ఖమ్మం నగరంలో కేటీఆర్‌ పర్యటన ద్వారా తన మార్కు అబివృద్ధిని చూపించాలని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ తాపత్రయ పడుతున్నారు. గతంలో మూడుసార్లు అనివార్య కారణాల వల్ల పర్యటన రద్దు కాగా బీజేపీ కార్యకర్త సాయి ఆత్మహత్య ఉదంతం ఖమ్మం జిల్లాలో రాజకీయ వేడిన పుట్టించింది. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్‌ పర్యటన రదై్దనట్లు వార్తలు వినిపించాయి. అప్పట్నుంచి కాంగ్రెస్, బీజేపీ పార్టీలు మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ను టార్గెట్‌ చేస్తూ విమర్శలకు పదును పెట్టారు. అయితే వాటన్నింటికి అభివృద్దితోనే సమాదానం చేప్పాలనే భావనతో ఉన్న మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ మంత్రి కేటీఆర్‌ పర్యటన నేపథ్యంలో భారీ ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.