Singireddy Somasekhar Reddy: కొడంగల్‌లో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని ఓడిస్తానని ఆయన అనుచరుడు, ఏఎస్ రావు నగర్ కార్పొరేటర్ శిరీష భర్త సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిపై ఆయన సంచలన ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డిని నమ్ముకొని మోసపోయానని, BRS అభ్యర్థిని గెలిపించాలని చూస్తున్నాడంటూ ఆరోపించారు. రేవంత్ రెడ్డి బారిన పడిన తన లాంటి బాధితులను కలుపుకుని కొడంగల్‌లో ఆయన్ను ఓడిస్తానని సవాల్ చేశారు. ఉప్పల్‌లో తనకు టికెట్ ఇస్తే గెలుస్తానని సర్వేలన్నీ చెప్పాయని, కానీ రేవంత్ టికెట్ ఇవ్వలేదన్నారు. కనీసం సెకండ్ ఆప్షన్‌గా కూడా తన పేరు స్క్రీనింగ్ కమిటీలో పెట్టలేదని అన్నారు.






GHMC ఎన్నికల్లో కాంగ్రెస్ రెండు సీట్లలో గెలిస్తే, అందులో ఏఎస్ రావు నగర్ కార్పొరేటర్‌గా తన సతీమణి శిరీష కార్పొరేటర్‌గా గెలిచినట్లు చెప్పారు. గత తొమిదేళ్ల నుంచి పార్టీ కోసం పని చేశానని, ఎన్ని కష్టాలు ఎదురైన పార్టీతోనే ఉన్నానన్నారు. 2014, 2018లో టికెట్ ఇస్తామని చెప్పి మొండి చేయి చూపించారన్నారు. 2023లో కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అభ్యర్థుల జాబితాలో కనీసం సెకండ్ ఆప్షన్‌గా కూడా తన పేరు స్క్రీనింగ్ కమిటీలో పెట్టలేదన్నారు.


పరమేశ్వర్ రెడ్డిని గెలిపించాలని రేవంత్ రెడ్డికి లేదని, BRS అభ్యర్థిని గెలిపించాలని రేవంత్ చూస్తున్నాడంటూ ఆరోపించారు. పక్క పార్టీల నుంచి వచ్చిన వారికి టికెట్స్ ఇచ్చి.. పార్టీని నాశనం చేయాలని రేవంత్ చూస్తున్నాడని విమర్శించారు. తెలంగాణలో టీడీపీలాగా పార్టీని నాశనం చేసి ప్రాంతీయ పార్టీ స్థాపించాలని రేవంత్ చూస్తున్నారని, సీఎం పదవి కోసం ప్రైవేట్ ఆర్మీని నిర్మించుకున్నాడని మండిపడ్డారు. రేవంత్ రెడ్డికి అధికారం కట్టబెడితే రాష్ట్రాన్ని అమ్మేస్తాడని అన్నారు. రేవంత్ రెడ్డిని కొడంగల్‌ ప్రజలు తన్నితే మల్కాజిగిరిలో తాము గెలిపించుకున్నామని చెప్పారు.


పీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత రేవంత్ రెడ్డికి అహంకారం వచ్చిందని సోమశేఖర్ రెడ్డి మండిపడ్డారు. రేవంత్ బాధితులంతా తనతో కలిసి రావాలని, అందరి తరఫున పోరాడతానని స్పష్టం చేశారు. కొడంగల్‌లో రేవంత్ ఓటమికి తన వంతు ప్రయత్నం చేస్తానని, 300 మంది రేవంత్ బాధితులు ఉన్నారని, వారితో వందల కోట్లు ఖర్చు చేయించారని ఆరోపించారు. ఇన్ని రోజులు రేవంత్ కోసం పని చేసిన తాను.. రేపటి నుంచి వ్యతిరేకంగా పని చేస్తానని చెప్పారు. 'రేవంత్ రెడ్డికు హటావో.. కాంగ్రెస్‌కు బచావో' అంటూ అన్ని నియోజకవర్గాల్లో కాళ్లకు గజ్జెలు కట్టుకుని తిరుగుతానన్నారు. తన నియోజకవర్గానికి వెళ్లాలంటే సిగ్గుగా ఉందని, 15 రోజుల నుంచి ఢిల్లీలో దాకున్నానని, కరుడుగట్టిన కాంగ్రెస్ వాదులను పక్కన పెడితే BRSని ఎలా ఎదిరిస్తారని ప్రశ్నించారు. ఉప్పల్‌లో పార్టీ ఖాళీ అవుతుందన్నారు. ప్రజల మంచి కోసం ఏ పార్టీ హామీ ఇస్తే ఆ పార్టీలో చేరుతానన్నారు.