27 వేల కోట్ల రాబడులు ఉన్న సింగరేణిని అప్పుల పాలయిందని చేసిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యల్ని కొట్టిపారేసింది యాజమాన్యం. అవన్నీ నిరాధార ఆరోపణలని సంస్థ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. రూ. 32 వేల కోట్ల టర్నోవర్ , 11,665 కోట్ల డిపాజిట్లు , ఏటా 750 కోట్లకు పైగా వడ్డీ రాబడులన్న సింగరేణి అప్పుల పాలయింది అంటూ చేస్తున్న దుష్ప్రచారాన్ని సంస్థ యాజమాన్యం తీవ్రంగా ఖండించింది.


సింగరేణి విడుదల చేసిన వివరణాత్మక ప్రకటన 



  • రూ 32వేల కోట్ల టర్నోవర్ తో నడుస్తున్న సింగరేణి సంస్థ పటిష్టమైన ఆర్థిక పునాదులను ఏర్పరచుకొని ఇతర రాష్ట్రాల్లో కి కూడా విస్తరిస్తూ ఒడిస్సా రాష్ట్రంలో మరో రెండు నెలల్లో తొలిసారిగా బొగ్గు గనిని ప్రారంభించబోతోంది.

  • కంపెనీ వద్ద వివిధ బ్యాంకుల్లో, LIC డిపాజిట్లు, బాండ్ల ద్వారా కలిగి ఉన్న సొమ్ము రూ. 11,665 కోట్లు.. తద్వారా కంపెనీ ఏడాదికి సుమారు 750 కోట్ల రూపాయల వడ్డీవస్తోంది. వీటితోపాటు వినియోగదారుల నుంచి రావాల్సి ఉన్న బకాయిలు రూ. 15,500 వేల కోట్లు పైగా ఉన్నాయి. రూ 27 వేల కోట్ల ఆర్థిక పరిపుష్టిత కలిగి ఉన్న సింగరేణి కంపెనీ అప్పుల పాలైందని, రూ. 12 వేల కోట్లకు పైగా అప్పులు ఉన్నాయని దుష్ప్రచారం చేయడం అత్యంత బాధాకరం

  • దేశంలో ఏ ప్రభుత్వ సంస్థ కూడా చేపట్టని విధంగా సింగరేణి సుస్థిర ఆర్థిక పునాదుల కోసం థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని, సోలార్ విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. వాటి కోసం చేసిన రూ. 472 కోట్ల రూపాయల అప్పును ఇప్పటికే తీర్చివేసింది. థర్మల్ విద్యుత్ కేంద్రం కోసం చేసిన 5,300 కోట్ల అప్పులో కేవలం 2800 కోట్లు మాత్రమే మిగిలి ఉంది. అంటే సింగరేణి కి ఉన్న అప్పు కేవలం రూ.2800 కోట్లు మాత్రమే. అంతేకానీ రూ. 12 వేల కోట్లు అప్పులున్నాయని, కార్మికులకు జీతాలు చెల్లించలేని పరిస్థితి ఉందని చెప్పడం హాస్యాస్పదం, అత్యంత బాధాకరం.

  • కోట్లాది రూపాయల లాభాలు, రాబడులు గల సింగరేణి సంస్థకు కార్మికుల జీతాల చెల్లింపునకు అప్పులు చేయాల్సిన గత్యంతరం లేదు. ప్రతినెల 3వ తేదీన కచ్చితంగా జీతాల చెల్లింపు తో పాటు, ప్రతి ఏటా పెంచి చెల్లిస్తున్న లాభాల బోనస్, PLR బోనస్ క్రమం తప్పకుండా కార్మికుల ఖాతాల్లో జమ చేస్తున్నాం.

  • సింగరేణి సంస్థ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉత్పత్తి టర్నోవర్ లాభాల్లో దేశంలోనే నెంబర్ వన్ కంపెనీగా నిలుస్తూ సంక్షేమంలో కూడా అగ్రగామిగా ఉంటుంది. తెలంగాణ రాకపూర్వం సగటున ఒక కార్మికునిపై లక్ష 15 వేల రూపాయల సంక్షేమ ఖర్చు వెచ్చించగా ఇప్పుడు ఇది రూ. 3 లక్షల15 వేలకు చేరింది. సింగరేణి సంస్థ ఆర్థికంగా పటిష్టంగా ఉన్నందువల్లనే ఇవి సాధ్యమవుతున్నాయని గమనించాల్సి ఉంది .

  • ప్రతి ఏడాది సింగరేణి సమర్పించే స్పష్టమైన, లోపరహిత మైన ఆర్థిక లావాదేవీల నివేదికలను పరిశీలించిన కాగ్ గత కొన్నేళ్ళు గా తమ మెచ్చుకోలును తెలియజేస్తూ "నిల్" కామెంట్స్ పేర్కొంటున్నారు. ఇది కూడా సింగరేణి సంస్థ నిజాయితీతో అమలు చేస్తున్న ఆర్థిక విధానాలకు గుర్తింపుగా పేర్కొనవచ్చు.

  • తెలంగాణ సాధనలోనూ, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలోనూ కీలక భూమిక పోషిస్తున్న సింగరేణి సంస్థ కృషిని ప్రశంసించాల్సినవారు , అందుకు భిన్నంగా  సంస్థ కార్మికుల మనోధైర్యాన్ని, మార్కెట్లో కంపెనీకున్న విలువను, మంచి పేరును దెబ్బతీసే విధంగా మాట్లాడడం ఏమాత్రం సరికాదు.


ఇదీ గత 8 సంవత్సరాల్లో ప్రగతి- సింగరేణి


తెలంగాణ సాధించక పూర్వం 2013 -14తో పోలిస్తే గత ఏడాది 2022-23 నాటి గణాంక వివరాలను పరిశీలించినప్పుడు సాధించిన ఆర్థిక ప్రగతి వ్యక్తం అవుతుందని సింగరేణి తెలిపింది.



  • బాండ్లు , డిపాజిట్ల రూపంలో కంపెనీకి పెట్టుబడులు రూ. 11,665 కోట్లు

  • సింగరేణి పెట్టుబడులకు వస్తున్న వడ్డీ ఏడాదికి రూ. 750 కోట్లు

  • 273 శాతం వృద్ధి తో 32,830 కోట్ల టర్నోవర్

  • లాభాలు రూ. 459 కోట్ల నుంచి 500% వృద్ధితో రూ . 2,300 కోట్లకు చేరిక

  • కార్మికుల సగటు వేతనం 234 శాతం వృద్ధి తో రూ. లక్షా 40 వేలు

  • 30 శాతానికి పెంచి లాభాల బోనస్ చెల్లింపు

  • సోలార్ ప్లాంట్లతో ఏటా రూ. 150 కోట్ల ఆదా

  • సింగరేణి థర్మల్ ప్లాంటుతో ఏటా  రూ. 500 కోట్ల లాభాలు