Minister Harish Rao : ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉంటున్నాయని ప్రజలు... ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి పైసలు వృధా చేసుకోవద్దని మంత్రి హరీశ్ రావు సూచించారు. క్యాన్సర్‌ రోగులు జిల్లాల్లోనే కీమోథెరపీ చేయించుకునే సదుపాయం కల్పించనున్నామన్నారు. ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో కలిసి నూతన ఆంకాలజీ బ్లాక్‌ను మంత్రి హరీశ్ రావు ఆదివారం ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. నూతన బిల్డింగ్‌తో ఆస్పత్రిలో పడకల సంఖ్య 750కు పెరిగాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన రూ.60 కోట్లతో అన్ని సదుపాయలు కల్పించామన్నారు. దేశంలోనే ప్రభుత్వ రంగంలో క్యాన్సర్ చికిత్సకు రెండో అతిపెద్ద ఆస్పత్రిగా ఎంఎన్‌జే నిలుస్తుందన్నారు. నూతన బ్లాక్‌లో ప్రత్యేకంగా విమెన్, పీడియాట్రిక్ వింగ్ లు రానున్నాయని తెలిపారు. చికిత్స కోసం వచ్చే చిన్నపిల్లల చదువు దెబ్బతినకుండా పీడియాట్రిక్ వింగ్‌లో లైబ్రరీ, టీచర్‌ను ఏర్పాటు చేశామన్నారు. అదేవిధంగా బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు ప్రత్యేకంగా వార్డ్ ను ఏర్పాటు చేశామన్నారు. వీరికి ఆరోగ్య శ్రీ కింద జీవితాంతం మందులు ఉచితంగా ఇస్తామని మంత్రి హరీశ్ రావు తెలిపారు.  


ఈ ఏడాది మరో 9 మెడికల్ కాలేజీలు


బీఆర్ఎస్ ప్రభుత్వం సూపర్ స్పెషాలటీ వైద్య సదుపాయాలను అందుబాటులోకి తెస్తుందని మంత్రి హరీశ్ రావు తెలిపారు. వైద్య సేవలను ఎంతో పటిష్టం చేశామన్నారు.  గాంధీ, ఉస్మానియా, నిమ్స్, ఎంఎన్‌జే వంటి ప్రభుత్వ ఆసుపత్రులను పటిష్టం చేశామన్నారు. రాష్ట్రంలో నాలుగు టిమ్స్ ఆస్పత్రులు, వరంగల్ హెల్త్ సిటీ, నిమ్స్ విస్తరణతో 10 వేల పడకలు సూపర్ స్పెషాలిటీ బెడ్స్ ను అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు. మరో ఏడాదిలో ఇవి అందుబాటులోకి వస్తాయన్నారు. వైద్య విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్న మంత్రి హరీశ్ రావు..  ఈ ఏడాది మరో 9 మెడికల్ కాలేజీలు ప్రారంభిస్తామని ప్రకటించారు. 2014లో 20 మెడికల్ కాలేజీలు ఉంటే 2022 నాటికి 46కు చేరుకున్నాయన్నారు. తెలంగాణ వస్తే ఏ సాధిస్తారన్న వారికి ఇది రుజువు అన్నారు. ఈ ఏడాదితో  మెడికల్ కాలేజీలు 55 అవుతాయన్నారు. 65 ఏళ్లలో 20 మెడికల్ కాలేజీలు వస్తే 9 ఏండ్లల్లోనే 35 కాలేజీలు తెచ్చామన్నారు. తెలంగాణ వచ్చినప్పటి నుంచి క్యాన్సర్ కు సంబంధించి ఆరోగ్య శ్రీ ద్వారా రూ.800 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. త్వరలో కీమోథెరపీ చికిత్స అన్ని జిల్లాల్లోనే అందుబాటులోకి తెస్తామన్నారు. 


కార్యక్రమం మధ్యలోనే వెళ్లిపోయిన కిషన్ రెడ్డి 


ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రి నూతన బ్లాక్ ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రి హరీశ్ రావు ఆదివారం ప్రారంభించారు. పాత బ్లాక్ లో 450 పడకలు ఉండగా, కొత్త బ్లాక్ తో మరో 300 బెడ్స్ అందుబాటులోకి వచ్చాయి. నూతన బ్లాక్ లో పీడియాట్రిక్ వింగ్, విమెన్ వింగ్, నర్సింగ్ కాలేజీ, బోన్ మ్యారో ట్రాన్సప్లాంటేషన్ కు ప్రత్యేక వార్డ్స్ ఏర్పాటు చేశారు. నూతన ల్యాబ్, మరో రెండు ఆపరేషన్ థియేటర్స్ అందుబాటులోకి వచ్చాయి. ఈ బ్లాక్ ను రూ.80 కోట్లతో  అరబిందో ఫార్మా నిర్మించింది. అయితే ఈ కార్యక్రమం జరుగుతుండగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మధ్యలోనే వెళ్లిపోవడం చర్చకు దారితీసింది. కిషన్ రెడ్డికి ఇతర కార్యక్రమాలు ఉండటంతో మధ్యలోని వెళ్లినట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. కేంద్రమంత్రి అయి ఉండి ఇలా కార్యక్రమం మధ్యలోనే వెళ్లిపోవడం ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారు.