Congress Senior leader Madhuyashki : తాను ఎంపీ టికెట్ రేసులో లేనని, నిజామాబాద్ ఎంపీగా జీవన్ రెడ్డి పోటీ చేసే అవకాశం ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ చెప్పారు.  లోక్ సభ ఎన్నికల్లో పార్టీ ఆదేశించినా తాను పోటీ చేయనని స్పష్టం చేశారు.  గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.  లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ లక్ష్యం 15 లోక్ సభ స్థానాలు అని చెప్పారు. మెజార్టీ స్థానాలు తమ పార్టీయే గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల వరకు పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి కొనసాగుతారని వెల్లడించారు. బీజేపీ నేతల కన్ఫ్యూజన్‌ను క్లియర్ చేయడానికే అమిత్ షా వచ్చారని చురకలంటించారు. అమిత్ షా హైదరాబాద్ వచ్చింది బీజేపీ గెలుపుకోసం కాదని, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డిని మార్చడానికని జోస్యం చెప్పారు.               


పలువురు బీజేపీ నేతలు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. తెలంగాణ బీజేపీ నేతలు అయోమయంలో ఉన్నారని.. అందుకే ఆ పార్టీ అగ్రనేత అమిత్ షా హైదరాబాద్‌కు వచ్చారన్నారు. తమ ప్రత్యర్థి కాంగ్రెస్ అని ఓ వైపు బీజేపీ.. మరోవైపు బీఆర్ఎస్ చెబుతున్నాయన్నారు. మజ్లిస్ పార్టీ మద్దతు లేకుంటే కిషన్ రెడ్డి సికింద్రాబాద్ నుంచి గెలవరని విమర్శించారు. ఇతర ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకుంటే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని అన్నారు. ఎల్బీనగర్‌లో తనపై గెలిచిన  ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పార్టీ జంప్ కావడానికి సిద్ధంగా ఉన్నారని విమర్శించారు.                                                


సుధీర్ రెడ్డి అక్రమాస్తులు కాపాడుకోవడం కోసం ఏ పార్టీలోకైనా జంప్ అవుతారని చెప్పారు. ఎన్నికల నాటికి ఎల్బీనగర్ లో 30 వేల ఫేక్ ఓట్లు యాడ్ అయ్యాయని చెప్పారు. గ్రేటర్ లో ముస్లింలు, సెటిలర్ల ఓట్లు బీఆర్ఎస్ కే పడ్డాయని అన్నారు.  మంత్రి వర్గ విస్తరణ విషయంలో హైకమాండ్ జోక్యం చేసుకోబోదని, సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయమే ఫైనల్ అని చెప్పారు. మధుయాష్కీ గతంలో నిజామాబాద్ ఎంపీగాఓ సారి విజయం సాధించారు. రెండుసార్లు ఓడిపోయారు. ఇటీవల ఎల్బీనగర్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆయన స్థానికేతరుడు అని టిక్కెట్ ఇవ్వొద్దని చాలా మంది కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేసినా  హైకమాండ్‌కు సన్నిహితులు కావడంతో ఆయనకే చాన్స్ దక్కింది.                                   


ఇప్పుడు బీసీ కోటాలో ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తారని ఆయన ఆశిస్తున్నారు. అందుకే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయనని అంటున్నారని చెబుతున్నారు. ఓడిపోయిన వారికి ఎమ్మెల్సీ ఇచ్చి  మంత్రి పదవులు ఇచ్చే పరిస్థితి ఉండదని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే మధుయాష్కీ రాహుల్ గాంధీకి సన్నిహితులు. ఆయన చెబితే రేవంత్ రెడ్డి పదవి ఇస్తారని అంటున్నారు. అందుకే రేవంత్ రెడ్డి ఇష్టమని మధుయాష్కీ చెబుతున్నట్లుగా భావిస్తున్నారు.