Senior BJP leader Jitender Reddy will join the Congress party :  మాజీ ఎంపీ , సీనియర్ బీజేపీ నేత జితేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. హైదరాబాద్ లోని జితేందర్ రెడ్ి ఇంటికి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. సీఎం వెంట  మంత్రి పొంగులేటి, ఎమ్మెల్సీ ప‌ట్నం మహేందర్ రెడ్డి ఉన్నారు. పార్టీలో చేరేందుకు జితేందర్ రెడ్డి అంగీకరించారు. బీజేపీలో మహబూబ్ నగర్ టిక్కెట్ ను జితేందర్ రెడ్డి ఆశించారు. అయిేత ఆ స్థానాన్ని డీకే అరుణకు ఇచ్చారు. అసంతృప్తికి గురైన జితేందర్ రెడ్డితో కాంగ్రెస్ చర్చలు జరిపింది. ప్రస్తుతం మల్కాజిగిరి కోసం బలమైన అభ్యర్థి కోసం కాంగ్రెస్ వెదుకుతోంది. జితేందర్ రెడ్డికి అక్కడ అవకాశం కల్పిస్తామని ఆఫర్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. 



2019 ఎన్నికల సందర్భంగా జితేందర్ రెడ్డికి కేసీఆర్ టిక్కెట్ నిరాకరించారు. సిట్టింగ్ ఎంపీగా ఉన్న ఆయనకు టిక్కెట్ ఇవ్వకపోవడంతో బీజేపీలో చేరారు. అప్పటికి డీకే అరుణక బీజేపీ టిక్కెట్ ఖరారు చేసింది. దీంతో ఆయన ఎన్నికల్లో పోటీ చేయకుండా డీకే అరుణ కోసం ప్రచారం చేశారు. స్వల్ప తేడాతో డీకే అరుణ పరాజయం పాలయ్యారు. అయితే ఆ తర్వాత ఎంపీ టిక్కెట్ కోసం ఇద్దరు నేతలు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఒకరిని అసెంబ్లీకి పోటీ చేయించేందుకు హైకమాండ్ ప్రయత్నించింది. కానీ ఇద్దరూ పోటీ చేయలేదు. మహబూబ్ నగర్ అసెంబ్లీ స్థానం నుంచి జితేందర్ రెడ్డి కుమారుడికి చాన్సిచ్చారు. కానీ ఆయన ఘోరంగా ఓడిపోయారు. ఈ క్రమంలో ఎపీ టిక్కెట్ కోసం కూడా జితేందర్ రెడ్డి ప్రయత్నించారు. కానీ డీకే అరుణ గత ఎన్నికల్లో స్వల్ప తేడాతోనే పరాజయం పాలు కావడంతో ఆమెకే  చాన్సివ్వాలని నిర్ణయించుకున్నారు. 


వరుసగా రెండో సారి ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉంటే రాజకీయ భవిష్యత్ గందరగోళంలో పడుతుందన్న ఉద్దేశంతో జితేందర్ రెడ్డి పోటీకి సిద్ధమయ్యారు. అయితే మహబూబ్ నగర్ స్థానం నుంచి  ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థిగా వంశీచంద్ రెడ్డి ఉన్నారు. ఆయన సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడిగా కూడా ఉన్నారు ఆయనను కాదని జితేందర్ రెడ్డికి టిక్కెట్ ఇచ్చే పరిస్థితి లేదు. అందుకే  మల్కాజిగిరి స్థానం ఆయనకు ఆఫర్ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. చర్చలు కొలిక్కి రావడంతోనే రేవంత్ రెడ్డి.. జితేందర్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆహ్వానించారని భావిస్తున్నారు. 


మల్కాజిగిరిలో కాంగ్రెస్ పార్టీకి  బలమైన అభ్యర్థి లేరు. పలు పేర్లు పరిశీలనలో వచ్చినప్పటికీ అంత బలమైన నేతలుగా ప్రచారంలోకి రాలేదు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే , నాగర్ కర్నూలు నేత మర్రి జనార్ధన్ రెడ్డి మల్కాజిగిరి నుంచి పోటీ చేయడానికి ఆసక్తి చూపారు. అయితే.. రాష్ట్ర కాంగ్రెస్ నేతలు పెద్దగా ఆసక్తి చూపించలేదు. ప్రత్యామ్నాయంగా జితేందర్ రెడ్డిని ఒప్పించినట్లుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ తరపున శంభీపూర్ రాజు పోటీ చేయనున్నారు. జితేందర్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి అయితే.. మల్కాజిగిరిలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా పోరు సాగే అవకాశం ఉంది.