Sangareddy News: టామాటా ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో.. దొంగలు వీటిపై కన్నేశారు. తమకు అందినకాడికి దోచుకెళ్తూ.. సొమ్ము చేసుకుంటున్నారు. మరికొందరేమో వాటిని తీసుకెళ్లి కడుపునిండా తినేస్తున్నారు. తాజాగా సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో టమాటాల దొంగతనం జరిగింది. ఓ కూరగాయల మార్కెట్ లో ఉన్న టమాటా ట్రేలను ఎత్తుకెళ్లేందుకు ఓ గుర్తు తెలియని వ్యక్తి పకడ్బందీగా ప్లాన్ వేశాడు. హెల్మెట్టుతో పాటు జాకెట్ కూడా వేసుకొని వచ్చి రూ.6,500 విలువ చేసే మూడు టమాటాల ట్రేలను ఎత్తుకెళ్లిపోయాడు. అయితే ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. కమిషన్ ఏజెంట్ దుకాణంలో ఈ చోరీ జరగగా.. బాధిత ఏజెంట్ పోలీసులను ఆశ్రయించాడు. నిందితుడిపై ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


టమాటా లోడ్ లారీ బోల్తా.. ఎగబడ్డ జనాలు !


జాతీయ రహదారిపై జులై 15వ తేదీన టమాటా లోడ్ తో వెలుతున్న లారీ ఓ కారును తప్పించబోయి అదుపుతప్పి బోల్తా కొట్టింది. లారీ డ్రైవర్, క్లీనర్ చాక చక్యంగా వ్యవహరించి ప్రాణాలతో బయటపడ్డారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి దగ్గరగా మావల చౌరస్తా వద్ద జాతీయ రహదారిపై ఈ టమాటా లారీ బోల్తా కొట్టడంతో అందులోని టమాటాలను చూసిన స్ధానికులు టమాటాల కోసం ఒక్కసారిగా ఎగబడ్డారు. యజమాని, లారీ డ్రైవర్, క్లీనర్ అప్పటికే పోలీసులకు సమాచారం అందించడంతో పాటు సహాయం కోరారు. దాంతో హుటాహటీన అక్కడకు చేరుకున్న పోలీసులు జనాలను చెదరగొట్టారు. టమాటాల కోసం  తండోపతండాలుగా తరలి వచ్చిన జనం పోలీసులను చూసి ఖాళీ చేతులతో వెనక్కి వెళ్లి పోయారు. టమాటాలు ఎత్తుకెళ్లకుండా పోలీసులు జాగ్రత్తపడ్డారు. హైవే పెట్రోలింగ్ పోలీస్ సిబ్బంది ప్రత్యేక పైలట్ వాహనంతో అక్కడ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.


కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ నుండి ఢిల్లీకి లారీలో టమాటా లోడ్ తీసుకెళుతుండగా ఆదిలాబాద్ జిల్లా మావల చౌరస్తా సమీపంలో ఓ కారు ను తప్పించబోయి లారీ బోల్తా పడింది. యజమాని తో పాటు డ్రైవర్ , క్లినర్ లు కింద పడిన టమాటా క్యారెట్ లను సరిచేస్తున్నారు. ఈ లారీలో ఉన్న టమాటా విలువ మొత్తం సుమారుగా 22లక్షలు ఉంటుందని, ఇందులో సగం టమాటా లోడ్ డ్యామేజ్ కావడం జరిగిందని, 8 నుండి 10లక్షల రూపాయల వరకు నష్టం వాటిల్లుతుందని, మిగతా టమాటా ను నాగ్ పూర్ నుండి తమ వేరే వాహనంలో ఢిల్లీ కి తీసుకెళ్ళి మార్కెట్ లో అమ్ముతామని వారు abp తో తెలిపారు.


టమాటా లారీ లోడ్ వద్ద పోలీసుల బందోబస్తు


అటు పోలీసులు మేషిన్ గన్ లతో ఈ టమాటా కు సెక్యూరిటీగా నిలిచారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా టమాటా కు భారీ ధర ఉండడంతో డిమాండ్ పెరిగింది కావున జనాలు టమాటాల కొసం ఎగబడకుండా వారికి నష్టం వాటిల్లకుండా బందోబస్తు ఏర్పాటు చేసి వారికీ రక్షణగా నిలిచామన్నారు. మొత్తానికి టమాటాకు దేశవ్యాప్తంగా భారీ డిమాండ్ ఉండడంతో టమాటా పెరు చెబితేనే అందరు ఉలిక్కపడుతున్నారు. ప్రమాదం కారణంగా టమాటా సగం లోడ్ దెబ్బతిని యజమానికి భారీగానే నష్టం వాటిల్లడం విచారకరం.