తెలంగాణలో బీహార్ ఉన్నతాధికారుల ముఠా రాజ్యమేలుతోందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ కూడా తమ పూర్వీకులు బీహార్ నుంచి వలస వచ్చారని 2008లో ప్రకటించుకున్నారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. వందలాది బలిదానాలతో తెలంగాణ సాధించుకున్నా  ఎనిమిదేళ్లలో తెలంగాణ పౌరులకు పరిపాలనలో అవకాశాలు ఇవ్వడం లేదని ఆరోపించారు.  సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ అంజనీ కుమార్ తో బీహార్ ఐఏఎస్ లకు ఒక్కొక్కరి వద్ద ఆరు శాఖలు ఉన్నాయని.. బీహార్ ఐఏఎస్ లను ఒక రక్షణ వలయంగా ఏర్పాటు చేసుకొని పరిపాలన చేస్తున్నారని రేవంత్ మండిపడ్డారు. తెలంగాణ ప్రాంత అధికారుల తీరు ప్రశ్నార్థకంగా మారిందన్నారు. 



మీ పూర్వికులు బీహార్ కావొచ్చు కానీ  పరిపాలన మొత్తం బీహార్ బ్యాచ్ కే ఇస్తారా అని కేసీఆర్‌ను రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. 152 మంది ఐఏఎస్ లలో కేవలం బీహార్ ఐఏఎస్ లే ప్రతిభావంతులా అని ప్రశ్నించారు.  సీఎస్ సోమేశ్ కుమార్ ఐఏఎస్ సర్వీస్ లో ఏడేళ్లు పని చేయలేదని సోమేశ్ కుమార్ సీనియారిటీ ప్రకారం  ప్రిన్సిపల్ సెక్రటరీ కే పరిమితమవ్వాలి .. కానీ సీఎస్ గా బాధ్యతలు ఇచ్చారన్నారు.  విభజన సందర్భంగా ఏపీ క్యాడర్ కు సోమేశ్ కుమార్ ను కేటాయించారని ఈ అంశంపై డీవోపీటీలో కేసు ఉంటే బెంచ్ మీదకు రాకుండా మేనేజ్ చేస్తున్నారని ఆరోపించారు.  జయేష్ రంజన్ , అరంవింద్ కుమార్ , సందీప్ కుమార్ సుల్తానియా , రజత్ కుమార్ వీరందరూ బీహార్ కు చెందిన ఐఏఎస్ లు ఒక ముఠాగా ఏర్పడ్డారన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో 30 లక్షల ఓట్లను సోమేశ్ కుమార్ తొలగించారు... నజరానా గా సీఎస్ పోస్ట్.. రజత్ కుమార్.. జనరల్ ఎన్నికల్లో అవక తవకలకు సహకరించినందుకు ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రకరీ ఇచ్చారని ఆరోపించారు. జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజ్ కూడా బీహార్ బ్యాచ్.. బీహార్ ఐఏఎస్ లపై నిఘా పెట్టాలని రేవంత్ డిమాండ్ చేశారు. 
 


అరవింద్ కుమార్ చేస్తున్న అక్రమాలు అన్నీ ఇన్నీ కావు.. ఈయనకు ఆరు శాఖలు ఇచ్చారు. ఐపీఎస్ అంజనీ కుమార్ కూడా బీహార్ బ్యాచ్.. డీజీపీ మహేందర్ రెడ్డి ని ఉన్న ఫలంగా పంపించి.. బీహార్ బ్యాచ్  అంజనీ కుమార్ ను తీసుకొచ్చారన్నారు.  రాష్ట్రం మొత్తం  బీహారీల చేతిలో బందీ చేశారు. పరిపాలనలో బీహారీల తప్పుడు విధానాల వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ధరణి పోర్టల్ దేశానికే ఆదర్శమని సీఎం కేసీఆర్ పదే పదే చెబుతూ వచ్చారని ఇప్పుడు ఈ పోర్టర్ కారణంగానే భూతగాదాలతో హత్యలకు దిగుతున్నారని ఆరోపించారు.  ఇబ్రహీంపట్నం లో ఇద్దరు మర్డర్లు  ధరణి లోపాల వల్లే జరిగాయన్నారు. సీఎస్ సోమేశ్ కుమార్ తీరుతో ధరణి లోపభూయిష్టంగా మారిందని రేవంత్ మండిపడ్డారు.ధరణి పోర్టల్ ను అడ్డంపెట్టుకుని అవుటర్ రింగ్ చుట్టూ లక్షలాది ఎకరాలు గోల్ మాల్ అయ్యిందని ..బీహార్ ఐఏఎస్ ముఠా  కారణంగా తెలంగాణ సమాజం ఇబ్బందులు ఎదుర్కొంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. 


ప్రతిపక్ష నేతగా తాను విమర్శలు చేస్తూంటే  వివరణ ఇవ్వాల్సింది పోయి.. మళ్లీ బీహార్ వ్యక్తులు రంగంలో కి దిగారని మండిపడ్డారు. బీహార్ మంత్రి సంజయ్ కుమార్ ఝా అనే మంత్రి.. కేసీఆర్ సమర్థిస్తూ తనను విమర్శిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా తెలంగాణ కు చెందిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు మాట్లాడాలని.. చైతన్య వంతమైన తెలంగాణ సమాజం ఆలోచన చేయాలని పిలుపునిచ్చారు.