మూడు నెలలుగా తెలంగాణ రైతులు వరి ధాన్యం అమ్ముకోలేక అవస్థలు పడుతున్నారని ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ లో కాంగ్రెస్ శ్రేణులు రైతుల సమస్యలపై పోరాటం చేస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వ వైఖరి భిన్నంగా ఉందని విమర్శించారు. టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ లో మొక్కుబడి ఆందోళన చేస్తున్నారని.. ఎంపీలు సేద దీరే పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో టీఆర్ఎస్ ఎంపీలు దీక్ష చేస్తున్నట్లు నటిస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. 


కేసీఆర్, ఎంపీల ప్రకటనల వల్ల తెలంగాణ రైతుల సమస్యలు పరిష్కారం కావని రేవంత్ రెడ్డి అన్నారు. మిల్లర్ల మాఫియాలో బందీ అయిన రాష్ట్ర ప్రభుత్వం వారి ప్రయోజనాల కోసం ధాన్యం కొనుగోలును కుదించుకుందని విమర్శించారు. రైతులను మిల్లర్ల మాఫియాకు అప్పగించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న లెక్కల ప్రకారం ధాన్యం కొనుగోలు కేంద్రాలు లేవన్నారు. 


2018, 2019, 2020లలో తెలంగాణ ప్రభుత్వం.. ఎఫ్.సి.ఐ ఇచ్చిన టార్గెట్ ను పూర్తి చేయలేదని.. రేవంత్ రెడ్డి ఆరోపించారు.  వరంగల్ లో మాయం అయిన 25 వేల మెట్రిక్ టన్నుల బియ్యం ఘటనపై కేంద్రం ఎందుకు విచారణ జరపడం లేదన్నారు. 'రేపటి నుంచి టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ లో ఆందోళన చెయ్యరు. కేసీఆర్ ఆదేశాల మేరకు అందరూ హైదరాబాద్ పయనం అవుతారు. బీజేపీ, టీఆర్ఎస్ ల మధ్య ఒప్పందంలో భాగంగా టీఆర్ఎస్ ఎంపీలు తమ నిరసనను ముగిస్తున్నారు. తెలంగాణ రైతులు తమ తమ ఎంపీలను నిలదీసి ప్రశ్నించాలి? తాను బతికి ఉన్నంతకాలం రైతులకు కష్టం రానియ్యనన్న కేసీఆర్ ఇప్పుడు ఏ సమాధానం చెబుతారు? ఆదాని, అంబానీ లకు రైతుల ప్రయోజనాలను కేసీఆర్ , కేంద్ర ప్రభుత్వం తాకట్టు పెడుతున్నాయి. కేసీఆర్, నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్ లు తమ పదవుల్లో కొనసాగే హక్కు లేదు. కేంద్ర ఇచ్చిన టార్గెట్ తగ్గిస్తే దానికి టీఆర్ఎస్ ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. రానున్న రోజులలో తెలంగాణ రైతుల ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీ జంతర్ మంతర్ వేధికగా ధర్నా చేస్తాం. టీఆర్ఎస్ ఎంపీలను కోడిగుడ్లు, టమాటలు, చీపుర్లతో కొట్టి సన్మానించాలి. తెలంగాణలో బియ్యం సేకరణలో జరిగిన అక్రమాలపై ఫిర్యాదు చేయడానికి కేంద్ర మంత్రిని అపాయింట్మెంట్ అడిగితే ఇవ్వడం లేదు. టీఆర్ఎస్, బీజేపీ ఎంపీలు రెండు తోడు దొంగలే.. ఈ రెండు పార్టీలతో కాంగ్రెస్ పార్టీ వేదిక పంచుకోదు.' అని రేవంత్ రెడ్డి విమర్శించారు.


Also Read:  మూడో భార్యతో ఉంటూ.. రెండో భార్యను చంపాలని భర్త క్షుద్రపూజలు.. చేతబడికి పాస్ పోర్ట్ సైజ్ ఫొటో


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి