CM Revanth In Delhi :  తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు.  ఏఐసీసీ పెద్దలతో ఆయన భేటీకానున్నారు. లోక్ సభ ఎన్నికలకు సంబంధించి హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్ స్థానాలు పెండింగ్ లో ఉన్నాయి. ఈ స్థానాల్లో అభ్యర్థుల ఎంపికకు సంబంధించి పార్టీ పెద్దలతో రేవంత్ భేటీ అవుతారు. ఈ భేటీలో అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉంది.   14 పార్లమెంట్‌ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్.. మరో మూడు స్థానాలను మాత్రం పెండింగ్‌లో పెట్టింది. ఖమ్మం, కరీంనగర్ అభ్యర్థులపై హస్తం నేతలు ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారు.                                     

  


ఖమ్మం సీటు కాంగ్రెస్‌లో హాట్ టాపిక్ గా మారింది. ఉమ్మడి ఖమ్మంలో మిత్రపక్షం సీపీఐతో కలిసి అన్ని చోట్ల విజయం సాధించారు.   ముగ్గురు మంత్రులు తమ కుటుంబసభ్యులకు టికెట్ కోసం పోటీ పడుతున్నారు. తన తమ్ముడికి టికెట్ ఇస్తే గెలిపించే బాధ్యత తీసుకుంటానని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పార్టీ పెద్దలకి చెప్పినట్టు సమాచారం. ఇక తన సతీమణి నందినికి టికెట్ ఇవ్వాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైకమాండ్‌ను కోరినట్లు తెలుస్తోంది.మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన కుమారుడు యుగంధర్‌కు ఖమ్మం సీటు ఇవ్వాలని కోరుతున్నారు. సీనియర్ వి.హనుమంతరావు కూడా ఖమ్మం టికెట్ కోసం అధిష్ఠానాన్ని కలిశారు.   సామాజిక సమీకరణలో భాగంగా ఎవరికి టికెట్‌ ఇస్తారనేది పార్టీలో హాట్ టాపిక్ గా మారింది.                       


కరీంనగర్ ఎంపీ టికెట్‌ విషయంలోనూ కాంగ్రెస్ ఒక క్లారిటీకి రాలేకపోతోంది. కరీంనగర్ అభ్యర్థిగా పోటీ చేయాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని అధిష్ఠానం కోరగా ఆయన నిజామాబాద్ నుంచి పోటీ చేస్తానని చెప్పడంతో కరీంనగర్ టికెట్ పెండింగ్ లో పడింది. మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి, పార్టీ నేత వెల్చాల రాజేందర్‌రావు టికెట్ ఆశిస్తున్నారు.  కరీంనగర్‌లో వెలమ సామాజికవర్గానికి చెందిన ఓట్లు ఎక్కువగా ఉండటంతో..ఆ సామాజిక వర్గానికి చెందిన రాజేందర్ రావు పేరు బలంగా వినిపిస్తోంది.                  


హైదరాబాద్ అభ్యర్థి విషయంలో కూడా కాంగ్రెస్ ఈక్వేషన్స్ మారిపోయాయి.  ఇటీవల కాంగ్రెస్‌కు ఎంఐఎం దగ్గర కావడంతో.. పెద్దగా పోటీ ఇవ్వని బలహీన నేతను దింపాలన్న ఆలోచన చేస్తున్నారు.  హిందూ అభ్యర్థిని బరిలోకి దింపితే..మజ్లిస్ రాష్ట్రం మొత్తం మద్దతిస్తుందన్న ఆలోచన చేస్తున్నారు.  ఢిల్లీ పర్యటనను ముగించుకుని వచ్చిన తర్వాత రేవంత్ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేయనున్నారు. మొత్తం 17 లోక్ సభ స్థానాల్లో 10కి పైగా స్థానాల్లో విజయం సాధించి సత్తా చాటాలని కాంగ్రెస్ పట్టుదలతో ఉంది. శాసనసభ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ పెద్దగా ప్రభావం చూపలేకపోయిన కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది.