ఎడారి దేశంలో తెలియక చేసిన నేరానికి శిక్ష అనుభవిస్తున్న తెలంగాణకు చెందిన ఐదుగురుని విడుదల చేయాలని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వానికి మంత్రి కే. తారక రామారావు విజ్ఞప్తి చేశారు. ప్రగతిభవన్లో సమావేశమైన యూఏఈ రాయబారి అబ్దుల్ నసీర్ అల్ షా అలీకి మంత్రి కేటీఆర్ కేసుకు సంబంధిచంచిన వివరాలను అందజేశారు.


రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన శివరాత్రి మల్లేష్, శివరాత్రి రవి, నాంపల్లి వెంకట్, దండుగుల లక్ష్మణ్, శివరాత్రి హనుమంతులు ప్రస్తుతం దుబాయ్ లో ఒక కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్నారు. 2005లో నేపాల్ కు చెందిన దిల్ ప్రసాద్ రాయ్ మరణం విషయంలో వీరు ప్రస్తుతం శిక్ష అనుభవిస్తున్నారు. అయితే యూఏఈ చట్టాల ప్రకారం (షరియా చట్టం) మేరకు రూ. 15 లక్షల పరిహారాన్ని బాధితుని కుటుంబం స్వీకరించేందుకు అంగీకరించిందని కేటీఆర్ తెలిపారు. ఈ మేరకు గతంలోనే స్వయంగా తాను నేపాల్ వెళ్లి 2013లోనే బాధితుడి కుటుంబాన్ని కలిసినట్లు చెప్పారు.


షరియా చట్టంలోని (Diyyah) ప్రకారం బాధితుల కుటుంబం (blood money తీసుకుని)  క్షమాపణ పత్రం అందిస్తే, వీరిని విడుదల చేసే అవకాశం ఉందని కేటీఆర్ అన్నారు. ఈ మేరకు బాధితుని కుటుంబం 2013లోనే అవసరమైన అన్ని రకాల డాక్యుమెంట్లను దుబాయ్ ప్రభుత్వానికి ఇచ్చిందని కేటీఆర్ తెలిపారు. ఇప్పటికే భారత దౌత్య కార్యాలయంతో పాటు యూఏఈ ఎంబసీకి సైతం ఈ విషయంలో అనేకసార్లు తాను స్వయంగా విజ్ఞప్తి చేసినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. అయితే యూఏఈ కోర్టు వీరి క్షమాభిక్ష పిటిషన్ తిరస్కరించింది. ఈ క్రమంలో దుబాయ్ రాజు షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తుమ్ క్షమాభిక్ష పెడితేనే బాధితులకు విముక్తి లభిస్తుందని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.


ఈ మేరకు తాను వివరించిన ఈ సంఘటన తాలూకు వివరాలను అటు భారత, నేపాల్ దౌత్య కార్యాలయాల ద్వారా విచారించుకోవాలన్నారు. క్షమాభిక్షకు అర్హమైన ఈ కేసులో, దుబాయ్ రాజు సానుకూలంగా స్పందించేలా ఆయన దృష్టికి తమ విజ్ఞప్తిని తీసుకురావాలని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ రాయబారిని కోరారు. ఈ అంశంలో ప్రత్యేకంగా చొరవ చూపించి, దుబాయిలోని అవీర్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఐదుగురు తెలంగాణ వాసులను వెంటనే భారతదేశానికి పంపించేలా ప్రయత్నం చేయాలని కోరారు.


మంత్రి కేటీఆర్ తో జరిగిన ఈ భేటీలో యూఏఈ రాయబారి అబ్దుల్ నసీర్ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని ప్రశంసించారు. ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయి నగరాలతో పోటీపడేలా నిర్మిస్తున్న మౌలిక వసతులతో హైదరాబాద్ ముఖచిత్రం మరింతగా మారుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇక్కడ ఉన్న స్టార్టప్ ఇకో సిస్టం, ఐటీ, వాటి అనుబంధ రంగాల్లో తెలంగాణ బలం గురించి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. రాష్ట్రంలోని వివిధ పారిశ్రామిక రంగాల్లోని పెట్టుబడి అవకాశాలను,  తెలంగాణ ప్రభుత్వ పాలసీలను మంత్రి కేటీఆర్, యూఏఈ రాయబారికి వివరించారు.


ఇప్పటికే నగరంలోని స్టార్టప్ ఇకో సిస్టంతో ఫ్రాన్స్, అమెరికా వంటి దేశాల్లోని వెంచర్ క్యాపిటలిస్టులు, ఇన్నోవేషన్ ఇకోసిస్టం భాగస్వాములు కలిసి పనిచేసేందుకు ముందుకు వచ్చారని, ఇదే రీతిన యూఏఈ లోని వెంచర్ క్యాపిటలిస్టులను టీ హబ్ కు పరిచయం చేయాలని ఈ సందర్భంగా కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. కేటీఆర్ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన యూఏఈ రాయబారి, తమ దేశంలోని ఔత్సాహిక వెంచర్ క్యాపిటలిస్టులను, హైదరాబాద్ ఇకో సిస్టంలోని స్టార్టప్ సంస్థలను అనుసంధానం చేసేలా ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు.