Rajagopalreddy EC :   రాజగోపాల్ రెడ్డికి ఎన్నికల సంఘం నుంచి ఊరట లభించింది.  రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఉపఎన్నికల్లో పంచేందుకు ఆ నియోజవర్గంలోని నేతలకు.. తన కంపెనీ సుశఈ ఇన్ ఫ్రా నుంచి పెద్ద  ఎత్తున నగదు బదిలీ చేశారని టీఆర్ఎస్ చేసిన ఫిర్యాదుపై ఈసీ స్పందించింది. టీఆర్ఎస్ చేసిన ఫిర్యాదుకు సరైన ఆధారాలు లేవని స్పష్టం చేసింది. అదే సమయంలో ఎన్నికల్లో అభ్యర్థుల ఖర్చుపై పూర్తి స్థాయిలో నిఘా ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది. 


సుశీ ఇన్ ఫ్రా కంపెనీ తనది కాదని సమాధానం ఇచ్చిన రాజగోపాల్ రెడ్డి ! 


సుశీ ఇన్ ఫ్రా కంపెనీతో తనకు సంబంధం లేదని రాజగోపాల్ రెడ్డి ఈసీకి ఇంతకు ముందు సమాధానం ఇచ్చారు.  ఆ సంస్థ ఎవరికి డబ్బులు పంపిందో తనకు తెలియదన్నారు. ఆ కంపెనీలో తన కుమారుడు డైరక్టర్‌గా ఉన్నారని  ఆ కంపెనీ చేసే లావాదేవీలపై తనకు ఏ మాత్రం సమాచారం ఉండదన్నారు. ఈ సమాధానంపై ఈసీ సంతృప్తి చెందింది.  అయితే ఆ డబ్బులు ఓటర్లను  పంచడానికేనని.. నిరూపించే ఆధారాలు టీఆర్ఎస్ సమర్పించలేకపోయింది.  


రూ. ఐదు కోట్ల నగదును పంపిణీకి బదిలీ చేశారని టీఆర్ఎస్ ఫిర్యాదు ! 


రాజగోపాల్ రెడ్డి   కుటుంబ సభ్యులకు చెందిన సుశీ ఇన్ఫ్రా అండ్ మైనింగ్ లిమిటెడ్ కు సంబంధించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఖాతా నుంచి ఈ నెల 14, 18, 29న పెద్ద మొత్తంలో నగదు బదిలీ జరిగిందని టీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ సోమ భరత్ కుమార్  ఈసీఐకి ఫిర్యాదు చేశారు.   దాదాపు రూ.5.24 కోట్లను మునుగోడు నియోజకవర్గంలోని  23 మందికి చెందిన బ్యాంక్ ఖాతాలకు ట్రాన్స్ ఫర్ చేసినట్లు అందులో పేర్కొన్నారు. ఈ నగదుతో ఓటర్లను ప్రభావితం చేసేందుకు యత్నిస్తున్నట్లు ఆరోపించారు. ఈ వ్యవహారంపై స్పందించిన ఈసీ ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్ కుమార్.. రాజగోపాల్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. 
 
అత్యంత ఖరీదుగా మారిన మునుగోడు ఉపఎన్నిక


మునుగోడు ఉపఎన్నికలు అత్యంత ఖరీదైనవిగా మారాయి. డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవలి కాలంలో హైదరాబాద్ నుంచి మునుగోడుకు తరలిస్తున్నట్లుగా భావిస్తున్న రూ. కోట్లు పట్టుబడుతున్నాయి. హవాలా ఏజెంట్ల నుంచి ఈ నగదు తరలి పోతోంది. ఇలా పట్టుబడుతున్న సొమ్ము అంతా..  బీజేపీదేనని టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో మునుగోడు నియోజకవర్గంలోని బీజేపీ నేతల ఖాతాల్లోకి డబ్బులు జమ అయినట్లుగా టీఆర్ఎస్ గుర్తించి ఫిర్యాదు చేసింది. 


ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారంటున్న బీజేపీ !


మరో వైపు బీజేపీ నేతల ఫోన్లను ట్యాప్ చేస్తూ..  బ్యాంకు లావాదేవీల రహస్య సమాచారాన్ని అక్రమంగా సేకరిస్తూ.. టీఆర్ఎస్ తప్పిదాలకు పాల్పడుతోందని టీార్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని వారు ప్రకటించారు. 


మునుగోడులో ప్రచారం చివరి రోజు ఉద్రిక్తత - ఈటల కాన్వాయ్‌పై రాళ్ల దాడి, పలువురికి గాయాలు !