తెలంగాణలో కాంగ్రెస్ నేడు కొల్లాపూర్ లో నిర్వహించున్న సభలో మార్పు చోటు చేసుకుంది. ఈ సభలో ముందస్తు ప్రణాళిక ప్రకారం అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ పాల్గొనాల్సి ఉండగా, ఒకరు వెనక్కు తగ్గారు. అనారోగ్య కారణాల వల్ల ప్రియాంకా గాంధీ గైర్హాజరు కానున్నారు. ప్రియాంక కొల్లాపూర్ పర్యటన రద్దు చేసకున్నట్లుగా కాంగ్రెస్ వర్గాలు ప్రకటించాయి. దీంతో రాహుల్ గాంధీ మాత్రమే కొల్లాపూర్ సభలో పాల్గొననున్నారు.


మంగళవారం సాయంత్రం కొల్లాపూర్ నియోజవర్గ కేంద్రంలో నిర్వహించే పాలమూరు ప్రజా గర్జన బహిరంగ సభలో పాల్గొని ఆమె ప్రసంగించాల్సి ఉంది. ముందుగా నిర్ణయించిన ప్రకారం దేవరకద్ర నియోజకవర్గంలో ప్రియాంక పర్యటన రద్దయింది. 


నవంబర్‌ 1, 2 తేదీల్లో కూడా రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటిస్తారు. 1న కల్వకుర్తి, జడ్చర్ల షాద్‌ నగర్‌ సభల్లో ఆయన పాల్గొంటారు. నవంబర్‌ 2వ తేదీన మేడ్చల్‌, మల్కాజ్‌ గిరి, కుత్బుల్లాపూర్‌ సభల్లో పాల్గొని ప్రసంగిస్తారు. రాహుల్ తొలి విడత యాత్ర తరహాలోనే ఈ యాత్ర కూడా విజయవంతం అవుతుందని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఆశిస్తున్నారు. కాగా ఈనెల 18 నుంచి మూడు రోజుల పాటు రాహుల్‌, ప్రియాంక గాంధీ ఉత్తర తెలంగాణలో తొలి విడత విజయభేరి బస్సు యాత్ర చేపట్టారు. కాంగ్రెస్‌, ఉమ్మడి వరంగల్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో యాత్ర సాగింది.