Modi On KCR :  భారత రాష్ట్ర సమితి చీఫ్ కేసీఆర్ ఎన్డీఏలో చేరేందుకు ప్రయత్నించారని కానీ తాము చేర్చుకోలేదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిజామాబాద్ బహిరంగసభలో ప్రకటించారు. గతంలో లేని విధంగా నిజామాబాద్ సభలో  ప్రధాని మోదీ పూర్తిగా రాజకీయ ప్రసంగం చేశారు. అందులో కేసీఆర్ ను టార్గెట్ గా చేసుకుని ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.


గ్రేటర్ మేయర్ పీఠం ఇస్తామని కేసీఆర్ ఫర్ 


 గ్రేటర్ ఎన్నికలు ముగిన తర్వాత రోజే కేసీఆర్ ఢిల్లీ వెళ్లారు. ఎందుకు వెళ్లారో తెలియదు కానీ.. ఆ రోజున కేసఆర్ తనతో ఏం మాట్లాడారో మోదీ  చెప్పారు. ఎన్డీఏలో చేరుతామని..  గ్రేటర్ హైదరాబాద్ మేయర్ పీఠం ఇస్తామని కేసీఆర్ ప్రతిపాదన పెట్టారని మోదీ చెప్పారు. అయితే ఎన్డీఏలో చేర్చుకునేందుకు తాము సిద్ధంగా లేమని చెప్పామని  మోదీ స్పష్టం చేశారు.  ప్రతిపక్షంలో అయినా కూర్చుకుంటాము కానీ బీఆర్ఎస్‌తో కలిసేది లేదని చెప్పి పంపిచామని మోదీ నిజామాబాద్ సభలో ప్రకటించారు. గ్రేటర్ ఎన్నికల్లో 56 సీట్లతో బీఆర్ఎస్ అతిపెద్ద పార్టీగా అవతరించింది.  48 స్థానాల్లోబీజేపీ రెండో స్థానంలో నిలిచింది.  మేయర్ పీఠం కోసం అవసరమైన సీట్లు ఎవరికీ రాలేదు. 


కేటీఆర్‌ను సీఎం చేస్తానంటే మోదీ ఏమన్నారంటే ? 


ఆ తర్వాత  కేసీఆర్ మరోసారి ఢిల్లీకి వచ్చి తాను చాలా చేసానని.. ఇక తన  కుమారుడు కేటీఆర్‌కు బాధ్యతలు  ఇస్తానని.. సహకరించాలని కోరారన్నారు. అయితే తాను మీరేమైనా రాజులా అని ప్రశ్నించాననని మోదీ తెలిపారు. ప్రజలు ఆశీర్వదిస్తేనే పాలకులు అవుతారని చెప్పానన్నారు. అప్పుడే కేసీఆర్ అవినీతి  చిట్టా అంతా తాను చెప్పానన్నారు. అప్పట్నుంచి కేసీఆర్ తనను కలవడం మానేశారని చెప్పారు. గ్రేటర్ ఎన్నికలకు ముందు వరకూ తాను వస్తే.. స్వాగతం చెప్పేందుకు కేసీఆర్ వచ్చే వారని.. ఆ తర్వాత నుంచి మొహం చాటేస్తున్నారని మోదీ తెలిపారు. తన కళ్లలోకి చూడటానికి కేసీఆర్ భయపడుతున్నారని మోదీ వ్యాఖ్యానించారు. 


తెలంగాణను దోచుకున్న కేసీఆర్ ఫ్యామిలీ 


ఎంతో మంది బలిదానాలతో వచ్చిన  తెలంగాణను ఓ కుటంబం దోచుకుంటోందని మోదీ  మండపడ్డారు. తెలంగాణ తరహాలో డబ్బులు  వెదజల్లి గెలవాలనుకుంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్,  బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందం ఉందన్నారు. కర్ణాటకలో  కాంగ్రెస్‌కు బీఆర్ఎస్సే డబ్బులు పంపిందని స్పష్టం చేశారు. కేసీఆర్ పాలనలో అవినీతి పెరిగిందని కుటుంబసభ్యులందరూ దోపిడీ చేస్తున్నారని ప్రధాని మోదీ మండిపడ్డారు. తనపై నమ్మకం ఉంచి.. తెలంగాణలో బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వారని.  కేసీఆర్ కుటుంబం దోచుకున్నదంతా కక్కిస్తానని హామీ ఇచ్చారు. కేసీఆర్ , ఆయన కమారుడు, కుమార్తె, అల్లుడు మాత్రమే ధనవంతులయ్యారని  మోదీ విమర్శించారు.  తెలంగాణ ప్రభుత్వం అలయాల సొమ్మునూ దోచుకుంటుందోని విమర్శించారు. 


కేసీఆర్ స్పందిస్తారా ? 


తెలంగాణ రాజకీయాల్లో  ప్రదాని మోదీ చేసిన వ్యాఖ్యలు సంచలనం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధాని మోది చెప్పినట్లుగా  కేసీఆర్ .. గ్రేటర్ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాతి రోజే ప్రధానితో భేటీ అయ్యారు. ఆ తర్వాక కేటీఆర్‌ను సీఎం చేసేందుకు ముహుర్తం ఖరారు చేశారని చాలా సార్లు ప్రచారం జరిగింది. మోదీ.. కేసీఆర్ తనతో చర్చించిన విషయాలనే నిజామాబాద్ బహిరంగసభలో చెప్పారు. వీటిపై బీఆర్ఎస్ నేతల స్పందన ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది.  నేరుగా కేసీఆర్ తో జరిగిన భేటీల సమాచారమే  మోదీ  బయట పెట్టినందున కేసీఆర్ స్పందిస్తారని రాజకీయవర్గాలు ఎదురు చూస్తున్నాయి.