Sharmila In Delhi :   2జీ, కోల్ గేట్ స్కాంల కన్నా  కాళేశ్వరం దేశంలోనే అతిపెద్ద స్కామ్ అని కేంద్రం విచారణ జరిపించాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల డిమాండ్ చేశారు.  ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆందోళన చేపట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని, దీనిపై సీబీఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతిపై విచారించాలని కోరారు.  ‘కేసీఆర్ హఠావో.. తెలంగాణ బచావో’ అంటూ వైఎస్ఆర్‌టీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. 


కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో ముఖ్యమంత్రి కేసీఆర్ వేల కోట్ల కమీషన్లు దండుకున్నారని వైఎస్ షర్మిల ఆరోపించారు. రీ డిజైనింగ్ పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టును మూడు రెట్లు వ్యయం పెంచారని చెప్పారు. కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని మరోసారి ఆరోపించారు. సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత రీ డిజైనింగ్ పేరుతో ఒక లక్షా 20 వేల కోట్ల రూపాయలను ప్రాజెక్టుపై ఖర్చు పెట్టి...  18లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామని చెప్పి, 1.5లక్షల ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేదని షర్మిల యారోపించారు.   పారింది 18లక్షల ఎకరాలు కాదని 1.5లక్షల ఎకరాలే అని అసెంబ్లీలో బీఆర్ఎస్ మంత్రే ఒప్పుకున్నాడని గుర్తు చేశారు. 


 ఈ ప్రాజెక్టుకు ఖర్చు చేసిన రూ.1.20లక్షల కోట్లలో దాదాపు రూ.లక్ష కోట్లు కేంద్ర సంస్థలే రుణాలు ఇచ్చాయని..  పవర్ కార్పొరేషన్ రూ.38వేల కోట్లు, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ రూ.30వేల కోట్లు, పీఎన్ బీ రూ.11వేల కోట్లు, నాబార్డ్, ఇతర సంస్థలు కలిపి రూ.20వేల కోట్ల వరకు రుణాలు ఇచ్చాయన్నారు.   ఈ సొమ్మంతా దేశ ప్రజలదే.. అందుకే ఇది దేశంలోనే అతి పెద్ద స్కాం  అని ఆరోపించారు.  కాళేశ్వరం విఫలమైన ప్రాజెక్టు.. రూ.1.20లక్షల కోట్లు ఖర్చు చేస్తే మూడేండ్లకే మునిగిపోయింది..  దేశంలోని ప్రతి పౌరుడికి కాళేశ్వరం అవినీతిని తెలియజేయాలన్నదే మా ముఖ్య ఉద్దేశమని ప్రకటించారు. 


వైఎస్ఆర్ ప్రారంభఇంచిన  అంబేడ్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును రీడిజైనింగ్ పేరుతో మార్చి  ప్రాజెక్టు వ్యయాన్ని మూడు రెట్లు పెంచి అవినీతికి పాల్పడ్డారని షర్మిల ఆరోపించారు.  ఎత్తిపోతల అవసరం లేకున్నా పెద్ద పెద్ద మోటార్లతో నీళ్లు తోడారన్నారు.   రూ.1600 కోట్లతో కొనుగోలు చేసిన మోటార్లకు రూ.7వేల కోట్ల లెక్కచూపారని లఆరోపించారు.  రూ.38వేల కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టుకు రూ.1.20లక్షల కోట్లు ఖర్చు చేశారన్నారు.  కాళేశ్వరంలో మోటార్లకు అయ్యే కరెంట్ బిల్ ఖర్చే ఏడాదికి రూ.3వేల కోట్లు ఉంటుందన్నారు. 


రోజుకు రెండు టీఎంసీల చొప్పున నీళ్లు ఎత్తిపోస్తామని చెప్పి, అర టీఎంసీ కూడా లిఫ్ట్ చేయడం లేదని..  ఒక్క ఏడాది కూడా సరిగ్గా నీళ్లు ఎత్తిపోయలేదు.. ఇది బోగస్ ప్రాజెక్టు అని ఆరోపించారు.  కాళేశ్వరం అవినీతిపై ప్రతిపక్షాలు మాట్లాడడం లేదన్నారు.  తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కేసీఆర్ కు, మెగాకు అమ్ముడుపోయాయి.. రేవంత్ రెడ్డి, బండి సంజయ్ మెగాకు అమ్ముడుపోయారని ఆరోపించారు.  అందుకే ఆ పార్టీలు కాళేశ్వరం అవినీతిపై ప్రశ్నించడం లేదని..  రాష్ట్రంలో కాదు.. దేశంలోనే కేసీఆర్ అవినీతిపై పోరాడుతున్న ఏకైక పార్టీ YSR తెలంగాణ పార్టీ అని స్పష్టం చేశారు.