Telangana News :   భద్రాచలం సరిహద్దులో ఉన్న ఐదు గ్రామాలను తెలంగాణలో విలీనం చేయాలని ఆ ఐదు గ్రామాల ప్రజలు గవర్నర్ తమిళిసైకి విజ్ఞప్తి చేశారు. భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన సందర్బంగా గిరిజనులతో ఆరోగ్య రక్షణ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్బంగా పురుషోత్తమపట్నం, ఎటపాక, పిచుకుల పాడు, కన్నాయిగూడెం, గుండాలకు చెందిన గిరిజనులు గవర్నర్‌ను కలిశారు. తాము ఏపీలో ఉంటూ ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. జిల్లా కేంద్రం ఎక్కడో ఉందని అధికారులు పట్టించుకోవడం లేదని తెలిపారు.   అందువల్ల తమను తెలంగాణ ప్రాంతం అయిన భద్రాచలంలో కలపాలని గవర్నర్ కు విజ్ఞప్తి చేశారు. వీరి సమస్యను విన్న గవర్నర్   పరిష్కారం కోసం తాను ప్రభుత్వాలతో మాట్లాడతునానని హామీ ఇచ్చారు. అంతే కాకుండా కేంద్ర ప్రభుత్వంతో కూడ చర్చిస్తానని చెప్పారు.                 

  


రాష్ట్ర విభజన తర్వాత పోలవరం ఏడు ముంపు మండలాలను ఏపీలో కలిపారు. అయితే భద్రచలంను మాత్రం తెలంగాణలోనే ఉంచారు. భద్రాచలం సమీపంలో ఉండే విలీన గ్రామాలు ఏపీ కిందకు వస్తున్నాయి. అయితే అధికారులు తమను పట్టించుకోవడం లేదని.. తాము తెలంగాణలో కలుస్తామని  ఆ గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల గోదావరి వరదలు వచ్చినప్పుడు ఎవరూ పట్టించుకోకపోవడంతో భద్రాచలం వేదికగా, తెలంగాణ-ఆంధ్రా సరిహద్దుల్లో ఐదు పంచాయతీలకు చెందిన ప్రజలు ధర్నా చేశారు.                               


తమ గ్రామాలకు అర కిలోమీటర్ నుంచి తొమ్మిది కిలోమీటర్ల దూరంలోనే భద్రాచలం ఉందని, అందువల్ల తమను తెలంగాణలో కలిపితే సౌకర్యంగా ఉంటుందని ప్రజలు కోరుతున్నారు. తెలంగాణ, ఏపీతోపాటు కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రతినిధులు కూడా వచ్చి అక్కడి పరిస్థితులు తెలుసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వెంటనే తమ గ్రామాల్ని తెలంగాణలో కలపాలని కోరుతున్నారు. తమను ఏపీలో కలపడం వల్ల గత ఎనిమిది సంవత్సరాల నుంచి అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  తమకు భధ్రాద్రికి సమీప ప్రాంత జిల్లా అని పేర్కొన్నారు. తమ గ్రామాలు ప్రస్తుతం అల్లూరి జిల్లాకు సుమారు 400 కిలోమీటర్ల దూరంలో ఉంటుందని అంతదూరం వెళ్లాలంటే తమ కష్టాలు అన్ని ఇన్నీ కావని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.               


గోదావరి వరద ఎప్పుడు తమ ఊళ్లమీద పడుతుందోనని అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ ఐదు గ్రామ పంచాయతీల్లో ఒకటైన యటపాకలో కరకట్ట పరిస్థితి మరింత ఆందోళన కరంగా ఉంది. మరోవైపు ఈ ఉద్యమం రాజకీయ పార్టీలకు అతీతంగా జరుగుతోంది. అన్ని పార్టీలకు చెందిన నేతలు, ప్రజలు ఈ ఉద్యమంలో పాల్గొంటున్నారు. ఈ ఉద్యమానికి తెలంగాణకు చెందిన అఖిలపక్ష నేతలు కూడా మద్దతు తెలుపుతున్నారు.