Krishna River: కృష్ణా ప్రాజెక్టులకు వరద రావడం లేదు. నీటి ప్రవాహం లేక జలాశయాలు వెలవెలబోతున్నాయి. ప్రాజెక్టుల్లో రోజురోజుకూ నీటి మట్టాలు పడిపోతున్నాయి. గత 15 రోజులుగా కృష్ణా నదిలోకి ప్రవాహాలు లేకపోవడం వల్ల నీటి సమస్యలు తప్పేలా లేవు. సాధారణంగా ప్రవాహం భారీగా కాకపోయినా.. కనీసం ప్రాజెక్టుల కింద అవసరాల మేరకు భర్తీ చేసే స్థాయిలో నీరు ఉండేది. అయితే ఈ ఏడాది మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. కనీస స్థాయిల్లోనూ నీటి ప్రవాహం రావడం లేదు. ఎగువన ఉన్న ఆలమట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులకు ఈ నెల 10వ తేదీ తర్వాత 20 వేల క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చినట్లు అధికారులు చెబుతున్నాయి. అయితే ఆయా ప్రాజెక్టుల్లో నీటి స్థాయిలు తక్కువగా ఉండటంతో ఆ 20 వేల క్యూసెక్కుల ప్రవాహం దిగువకు వచ్చే పరిస్థితి లేదు. అయితే జూరాల ప్రాజెక్టుకు మాత్రం స్థానికంగా కురిసన వర్షాల వల్ల స్వల్పంగా ప్రవాహం వచ్చింది. 


శ్రీశైలం ప్రాజెక్టుకు కనీస ఇన్ ఫ్లో కూడా లేదు


శ్రీశైలం ప్రాజెక్టుకు కనీస ఇన్ ఫ్లో కూడా లేదు. ఈ నెల 12వ తేదీ తర్వాత ఇన్ ఫ్లో పూర్తిగా పడిపోయింది. కర్ణాటకతోపాటు రాష్ట్రంలోనూ వర్షాలు లేక ఈ పరిస్థితి తలెత్తింది. జూరాల, తుంగభద్ర నుంచి కూడా ప్రవాహం రావడం లేదు. 12వ తేదీన శ్రీశైలం ప్రాజెక్టులో 122 టీఎంసీల నిల్వ ఉండగా.. ఆదివారం 94 టీఎంసీలకు చేరింది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులకుగానూ ప్రస్తుతం 855.90 అడుగుల వద్ద నీటి మట్టం ఉంది. 121.57 టీఎంసీల మేర ఖాళీ ఉంది. ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో తాగు, సాగు నీటి అవసరాలకు స్వల్పంగానే నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి తెలంగాణ రాష్ట్రం విద్యుత్ ను ఉత్పత్తి చేస్తోంది. ఈ జలాశయం కింద 15 రోజుల్లో 28 టీఎంసీల వినియోగం నమోదు అయినట్లు గణాంకాలు చెబుతున్నాయి.


గడ్డు పరిస్థితి ఎదుర్కుంటున్న నాగార్జున సాగర్ ప్రాజెక్టు


నాగార్జున సాగర్ ప్రాజెక్టు గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. శ్రీశైలం జలాశయం నుంచి జల విద్యుత్ ఉత్పత్తిలో వస్తున్న ప్రవాహం తప్ప నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ప్రవాహం రావడం లేదు. జల విద్యుత్ ఉత్పత్తి తో విడుదల నీటి వల్ల నాగార్జున సాగర్ లో దాదాపు 9 టీఎంసీల నిల్వ పెరిగింది. స్థానికంగా వర్షాలు లేకపోవడంతో ప్రవాహం లేదు. కాల్వలకు కూడా స్వల్పంగానే నీటిని విడుదల చేస్తున్నారు. ప్రధాన జల విద్యుత్ కేంద్రం ద్వారా తెలంగాణ పగటిపూట విద్యుత్ ఉత్పత్తి చేస్తూ రాత్రి సమయంలో రివర్స్ పంపింగ్ తో నీటిని ప్రాజెక్టులోకి ఎత్తిపోస్తోంది.


గోదావరి ప్రాజెక్టుల్లో మాత్రం నీరు పుష్కలంగా ఉంది. మొన్నటి వరకు ఎగువ ప్రాంతాల్లో దట్టంగా కురిసిన వర్షాల వల్ల ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయి. నది ఉప్పొంగి ప్రవహించడంతో గోదావరి జలాశయాల్లో నీటి నిల్వలు ఆశాజనకంగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. సింగూరు, నిజాంసాగర్, శ్రీరాంసాగర్, మధ్య మానేరు, దిగువ మానేరు, కడెం, శ్రీపాద ఎల్లంపల్లి, ధవళేశ్వరం బ్యారేజీల్లో నీరు ఆశాజనకంగా ఉన్నాయి.