మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన హీరోలకు ఈ మధ్య టైమ్ పెద్దగా కలిసి రావడం లేదు. సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, వరుణ్ తేజ్‌లు ఈ ఏడాది పరాజయాలు చూస్తున్నారు. ‘విరూపాక్ష’ మూవీతో సాయి ధరమ్ తేజ్ మంచి కమ్ బ్యాక్ ఇచ్చాడని భావించినా.. దాని తర్వాత వచ్చిన ‘బ్రో’ మూవీలో పూర్తిగా నిరాశపరిచాడు. అతని తమ్ముడు వైష్ణవ్‌ తేజ్ పరిస్థితి కూడా అంతే.. ‘ఉప్పెన’ తర్వాత చెప్పుకోతగిన హిట్ లేదు. ఇక నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ విషయానికి వస్తే.. ‘F3’ తర్వాత మళ్లీ హిట్ కొట్టలేదు. ‘ఘని’ (సోలో హీరోగా) ఘోర పరాజయం తర్వాత చేసిన ‘గాండీవధారి అర్జున’ మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద బొల్తా కొట్టింది. దీంతో వరుణ్ తేజ్ కెరీర్ ప్రమాదంలో పడినట్లయ్యింది. మెగాస్టార్ కుమారుడు రామ్ చరణ్ వల్లే వరుణ్‌కు ఈ పరిస్థితి అని ఇండస్ట్రీలో అంటున్నారు. దీనికి కారణం.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వరుణ్ తేజ్ చేసిన వ్యాఖ్యలే. 


‘గాండీవధారి అర్జున’ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా వరుణ్ తేజ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘మంచి సినిమా ఇవ్వాలనే ప్రెజర్, జనాలను ఎంటర్టైన్ చేయాలని ప్రతి యాక్టర్ కి ఉంటుంది. నా వరకు ఫ్యామిలీ ప్రెజర్ అనేది ఎక్కడా లేదు. ఒక యాక్టర్ గా అలాంటి సినిమాలు చేయొద్దు, ఇలాంటి సినిమాలు చేయొద్దు.. అని నన్ను నేను పరిమితం చేసుకోవడం కరెక్ట్ కాదని నేను నమ్ముతాను. ఇప్పటివరకు అయితే నేను మంచి సినిమాలే తీశానని అనుకుంటున్నాను. అది హిట్ అయినా ప్లాప్ అయినా. మా అన్నయ్య చరణ్ కూడా నేను ఏడవ సినిమా చేస్తున్న సమయంలో నన్ను పిలిచి ఒక మాట చెప్పాడు. ఈ సమయంలో నీకు నచ్చిన సినిమా, నీకు కరెక్ట్ గా అనిపించిన సినిమా, నువ్వు నమ్మిన సినిమా నువ్వు చేసుకుంటూ. భవిష్యత్తులో నీకు బిజినెస్‌తోపాటు మార్కెట్ కూడా పెరుగుతుంది, పెద్ద పెద్ద నిర్మాతలు వస్తారు. కానీ ఎక్కడో చోట నిన్ను ఇలాంటి సినిమానే చేయాలని రిస్ట్రిక్ట్ చేస్తారు. కానీ నువ్వు మాత్రం అలాంటి ట్రాప్ లో పడొద్దు. ఒకానొక సమయంలో నాకు కొన్ని కథలు చేయాలని అనిపించినా, పరిస్థితుల వల్ల నేను చేయలేకపోతున్నానని, కానీ నీకు అలాంటి ఇబ్బంది ఏమీ లేదని, నీకు నచ్చిన కథలు సెలెక్ట్ చేసుకొని డిఫరెంట్, డిఫరెంట్ సినిమాలు చేయమని చరణ్ అన్న చెప్పారు. మా ఫ్యామిలీ మొత్తంలో ఈ విషయం నాకు ఎవరు చెప్పలేదు. చరణ్ అన్న నాతో ఇది చెప్పారు’’ అని వరుణ్ పేర్కొన్నాడు. దీంతో వరుణ్‌కు చరణ్ తప్పుడు సలహా ఇచ్చాడనే టాక్ నడుస్తోంది. 


అదే ఇప్పుడు వరుణ్‌ను ఇబ్బంది పెడుతోందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. జనాలు మెచ్చే కమర్షియల్ మూవీస్ వైపు వరుణ్ తేజ్ ఫోకస్ పెడితే మంచిదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వరుణ్ తేజ్‌ పర్శనాలిటీకి స్పై, ఏజెంట్స్ వంటి క్యారెక్టర్స్ బాగుంటాయి. కానీ, అలాంటి కథలకు టాలీవుడ్‌లో ఆధారణ చాలా తక్కువని ఇప్పటికే ‘ఏజెంట్’, ‘స్పై’ నిరూపించాయి. ఇప్పుడు ఆ లిస్టులో వరుణ్ తేజ్ ‘గాండీవధారి అర్జున’ కూడా వచ్చి చేరింది. ఇప్పటివరకు యంగ్ హీరోస్ చేసిన స్పై జోనర్స్‌లో అడవి శేష్ నటించిన ‘గూఢచారి’ మూవీ ఒక్కటే ప్రేక్షకులను మెప్పించింది. త్వరలోనే ‘గూఢచారి 2’ కూడా విడుదల కానుంది. వరుణ్ తేజ్ తర్వాతి సినిమా కూడా ఫ్లాపయితే.. మార్కెట్‌ పడిపోయినట్లే. ప్రస్తుతం వరుణ్ ‘మట్కా’, ‘ఆపరేషన్ వాలంటైన్’ పైనే ఆశలు పెట్టుకున్నాడు. 


Also Read: నాగ చైతన్యను ఇబ్బంది పెట్టిన ‘ఖుషీ’ ట్రైలర్? థియేటర్ నుంచి బయటకు వెళ్లిపోయారా?