Southwest Monsoon : నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. వీటి ప్రభావంతో ఏపీ, తెలంగాణలో పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ దిశ నుంచి గాలులు వీస్తున్నాయి. తూర్పు ఉత్తరప్రదేశ్ మీద ఉన్న ఉపరితల ఆవర్తనం నుంచి దక్షిణ ఛత్తీస్ గఢ్ వరకు అల్పపీడన ద్రోణి సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంది. 


నైరుతి రుతుపవనాలు ఉత్తర పరిమితి పయనం 15 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 60 డిగ్రీల తూర్పు రేఖాంశం, కార్వార్, చిక్ మంగులూరు, బెంగుళూరు, ధర్మపురి, 10 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 80 డిగ్రీల తూర్పు రేఖాంశం, 11 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 83 డిగ్రీల తూర్పు రేఖాంశం, 14 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 86 డిగ్రీల తూర్పు రేఖాంశం, 22 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 90 డిగ్రీల తూర్పు రేఖాంశం, 25 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 89 డిగ్రీల తూర్పు రేఖాంశం, సిలిగురి, 27.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 88 డిగ్రీల తూర్పు రేఖాంశం గుండా కొనసాగుతోంది. ఏపీలో కోస్తాంధ్రలో 2 నుంచి 4 డిగ్రీల వరకు కొన్నిచోట్ల ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. రాయలసీమలో వేడి గాలులు వీచడంతో పాటు తేలికపాటి జల్లులు పడతాయి. తెలంగాణలో కొన్ని జిల్లాల్లో ఓ వైపు వర్షాలు, మరోవైపు ఉక్కపోత అధికంగా ఉంటుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. 


ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో..
నేడు ఈ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ఒకట్రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయి. రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, లేక ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు ఒకట్రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి సైతం ఈ ప్రాంతాలకు వర్ష సూచన ఉంది. శ్రీకాకుళం నగరంతో పాటుగా శ్రీకాకుళం జిల్లాలోని వివిధ భాగాలు ముఖ్యంగా ఆముదాలవలస​, రజాం, రణస్ధలంలలో వర్షాలు, పిడుగులు వడే అవకాశం ఉంది. పార్వతీపురం మణ్యం జిల్లాలో కూడ వర్షాలు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. విజయనగరం, విశాఖపట్నం జిల్లాలో విస్తారమైన కురుస్తాయి.  పిడుగులు పడే అవకాశాలు ఉన్నాయని విశాఖ వాసులు జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ వెదర్ మ్యాన్ హెచ్చరించారు.






దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో..
ఏపీలోని రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ఒకట్రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, లేక ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు ఒకట్రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయి. ఒక పక్కనేమో కడప జిల్లాలో విస్తారంగా కురుస్తున్న వర్షాలు, మరోవైపు ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఒంగోలు - చీరాల మొత్తం భాగంలో విపరీతమైన పిడుగులు, తీవ్ర వర్షాలు పడుతున్నాయి. కడప జిల్లా ఉత్తర భాగాల్లో వర్షాలు భాగా విస్తారంగా ఉన్నాయి. ఇవి నేరుగా నల్లమల అటవీ ప్రాంతం మీదుగానే అనంతపురం జిల్లాతో పాటుగా నంద్యాల, కర్నూలు జిల్లాలోని పలు భాగాల్లోకి, కడప జిల్లాలోని ప్రొద్దట్టూరు, జమ్మలమడుగు మీదుగా అనంతపురం జిల్లా వైపుగా వానలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది.


తెలంగాణలో వడగాల్పులు, వర్షాలు..
తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మండ, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్ జిల్లాల్లో వడగాల్పులు వీచ్చే అవకాశం ఉండటంతో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. నేటి నుంచి మరో 3 రోజులపాటు కొన్ని జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి. ఈ నేపథ్యంలో ఎల్లో అలర్ట్ సైతం జారీ చేసింది వాతావరణ శాఖ. ఉదయం వేళ చల్లని గాలులు వీస్తుండగా.. మధ్యాహ్నం ఎండ కంటే ఉక్కపోత ప్రభావం అధికంగా ఉంటుంది. హైదరాబాద్‌లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.