TS Minister Vemula Prashanth Reddy: వేల్పూర్ మండలం కుకునూర్ గ్రామానికి చెందిన బీజేపీ, బిఎస్పీ పార్టీకి చెందిన పలువురు యువకులు స్వచ్చందంగా వచ్చి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో మంగళవారం బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి మంత్రి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై బాల్కొండ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో భాగస్వాములు కావాలనుకున్నట్లు యువత తెలిపారు. పార్టీలో చేరిక సందర్భంగా వారి మనసులో మాట మంత్రితో పంచుకున్నారు..
‘దేశం కోసం పనిచేస్తున్న బీజేపీ వైపు ఉందామని యువకులం అంతా గతంలో పని చేశామని కానీ ఇప్పుడు వాస్తవాలు గమనిస్తున్నామని, మా గ్రామంలో బాల్కొండ నియోజకవర్గంలో కేసీఆర్, మీవల్లే అభివృద్ది జరిగిందన్నారు. మాకు కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది చూసుకుంటూ.. ఇంకా బీజేపీ వెంట తిరగడం మా అమ్మను మోసం చేసినట్టే అవుతుంది. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడ లేవని, కేసీఆర్ ప్రధాని అయితే దేశ వ్యాప్తంగా రైతు బంధు, రైతు భీమా,దళిత బంధు ఇస్తారని’ బీఆర్ఎస్ లో చేరిన యువకులు అన్నారు.
అభివృద్ది కోసం తపన పడుతున్న యువకుల బీఆర్ఎస్ లో చేరాలనే వారి నిర్ణయం పట్ల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. యువతలో మార్పు మొదలైంది.. బీజేపీ పతనం ప్రారంభమైందని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. బిజెపి వల్ల దేశంలో వైషమ్యాలు తప్పా... అభివృద్ది లేదని మెల్లమెల్లగా యువత గ్రహిస్తున్నదని చెప్పారు. కేసీఆర్ అభివృద్ది చేస్తుంటే... బీజేపీ విద్వేష, కక్ష్యపూరిత రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. కేసీఆర్ దార్శనికత వల్ల తెలంగాణ రాష్ట్రం కేవలం 8 ఏళ్లలో అన్ని రంగాల్లో దేశంలోనే నెంబర్ వన్ గా ఎదిగిందని గుర్తు చేశారు.
ఇప్పటి బీజేపీ నేతలకు కనీస రాజకీయ విలువలు లేవని, ఒకప్పటి బీజేపీ ఇప్పటి బీజేపీ కి నక్కకు, నాగలోకానికి ఉన్న తేడా ఉందన్నారు. ఒక్క ఓటు తక్కువైందని ప్రధాని పదవికి రాజీనామా చేసిన వాజ్ పేయి ఉన్నప్పటి బీజేపీ ఎక్కడ..?ఎమ్మెల్యేలను కొంటూ ప్రజాస్వామ్య బద్ధంగా ప్రజలచే ఎన్నుకోబడిన ప్రభుత్వాలను కూలుస్తున్న మోడీ, అమిత్ షా బీజేపీ ఎక్కడ..? అంటూ మంత్రి నిలదీశారు. ఇప్పుడున్న బీజేపీ పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పసుపు బోర్డు ఇస్తామని బాండ్ పేపర్ రాసిచ్చి మరి నిజామాబాద్ రైతులను మోసం చేశారు. ఇప్పటి వరకు పసుపు బోర్డు ఊసే లేదని మండిపడ్డారు. పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని కేంద్రమంత్రిగా ఉన్న రాజ్ నాథ్ సింగ్ స్వయంగా చెప్పారని గుర్తు చేశారు. మళ్లీ కర్ణాటక ఎన్నికల్లో అదే హామీ ఇచ్చి ఓట్లు అడిగారని తెలంగాణ రాష్ట్రంలో సాధ్యం కానిది, కర్ణాటకలో ఎలా సాధ్యం అవుతుందని మంత్రి ప్రశ్నించారు.
బీజేపీ రైతులను వంచిస్తుందనెందుకు కర్ణాటక ఎన్నికల్లో ప్రకటించిన పసుపు బోర్డు హామీనే ఉదాహరణ అన్నారు. ప్రభుత్వరంగ సంస్థలు అమ్ముతూ, అన్ని రకాల ధరలు పెంచుతూ సామాన్యులను అరిగోస పెడుతున్నారని మండిపడ్డారు. ప్రధాని మోడీ అసమర్థ ప్రధాని అని ఆయన వల్ల ఏ ఒక్క వర్గానికి మేలు జరగలేదని తేల్చి చెప్పారు. పైగా తన కార్పొరేట్ మిత్రులకు ప్రభుత్వ ఆస్తులు దారాదత్తం చేస్తున్నారని ధ్వజమెత్తారు. వీటన్నిటిపై ప్రజలు,యువకులు గ్రామాల్లో చర్చ చేయాలని కోరారు. కేసీఆర్ ఏం చేస్తున్నారు. బీజేపీ ఏం చేసింది అనేది చర్చ జరగాలన్నారు. బీజేపీ నిజస్వరూపం తెలుసుకొని కుకునూర్ గ్రామ యువకులు చూపిన ఈ చైతన్యం యువతలో రాబోతున్న మార్పుకు నాంది అని పేర్కొన్నారు. యువత అభివృద్ధి వైపే ఉంటామని, స్వచ్ఛందంగా బిఆర్ఎస్ లో చేరాలనే యువత నిర్ణయం గొప్ప శుభపరిణామమని మంత్రి వేముల పేర్కొన్నారు. బాల్కొండ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు తాను ఎల్లప్పుడూ అందుబాటులో, ఆపదలో అండగా ఉంటానని మరోమారు స్పష్టం చేశారు.