Vemula Prashanth Reddy: టీపీసీసీ చీఫ్ అయి ఉండి కూడా రేవంత్ రెడ్డి రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ పై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు, ప్రతి దానిపై అబద్దాలు ఆడుతూ బురద జల్లుతున్నారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. గ్రూప్ 1తో పాటు ఇతర టీఎస్ పీఎస్సీ పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాలు లీక్ కావడం నిజంగానే దురదృష్టకరం అన్నారు. మరోవైపు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ అరవింద్ సైతం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పై ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, కవితకు సంబంధం లేని కేసులో ఇరికించి ఆమెను అరెస్ట్ చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. 
దేశంలో అసలు దొంగ ప్రధాని మోడీ
దేశంలో బడా కంపెనీలు వేల కోట్లు లోన్లు తీసుకుంటాయి. అలా తీసుకున్న వారివి రూ. 12 లక్షల కోట్లు మాఫీ చేశారు ప్రధాని మోడీ. బ్యాంక్ రుణాలు ఎగ్గొట్టిన వారి రుణాలు ఎందుకు మాఫీ చేశావని సీఎం కేసీఆర్ ప్రధాని మోడీని, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించగా.. కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారని మోర్తాడ్ మండల కేంద్రంలో జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. మోడీ ఫ్రెండ్ ఆదాని, ఒకప్పుడు అతని ఆస్తి 50 వేల కోట్లు. ఇప్పుడు 12 లక్షల కోట్లు. అదే సమయంలో ఎల్ఐసీకి 60 వేల కోట్లు నష్టం వచ్చిoది. ఈ డబ్బులు అదాని కంపెనీలో మోడీ ఇన్వెస్ట్ చేశారు. ఎల్ఐసీ, బ్యాంకులు నష్టపోతే ప్రజలు నష్టపోయినట్లే.. ఈ అన్యాయాన్ని కేసీఆర్ ప్రశ్నించినందుకే కవితను కేసుల్లో ఇరికిస్తున్నారని ఆరోపించారు.  లక్షా 50 వేల కోట్లు కాజేసిన అదానిపై చర్యలు ఎందుకు తీసుకోరు అని మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రశ్నించారు. పేపర్ లీక్ విషయంలో అబద్ధపు ప్రచారాన్ని నమ్మవద్దన్నారు. నరేంద్ర మోడీ అవినీతి పాలనకు చరమగీతం పాడాలని అన్నారు. 


నరేంద్ర మోడీ పాలనలో రూపాయి విలువ మరింతగా పతనమైంది. వంటగ్యాస్ సిలిండర్ ధర రూ. 400 నుంచి రూ.1200 పెరిగింది. పప్పు, అప్పుల ధరలు పెరిగిపోయాయి. డీజిల్ ధర రూ. 40 నుంచి రూ. 100 అయ్యింది. దీంతో ట్రాన్స్ పోర్ట్ ధర పెరిగి నిత్యావసర సరుకుల మీద ప్రభావం చూపుతోంది. సామాన్యుల మీద ధరలు పెరగడం పెను భారంగా మారింది. దీనంతటికి కారణం ప్రధాని మోడీ. తెలంగాణలో ఓ వైపు కేసీఆర్ పేద ప్రజల సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే.... నరేంద్ర మోడీ ధరలు పెంచి సామాన్యులను లూటీ చేస్తున్నారని అన్నారు మంత్రి. ప్రపంచంలో అత్యంత అవినీతి పరుడు నరేంద్ర మోడీ అని ఆరోపించారు. బడా బాబుల కంపెనీలకు రుణాలు మాఫీ చేసి పేదల డబ్బులు కాచుకుంటున్నారు. ఆ డబ్బులతో ఎమ్మెల్యేలను కొంటున్నారు. అలా తెలంగాణలో 4 గురు ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నం చేసి దొరికి పోయారు. వాళ్ళ అవినీతి గురించి మాట్లాడితే కేసులు పెడుతున్నారు. రాహుల్ గాంధీ మీద అనవసరంగా కేసులు పెట్టారు. 


లలిత్ మోడీ, నీరవ్ మోడీ ఇలా ఆరుగురు మోడీలు డబ్బులు కాజేసి విదేశాల్లో తలదాచుకున్నారు. రాహుల్ గాంధీ అన్న మాట ఏంటంటే మోడీ పేరుతో ఉన్న గుజరాత్ కు చెందిన 6 గురు అని అంటేనే ఆయన్ను ఎంపీగా డిస్ క్వాలిఫై చేశారు. దేశంలో ఇప్పటి వరకు ఇలాంటి సంఘటన జరగలేదు. ఎమర్జెన్సీ కంటే చాలా అన్యాయం జరుగుతోంది. దర్యాప్తు సంస్థలు వాళ్ళ గుప్పిట్లో ఉన్నాయి. బాల్కొండ నియోజక వర్గ ప్రజల ఆశిష్షులతోనే ఇవాళ నేను ఇలా ఉన్నాను. కేసీఆర్ తో నాకున్న సాన్నిహిత్యం వల్ల ఆయన దయతో బాల్కొండ నియోజకవర్గంలో అభివృద్ధి చేసుకోగలుగుతున్నాం. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో గ్రామాల్లో కోట్ల రూపాయలతో అభివృద్ధి జరుగుతోంది. డోన్ పాల్ అనే గ్రామంలో 300 ఇల్లు ఉంటే 316 మందికి పెన్షన్లు, రైతు బంధు కింద 375 మందికి రైతు బంధు ఇలా ఏ చిన్న గ్రామాన్ని వదలకుండా కేసీఆర్ సంక్షేమ పథకాలు జరుగుతున్నాయి. ప్రజలు అండగా ఉండాలని అడిగే హక్కు కేసీఆర్ కు ఒక్కడికే ఉంది. 


అభివృద్ధి చూసి ఓర్వలేక ఎంపీ అరవింద్ లేనిపోని మాటలు మాట్లాడుతున్నారు. నీ ఇంట్లోనే రెండు పార్టీలు ఉన్నాయి. పెద్ద కొడుకు, చిన్న కొడుకు రాజకీయాలు అనారోగ్యంగా ఉన్న తండ్రి డి శ్రీనివాస్ ను ఇబ్బంది పెడుతున్నారు. డీఎస్ కాంగ్రెస్ లో చేరలేదని భార్య ఒక వైపు లేఖ రాసింది. కాంగ్రెస్ లో చేరాదని పెద్ద కొడుకు, చేరలేదని చిన్న కొడుకు. 5 రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని బాండు పేపర్ రాసిచ్చి 5 ఏళ్ల వుతున్నా.. పసుపు బోర్డు లేదు. బాండు పేపర్ విలువను కూడా తగ్గించిన వ్యక్తి అరవింద్. ఎంపీగా అరవింద్ జిల్లాకు ఏం చేశారు అని అడిగితే సమాధానం చెప్పకుండా బూతులు తిడుతున్నారు. ఎంపీ అరవింద్ వల్ల ఇంట్లో తల్లి దండ్రులకు మనశ్శాంతి లేదు. పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు చేసిన అభివృద్ధి లేదని అన్నారు మంత్రి వేముల.


మంత్రి వేముల పాల్గొన్న మహిళా సమ్మేళనంలో మోర్తాడ్ మండలంలోని 10 గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. కొందరు మహిళలు మాట్లాడుతూ తమ గ్రామంలో జరిగిన అభివృద్ధి బాగుందని తమకు సంక్షేమ పథకాలు సంతోషాన్నిస్తున్నాయని ఆనందం వ్యక్తం చేశారు.