నిజామాబాద్ నగరంలో కలకలం రేపుతున్న పీఎఫ్‌ఐ కార్యకలాపాల డొంక కదుపుతున్నారు పోలీసులు. మరో ముగ్గురు పీఎఫ్ఐ సభ్యులను అరెస్ట్ చేశారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని షాదుల్లా, ఇమ్రాన్, మోబిన్ లను పోలీసులు అదుపులో తీసుకున్నారు. మూడు రోజుల కింద ఒకరిని అరెస్ట్ చేసిన పోలీసులు మతోన్మాదాన్ని పెంచే విధంగా, ఇతర మతాలపై దాడి చేసేందుకు యువతకు శిక్షణ ఇస్తున్నారని తెలిపారు సిపి నాగరాజు.


కరాటే, లీగల్ అవేర్‌నెస్ ముసుగులో గత రెండు నెలల నుంచి క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు వీళ్లంతా. నిజామాబాద్, ఆదిలాబాద్, కడప, కర్నూలు, కరీంనగర్ నుంచి యువతను పిలిపించి శిక్షణ ఇస్తున్నారని తెలిపారు సిపి నాగరాజు. వరంగల్ వంటి ఇతర ప్రాంతాలకు వెళ్లి శిక్షణ ఇచ్చారు. అగ్రెసివ్‌గా ఉండే యువకులను ఎంపిక చేసి శిక్షణ ఇచ్చారని సిపి వివరించారు. 


శిక్షణ పొందిన వారు మారణాయుధాలు సమకూర్చుకుంటారన్నారు. ప్రస్తుతానికి 120, 120బి కింద కేసులు నమోదు చేశామని తెలిపారు సిపి. కడపలోనూ ఒక బేస్ క్యాంప్ ఏర్పాటు చేసుకున్నారని సమాచారం ఉన్నట్టు వివరించారు. 200 మందిలో 30 మందిని ఇప్పటి వరకు శిక్షణ తీసుకున్నారని గుర్తించారు. ముగ్గురిని అరెస్ట్ చేశారు. బోధన్, జగిత్యాల, ప్రకాశం ప్రాంతాలకు చెందిన వారూ ఇందులో ఉన్నారు.


శిక్షణ పొందిన వారి వివరాలను పోలీసులు సేకరించే పనిలో పడ్డారు. పీఎఫ్ఐ ముఖ్య ఉద్దేశం అమాయక పేద యువకులను చేరదీసి... వారికి మతోన్మాదాన్ని రెచ్చగొట్టడం, వారికి మారణాయుధాలతో శిక్షణ ఇస్తారు. సిమి సంస్థకు బదులుగా ఈ పీఎఫ్‌ఐ అనుబంధంగా ఏర్పాటు చేశారని పోలీసులు వివరించారు. 


యువతను మత విద్వేషాలు రెచ్చగొట్టేలా అల్లర్లకు ఉసిగొల్పేలా శిక్షణ ఇస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు మూడు రోజుల క్రితం అరెస్టు చేశారు. మతం పేరుతో భావోద్వేగాలు రెచ్చగొట్టడం కోసం పాపులర్ ఫ్రoట్ ఆఫ్ ఇండియా సంస్థ స్థాపించి కార్యకలాపాలు సాగించారు. నిజామాబాద్‌లోని ఆటోనగర్, ఉస్మానియా మసీద్‌ సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని పోలీసులు గమనించారు. ఫాలో అయ్యారు. ఆటో నగర్ లో ఓ ఇంట్లో పాపులర్ ఫ్రoట్ ఆఫ్ ఇండియా పేరుతో 2 బ్యానర్లు, కనిపించాయి. పోలీసులు లోనికి వెళ్లి చెక్ చేయగా ఒక వైట్ రైటింగ్ బోర్డు, 15 వెదురు బొంగు కర్రలు, మూడు నాంచాకులు, 3 సెట్ల పేపర్‌ బంచ్‌లు, మూడు హాండ్ బుక్‌లు, ఒక  నోట్ బుక్‌, కొన్ని బస్, ట్రైన్ టిక్కెట్స్,స్పీకర్‌లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.


పోలీసులు స్వాధీనం చేసుకున్న పుస్తకాల్లో  భారత దేశ వ్యతిరేక కార్యక్రమాలు గురించి ఉంది. నిందితుడైన అబ్దుల్ ఖాదర్ వాంగ్మూలంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తునట్లు కనిపిస్తూ ఇంటర్నల్‌గా యువకులను ఎంపిక మానవ విస్పోటంగా మార్చడమే ప్రధాన ఉద్దేశమని వివరించినట్టు పోలీసులు తెలిపారు. ఎప్పుడంటే అప్పుడు ఎక్కడంటే అక్కడ అసాంఘిక కార్యక్రమాలు, దాడు చేయుట, అవసరమైతే దేశాన్ని అస్థిర పరచటానికి ఉపయోగిస్తారని పేర్కొన్నారు.