మూఢ నమ్మకాలు ఓ వ్యక్తి ప్రాణం తీశాయి. మంత్రాలు, భూతవైద్యాలు లేవంటూ ఎంతగా ప్రచారం కల్పిస్తున్నా కొందరిలో మార్పు కనిపించడం లేదు. ఈ పేరుతో ఇప్పటికీ దురాగతాలు కొనసాగుతున్నాయి. తాజాగా కామారెడ్డి జిల్లాలో జరిగిన ఘటనే దీనికి నిదర్శనం.


కామారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. మంత్రాలు చేస్తున్నాడనే కారణంతో వృద్ధుడిని సజీవ దహనం చేశారు ముగ్గురు వ్యక్తులు. కామారెడ్డి జిల్లాలోని బీబీపేట మండల కేంద్రానికి చెందిన ఈరోల్ల మల్లయ్య (62) అనే వ్యక్తి మంత్రాలు చేస్తున్నాడని అనుమానంతో అదే కాలనీకి చెందిన ముగ్గురు వ్యక్తులు చంపేశారు. మల్లయ్య ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ముగ్గురు వ్యక్తులు ఆయనను బయటకు లాక్కొచ్చి, బండరాళ్లతో కొట్టారు. తర్వాత పెట్రోల్ పోసి తగులబెట్టారు. దీంతో మల్లయ్య సజీవ దహనమయ్యారు.


అదే సమయంలో అడ్డొచ్చిన భార్యపై కూడా దాడి చేశారు. ఈ ఘటనపై మృతుడి కూతురు లావణ్య బీబీపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటన సమాచారం అందుకున్న కామారెడ్డి డీఎస్పీ సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. బీబీపేట్‌లో జరిగిన ఈ దారుణం కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది.