Telangana Congress News: కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించిన వెంటనే టికెట్ రాని ఆశావహులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఓ కాంగ్రెస్ నేత మాత్రం టికెట్ రాలేదని  ఏకంగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. బాన్సువాడ (Banswada) కు చెందిన కాంగ్రెస్ నేత కాసుల బాలరాజు (Kasula Balaraju) టికెట్ రాలేదని మనస్థాపంతో పురుగుల మందు తాగారు. బీసీ నేత అయిన తనకు కాకుండా మోసం చేసి స్థానికేతరుడు అయిన ఏనుగు రవీందర్ రెడ్డికి టికెట్ అమ్ముకున్నారని బాలరాజు మనస్తాపంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వెంటనే కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు ఆయన్ని బాన్సువాడ (Banswada) ఏరియా హాస్పిటల్‌కు తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు.


ఆమరణ దీక్ష కూడా
కాసుల బాలరాజు (Kasula Balaraju)కు టికెట్ రాకపోవడంతో బాన్సువాడ (Banswada) లోని వివిధ ప్రాంతాల నాయకులు, కార్యకర్తలు వచ్చి ఆయనకు సంఘీభావం ప్రకటించారు. రెండు రోజుల క్రితం కాసుల బాలరాజు (Kasula Balaraju) మాట్లాడుతూ... గత 20 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ సేవలందిస్తున్న తనకు టికెట్ ఇవ్వకుండా ఇతర స్థానికేతరులకు అధిష్టానం టికెట్ కేటాయించడంపై ఆవేదన చెందారు. పార్టీకి బలోపేతం చేసిన కార్యకర్తలకు కాకుండా స్థానికేతరులకు టికెట్ ఇవ్వడంపై నిరసనగా బుధవారం నుంచి బాన్సువాడ (Banswada) పట్టణంలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించారు.


దానికి తగ్గట్లే బుధవారం అధిష్ఠానం మాత్రం తనకు టికెట్ ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ తన స్వగృహంలో ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. తనను కాదని స్థానికేతరుడైన ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డికి టికెట్ కేటాయించడం పట్ల ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.


బాన్సువాడ (Banswada) శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నుంచి దరఖాస్తులను నవంబరు 10 నుంచి స్వీకరిస్తామని ఎన్నికల రిటర్నింగ్ అధికారి భుజంగ్ రావు తెలిపారు. బాన్సువాడ (Banswada) పట్టణంలోని తన కార్యాలయంలో ఆయన ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఈ వివరాలు తెలిపారు. ప్రతి ఒక్కరు ఎన్నికల నియమ నిబంధనలు పాటించాలని ఆయన కోరారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.


ముషీరాబాద్‌లోనూ 
ఇటు ముషీరాబాద్ లో కూడా కాంగ్రెస్ కు షాక్ తగిలింది. ముషీరాబాద్ టికెట్ ఆశించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంగిశెట్టి జగదీష్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. తెలంగాణ ఉద్యమంలో సంగిశెట్టి జగదీష్ పని చేశారు. ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో పని చేసిన తనను కాదని మరో వ్యక్తికి టికెట్ ఇవ్వడం పట్ల సంగిశెట్టి అసహనం వ్యక్తం చేశారు. బలమైన సామాజిక వర్గం పద్మశాలి కులానికి చెందిన వారు సంగిశెట్టి జగదీష్. 


రేవంత్ రెడ్డి (Revanth Reddy) తనను నమ్మించి మోసం చేశారని సంగిశెట్టి జగదీష్ ఆరోపించారు. నోట్లకు సీట్లు అమ్ముకున్న వ్యక్తి రేవంత్ రెడ్డి (Revanth Reddy) అని అన్నారు. కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి (Revanth Reddy) సర్వనాశనం చేశాడు అంటూ సంగిశెట్టి జగదీష్ ఆవేదన వ్యక్తం చేశారు.