- రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు
- అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటాం
- రైతుల‌తో అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌ మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి


నిర్మల్ మాస్టర్‌ ప్లాన్‌ డ్రాఫ్ట్‌ విషయంలో రైతులకు ఎలాంటి ఆపోహ వ‌ద్దని, ఆందోళన చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ మున్సిపల్‌ పరిధిలోని వివిధ గ్రామాల‌కు చెందిన రైతులు హైదరాబాదులోని అర‌ణ్య భ‌వ‌న్ లో మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డిని క‌లిశారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కృషి చేస్తుంద‌ని,  రైతుల‌కు వ్యతిరేఖంగా ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేద‌న్నారు. 


రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం డ్రాఫ్ట్ ల‌ను నిలిపివేసింద‌ని, నిర్మల్  మాస్టర్‌ ప్లాన్‌ విషయంలో రైతులు ఆందోళన చెందవద్దని కోరారు. డ్రాప్ట్ పై రైతులు ఇచ్చిన వినతులు, అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటామ‌ని స్పష్టం చేశారు. మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డిని క‌లిసిన వారిలో నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక రమణ, పట్టణ అధ్యక్షుడు మారుగొండ రాము, కౌన్సిలర్ ఆదుముళ్ళ పద్మాకర్, మాజీ కౌన్సిలర్ చెనిగారపు నరేష్, కౌన్సిలర్ తారక రఘు, రైతులు కొట్టే శేఖర్, దోంతుల రవి, గంగయ్య, అనుముల మోహన్, కత్రోజి గణేష్, కూన ఈశ్వర్, ద్యాగా దేవిదాస్, రాంచందర్ తదితరులు ఉన్నారు.


విచారణను ఫిబ్రవరి 13 కు వాయిదా 
కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై హైకోర్టు జవవరి చివరి సోమవారం విచారణ చేపట్టింది. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేఏ పాల్ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరయ్యి వాదనలు వినిపించారు. రైతులను సంప్రదించకుండానే మాస్టర్ ప్లాన్ రూపొందించారని కోర్టుకు తెలిపారు. మాస్టర్ ప్లాన్ రద్దు చేసినట్టు కౌన్సిల్ ప్రకటించిందన్నారు. అయితే కౌన్సిల్ కు నిర్ణయం తీసుకునే అధికారం లేదని, మాస్టర్ ప్లాన్ రద్దు పై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కేఏ పాల్ అన్నారు. ఇప్పటి వరకు మాస్టర్ ప్లాన్ పై ప్రభుత్వం   నిర్ణయం తీసుకోలేదని కోర్టుకు తెలిపారు. మాస్టర్ ప్లాన్ పై ప్రభుత్వ నిర్ణయాన్ని ఫిబ్రవరి 13 లోపు సమర్పించాలని హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఈ పిటిషన్ పై తదుపరి విచారణను ఫిబ్రవరి 13 కు వాయిదా వేసింది.  కామారెడ్డిలోని కొన్ని గ్రామాల పొలాలను ఇండస్ట్రియల్‌ జోన్‌ పరిధిలోకి తెచ్చారని బాధిత రైతులు ఇటీవల ఆందోళన చేశారు. మాస్టర్‌ ప్లాన్‌లో సాగు భూములను పరిశ్రమల జోన్‌ నుంచి తొలగించాలని డిమాండ్‌ చేస్తూ జిల్లా కేంద్రంలో రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ఆందోళనలు కూడా చేశారు. 


కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తూ నోటిఫికేషన్  
 కొద్ది రోజులుగా తీవ్ర ఉద్రిక్తతలకు కారణం అవుతున్న కామారెడ్డి మాస్టర్ ప్లాన్ అంశానికి ఇటీవల మున్సిపల్ కమిషనర్ ముగింపు పలికారు. ఈ మాస్టర్ ప్లాన్ ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు మున్సిపల్ కమిషనర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.  కౌన్సిలర్లు అందరూ రాజీనామా చేయాలని రైతులు ఒత్తిడి చేస్తుండటంతో ఒక్కొక్కరుగా రాజీనామాలు చేశారు. దీంతో అందరూ రాజీనామా చేసే అవకాశం ఉండటంతో.. అధికారులు వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు మాస్టర్ ప్లాన్ ముసాయిదా రద్దు చేశారు.