Aasara Pension scheme in Telangana: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కొనసాగిస్తున్న పథకం ‘ఆసరా పింఛను’. అయితే శాసనమండలిలో శుక్రవారం ప్రశ్నోత్తరాల సమయంలో ఆసరా పెన్షన్లపై MS ప్రభాకర్ రావు, ఎగ్గే మలేశం, తక్కెళ్లపల్లి రవీందర్ రావు తదితరులు పెన్షన్లపై ప్రశ్నలు అడిగారు. రాష్ట్రంలో 43 లక్షల 68 వేల 784 మంది ఆసరా పింఛన్ లబ్దిదారులు ఉన్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమాధానం ఇచ్చారు. కేటగిరీల వారీగా తెలంగాణలో ఇస్తున్న మొత్తం 10 రకాల ఆసరా పెన్షన్ల వివరాలు వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం 2014, అక్టోబర్ 1 నుంచి ‘ఆసరా పింఛను’ పథకాన్ని ప్రారంభించింది. 


ఆసరా పింఛను పథకం కిందట 2023, జూన్ నాటికి కేటగిరీల వారీగా లబ్ధిదారులు:
- వృద్ధులు  - 15 లక్షల 81 వేల 630
- వితంతవులు - 15 లక్షల 54 వేల 525
- వికలాంగులు - 5 లక్షల 5 వేల 836
- నేతకారులు - 37 వేల 51
- కల్లుగీత కార్మికులు - 65 వేల 196
- ఫైలేరియా రోగులు  - 17 వేల 995
- డయాలసిస్ రోగులు - 4 వేల 337
- ఎన్.ఆర్.టి - హెచ్ఐవీ రోగులు - 35 వేల 670
- బీడీ కార్మికులు - 4 లక్షల 24 వేల 292
- ఒంటరి మహిళలు - 1 లక్ష 42 వేల 252
మొత్తం లబ్దిదారులు  - 43 లక్షల 68 వేల 784


రాష్ట్రంలో ప్రస్తుతం ఆసరా పించన్లు వీరికే..
1.  వృద్ధులు - రూ.2016 
2.  వితంతువులు - రూ.2016 
3. వికలాంగులు - రూ.3016 (రూ.4016కి పెంపు)
4. చేనేత కార్మికులు - రూ.2016
5. కల్లు గీత కార్మికులు - రూ.2016
6. బీడి కార్మికులు - రూ.2016
7. ఒంటరి మహిళలు - రూ.2016
8. ఎచ్.ఐ,వి. బాధితులు - రూ.2016
9. బోదకాలు - రూ.2016 
10. కళాకారులు - రూ.2016


 2013 -14 తో పోల్చుకుంటే 2021-22 సంవత్సరంలో లబ్ధిదారుల సంఖ్య, వ్యయంలో భారీ పెరుగుదల ఉందని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. 2013-14 సంవత్సరంలో (తెలంగాణ ఏర్పడటానికి ముందు) 28 లక్షల 47 వేల 885 మంది లబ్ధిదారుల సంఖ్యతో పోల్చుకుంటే 2021-22 సంవత్సరంలో 37 లక్షల 59 వేల 966 మంది లబ్ధిదారులు ఉన్నారు


2013 - 14 లో ఉన్న 809 కోట్ల 64 లక్షలతో పోల్చుకుంటే 2021-22 సంవత్సరంలో 8 వేల 581 కోట్ల 10 లక్షలు పెరిగింది. దీంతో పెన్షన్ల భారం 2021-22 సంవత్సరంలో 9 వేల 390 కోట్ల 74 లక్షలకు పెరిగింది. ప్రస్తుతం 2023-24 సంవత్సరంలో ఆసరా పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం 11 వేల 774 కోట్ల 90 లక్షలను బడ్జెట్లో కేటాయించింది.  దివ్యాంగులకు ఆసరా పింఛను రూ.4016కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దివ్యాంగులకు జులై నెల పింఛను నుంచే సవరించిన పింఛను రూ.4016 అమలు కానుంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంతో దాదాపు 5 లక్షల మంది దివ్యాంగులకు లబ్ది చేకూరనుంది.  


గతంలో గ్రామ స్థాయి లేదా, మండల స్థాయి లేదా, వార్డు స్థాయి క్షేత్ర అధికారులు పింఛను మంజూరు నిమిత్తం దరఖాస్తులను తీసుకునేవారు. 2022 - 23 లో కొత్త సంస్కరణగా, లబ్ధిదారులపై ఎటువంటి చార్జీలు వేయకుండా దరఖాస్తులను మీ సేవా కేంద్రాల ద్వారా తీసుకునే ఛాన్స్ ఇచ్చింది ప్రభుత్వం. రోజువారీ కనీస అవసరాలను తీర్చడానికి పెరుగుతున్న వయస్సుతో జీవనోపాధి కోల్పోయిన వారిని, వృద్ధులు, వికలాంగులు, దివ్యాంగులు, వితంతువులు, కల్లుగీత కార్మికులు, నేత కార్మికులు, హెచ్.ఐ.వి రోగులు, ఫైలేరియా రోగులు, డయాలసీస్ రోగులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులకు ఆసరా పింఛన్ అందిస్తున్నారు.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి    
Join Us on Telegram: https://t.me/abpdesamofficial