Telangana Formation Day: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక, గత తొమ్మిది సంవత్సరాలుగా సాధించిన ప్రగతిని పల్లె పల్లెన ప్రజలకు వివరిస్తూ ఘనంగా రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. శనివారం కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశoలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సన్నాహక సమావేశానికి ముఖ్య అతిధిగా మంత్రి ప్రశాంత్ రెడ్డి హాజరై మాట్లాడారు. దశాబ్ది ఉత్సవాలలో నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యేలు చొరవ తీసుకుని, అందరూ ప్రజా ప్రతినిధులు, అధికారులతో  కలిసి ప్రభుత్వం సూచించిన క్యాలెండర్ ప్రకారం పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించి విజయవంతం చేయాలని కోరారు.


జూన్ 2 నుంచి జూన్ 22 వరకు రాష్ట్ర ఆవతరణ వేడుకలు
జూన్ 2 న పథకావిష్కరణ, దశాబ్ది ఉత్సవ సందేశం తో ఉత్సవాలు ప్రారంభమై జూన్ 22 అమరవీరుల సంస్మరణ సభ, అమరవీరుల స్తూపం అవిష్కరణతో ముగిస్తున్నట్లు తెలిపారు. 20 రోజుల పాటు ఊరూరా పండుగ వాతావరణంలో ఘనంగా దశాబ్ది ఉత్సవాలు నిర్వహించాలని, తెలంగాణ ప్రగతిని ప్రతి ఒక్కరికి తెలిసేలా వెలుగెత్తి చాటాలన్నారు. రాష్ట్రం రాక ముందు, వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధిని మరొక్కసారి గుర్తు చేస్తూ ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని చెప్పారు. రైతు వేదికల వద్ద ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు రైతులతో కలిసి భోజనం చేయాలని అన్నారు. రాష్ట్రం ఏర్పాటు లాగే కామారెడ్డి జిల్లా ఏర్పాటు అనేది ఈ ప్రాంత ప్రజల  చిరకాల వాంఛ నెరవేరిందని, అదే విధంగా నూతన మండలాలు, నూతన గ్రామ పంచాయతీల ఏర్పాటుతో ప్రజలకు పాలన మరింత దగ్గరైందని అన్నారు. కొత్త జిల్లాగా ఏర్పాటు అయిన కామారెడ్డి జిల్లా కేంద్రంలో సంబరాలు పెద్ద ఎత్తున నిర్వహించాలని సూచించారు.


రాష్ట్ర వ్యాప్తంగా విద్యా కోసం జరుగుతున్న కృషిని, మన ఊరు- మన బడి కింద పాఠశాలల్లో వచ్చిన మార్పును నాడు-నేడు ఫొటోలతో ప్రదర్శించాలని పేర్కొన్నారు. కామారెడ్డికి  మెడికల్ కాలేజ్, బాన్స్వాడలో నర్సింగ్ కళాశాల, వివిధ చోట్ల వచ్చిన ప్రభుత్వ డిగ్రీ, ఇతర కళాశాలలు, గురుకుల, సంక్షేమ ఇతర పాఠశాలల వివరాలు తెలియజేయాలన్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతితో  జాతీయ స్థాయి అవార్డులు సాధించి తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు.


 మిషన్ కాకతీయ పథకం ద్వారా సాగునీటి చెరువుల పునరుద్ధరణ, గ్రామాల్లో చెక్ డ్యాములు, ఊట చెరువుల నిర్మాణం తో భూగర్భ జలాలు పెరిగాయన్నారు. రాష్ట్రం వస్తే చీకటి అవుతుందని చెప్పిన చోట నేడు విద్యుత్తు వెలుగులు చిమ్ముతూ 9 ఏళ్లలో సాధించిన ప్రగతిని గర్వంగా చాటుకుంటు ప్రజలతో మమేకం అవుతూ ప్రచారం చేయాలన్నారు.


కేసీఆర్ ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలు..
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రచారం చేయాలని, ఒక్కో గ్రామానికి అందుతున్న రైతు బంధు, రైతు భీమా, వివిధ రకాల పెన్షన్లు, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, చెరువుల్లో వదిలిన చేప పిల్లలు, గొర్రెల పంపిణీ అన్ని రకాల వివరాలతో గ్రామాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని తెలిపారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కింద మంజూరైన పనుల వివరాలతో పాటు అన్ని రకాల అభివృద్ధి నిధుల వివరాలు తెలిసేలా ప్రచారం చేయాలన్నారు. ఆధునికతతో ఉపాధి కోల్పోయిన కుల వృత్తుల వారికి అండగా నిలవాలని ప్రభుత్వం నిర్ణయించి ఒక లక్ష రూపాయలు ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు నిర్ణయించారని తెలియజేశారు. ఈ మేరకు పారదర్శకంగా లబ్దిదారులను ఎంపిక చేసి దశాబ్ది ఉత్సవాలలో భాగంగా అందజేయాలని సూచించారు.  4,480 మంది రైతులకు 12,969 ఎకరాలు పోడు పట్టాలు గిరిజనులకు ఇవ్వనున్నట్లు తెలిపారు. అర్హత గల వారికి ఇంటి స్థలాల పట్టాలు అందజేయాలని తెలిపారు. జూన్ 19న జరిగే తెలంగాణ హరితోత్సవం కార్యక్రమంలో గ్రామ గ్రామాన పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని చెప్పారు.


రాష్ట్రంలో చిరస్థాయిగా నిలిచిపోయే కట్టడాల్లో భాగస్వామ్యం అయిన జిల్లా ఇంఛార్జి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి ఎమ్మెల్యే జజాల సురేందర్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర రాజధానిలో నిర్మించిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం,రాష్ట్ర సచివాలయం,అమరవీరుల స్మారక చిహ్నం, పోలీస్ కమాండ్ కంట్రోల్ లాంటి తెలంగాణ ఖ్యాతిని చాటే నిర్మాణాల్లో ఉద్యమకారుడైన ప్రశాంత్ రెడ్డి భాగస్వామ్యం కావడం తమకు ఎంతో గర్వ కారణమని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎమ్మెల్యేలు జాజాల సురేందర్, హన్మంతు షిండే, జిల్లా ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్, అధికారులు తదితరులు మంత్రికి అభినందనలు తెలిపారు.