కామారెడ్డి జిల్లా కేంద్రంగా జాతీయ రహదారికి ఆనుకొని ఉండడం.. రోజు రోజుకూ విస్తరిస్తుండడం.. గ్రామాలు పట్టణంలో వీలినం కావడం.. వీటికి తోడు లక్షకుపైగా జనాభా దాటినప్పటికీ ఒకే ఒక్క పోలీసు స్టేషన్‌ ఉంది. దీని వల్ల శాంతి భద్రతల పర్యవేక్షణ పోలీసులకు సవాల్‌గా మారుతోంది. జిల్లా పోలీసులు నూతన టెక్నాలజీని వాడుతూ దొంగతనాలను అరికడుతున్నారు. నేరాలను అదుపు చేస్తున్నారు. అయినా అంతర్‌రాష్ట్ర దొంగల ముఠా ఏదో ఒక రూపంలో చోరీలకు పాల్పడుతున్నారు. ఈ చోరీలు పట్టణ వాసులను ఆందోళనకు గురి చేస్తున్నాయి.


కామారెడ్డిలోని ఒక్క పోలీసు స్టేషన్‌లో ఉన్న సిబ్బందే అన్ని బాధ్యతలను తీసుకోవాల్సి వస్తుండడంతో దొంగతనాలను నియంత్రించడంలో దృష్టి సారించలేక పోతున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంగా ఏర్పడిన తర్వాత అదనంగా మరో పోలీసుస్టేషన్‌, ట్రాఫిక్‌ పోలీసు స్టేషన్‌ను ఏర్పాటు చేయాలని జిల్లా పోలీసు శాఖతోపాటు ప్రజాప్రతినిధులు ప్రభుత్వానికి, రాష్ట్ర హోంశాఖకు ప్రతిపాదించినా ఎలాంటి చర్యలు లేవు. దీని వల్ల ఉన్న పోలీసు స్టేషన్‌ సిబ్బందిపైనే అదనపు భారం పడుతోంది. నూతన కలెక్టరేట్‌ ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్‌ సైతం కామారెడ్డికి ట్రాఫిక్‌ పోలీసు స్టేషన్‌ మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికీ సీఎం హామీ మాత్రం నెరవేరడం లేదు.


ప్రశ్నార్థకంగా పట్టణ భద్రత


కామారెడ్డి పట్టణంలో శాంతి భద్రతల పర్యవేక్షణ ప్రశ్నార్థకంగా మారుతోంది. పట్టణంలో జరుగుతున్న చోరీలు ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. చోరీల నియంత్రణకు పోటీస్‌ యంత్రాంగం చర్యలు తీసుకుంటున్నా కొత్త తరహా దొంగతనాలు జరుగుతున్నాయి. ఆకతాయి ఆగడాలు ఇటీవల కాలంలో మితిమీరిపోతున్నాయి. ఘర్షణలు, ఆకతాయి ఆగడాలతో పట్టణ ప్రజల భద్రత ప్రశ్నార్థకంగా మారుతుంది.


పట్టణంలో సమస్యాత్మక ప్రాంతాలు


పట్టణంలో సమస్యాత్మక ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. రాజకీయ పార్టీలు పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తుంటాయి. అధికార పార్టీకి పోటీగా ప్రతిపక్ష పార్టీలు చురుకుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. దీంతో అప్పుడప్పుడు రాజకీయ పార్టీల మధ్య వివాదాలు, ఘర్షణలు జరుగుతునే ఉంటాయి. దానికి తోడు వివిధ మతాలకు చెందిన పండుగలు నిర్వహిస్తుంటారు. గణేష్‌ ఉత్సవాలు, దుర్గమాత నవరాత్రి ఉత్సవాలు, శ్రీరామ నవమి ఉత్సవాలు, హనుమన్‌ జయంతి ర్యాలీలు పెద్దఎత్తున జరుగుతాయి. పండుగల సమయంలో పోలీసు యంత్రాంగం పకడ్బందీ చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. నిత్యం వీఐపీల పర్యటనలు కూడా ఉంటాయి, వీఐపీల బందోబస్తు పోలీసులకు అదనపు భారం. రాజకీయ కక్షలు, పాత కక్షలతో దాడులు, ప్రతి దాడులు జరుగుతునే ఉంటాయి. ఇంత ఒత్తిడి ఉన్నా పట్టణంలో సరిపడా పోలీసు స్టేషన్‌లు లేకపోవడం ఇబ్బందికరంగా ఉంటుంది


ట్రాఫిక్‌ కష్టాలు అంతా ఇంతా కాదు


జిల్లా కేంద్రంలో ట్రాఫిక్‌ కష్టాలు ప్రజలకే కాకుండా పోలీసులకు సైతం తీవ్రంగా ఉంటుంది. పట్టణంలో ఏదో ఒక్కచోట నిత్యం ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తుంటాయి. కామారెడ్డి పట్టణానికి నిత్యం ఐదారు జిల్లాల నుంచి సుమారు 50,000ల మంది వరకు ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. అటు బస్సులు ఇటు రైలు ప్రైవేట్‌ వాహనాలల్లో వేల మంది వచ్చి పనులు చేసుకొని వెళ్తుంటారు. జిల్లాగా ఏర్పాటు అయిన తర్వాత వాహనాల రద్దీ మరీ ఎక్కువైంది. పట్టణంలో నిజాంసాగర్‌ చౌరస్తా, కొత్త బస్టాండ్‌, రైల్వే ఫ్లైఓవర్‌ బ్రిడ్జీ, రైల్వేస్టేషన్‌, తిలక్‌ రోడ్డు, గంజి రోడ్డు, సుభాష్‌ రోడ్డు, రామారెడ్డి రోడ్లలో ట్రాఫిక్‌ ఇబ్బందులు ఉన్నాయి. ట్రాఫిక్‌ పోలీసు స్టేషన్‌ లేక పోవడంతో పట్టణ పోలీసులే ట్రాఫిక్‌ విధులు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం పట్టణంలో ట్రాఫిక్‌ పోలీసు స్టేషన్‌ చాలా అవసరమని పోలీసు అధికారులు సైతం పేర్కొంటున్నారు.


ఒక్కటే పోలీసు స్టేషన్‌


కామారెడ్డి పట్టణ జనాభా లక్ష దాటిపోయింది. పట్టణానికి నిత్యం వేల మంది ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. జాతీయ రహదారితో పాటు రైల్వే సౌకర్యం ఉండడంతో పట్టణానికి దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన వారు రావడానికి రవాణా వ్యవస్థ అనుకూలంగా ఉంది. జిల్లా కేంద్రంలో రైలు పట్టాలకు 2 వైపులా పట్టణం ఉండడం వల్ల పాత పట్టణానికి ఒక్క పోలీసు స్టేషన్‌, కొత్త పట్టాణానికి మరో పోలీసు స్టేషన్‌ అవసరం అవుతోంది. పట్టణంలోని కిష్టమ్మ గుడి ప్రాంతంలో అవుట్‌ పోస్ట్‌ ఉంది. గత ఏడాది కిందట కామారెడ్డి పోలీసు స్టేషన్‌తోపాటు ఇతర స్టేషన్‌లకు అదనపు సిబ్బందిని కేటాయించారు. దీంతో కామారెడ్డి పోలీసుస్టేషన్‌లో సిబ్బంది కొరత కాస్తా తీరింది. పట్టణంలో ప్రస్తుతం ఉన్న పోలీసు స్టేషన్‌తోపాటు అదనంగా రెండో పోలీసు స్టేషన్‌, ట్రాఫిక్‌ పోలీసుస్టేషన్‌ అవసరం ఉందని పోలీసు అధికారులు చెబుతున్నారు. ఈ పోలీసు స్టేషన్‌ల ఏర్పాటుకు గతంలోనే ప్రభుత్వానికి సైతం నివేదించారు. కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు.


కామారెడ్డిలో నూతనంగా నిర్మించిన కలెక్టరేట్‌ సమీకృత భవనాలను సీఎం కేసీఆర్‌ ఇటీవల ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్‌ జిల్లాపై పలు హామీల వర్షం కురిపించారు. హామీల్లో భాగంగా కామారెడ్డి పట్టణానికి కొత్తగా ట్రాఫిక్‌ పోలీసు స్టేషన్‌ను మంజూరు చేస్తామని, దేవునిపల్లి పోలీసు స్టేషన్‌ను అప్‌గ్రేడ్‌ చేస్తామని హామీ ఇచ్చారు. రెండు నెలలు గడుస్తున్నా హామీ మాత్రం పురవేరలేదు. గతంలోనే జిల్లా పోలీసు శాఖతోపాటు ప్రజాప్రతినిధులు పట్టణంలో అదనంగా మరో పోలీసుస్టేషన్‌ ట్రాఫిక్‌ పోలీసుస్టేషన్‌ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు ప్రభుత్వానికి నివేదించారు. ఇప్పటికీ ఆ ప్రతిపాదన ముందుకు సాగడం లేదు. దీంతో కామారెడ్డి పట్టణంలో శాంతిభద్రతలు ప్రశ్నార్థకంగా మారుతున్నాయి.