Nizamabad News: ద్రోణి ప్రభావంతో కురిసిన వానలకు అన్నదాతలకు తీరని నష్టం వాటిల్లింది. భారీగా వరి పంట నష్టపోయారు రైతులు. పంట కోతల సమయంలో.. వర్షాలు పడడంతో ధాన్యమంతా వర్షం పాలయ్యింది. కోతకు వచ్చిన వందల ఎకరాల్లో నువ్వులు, జొన్నలు, మామిడి, కూరగాయల పంటలు పండించిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కురిసిన వడగళ్ల వాన రైతులను వణికించింది. వరి, నువ్వు, సజ్జ, పంటలు నేలమట్టం అయ్యాయి. కల్లాలపై ఆరబెట్టిన ధాన్యం రైతుల కళ్లెదుటే వరద నీటికి కొట్టుకుపోయింది. కొనుగోలు కేంద్రాల్లో వడ్ల రాశులు, బస్తాలు తడిసి ముద్దయ్యాయి. దీంతో కొనుగోళ్ల ప్రక్రియకు ఆటంకం ఏర్పడింది. 447 ఎకరాల్లో నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. వ్యవసాయ సిబ్బంది క్షేత్ర స్థాయిలో పంట నష్టం అంచనాలు రూపొందించాలని జిల్లా వ్యవసాయాధికారి ఆదేశించారు. వరుస వానలతో పొలాల్లో నీరు చేరడంతో కోత యంత్రాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.


అకాల వర్షానికి ఆరబెట్టిన ధాన్యమే కాకుండా.. కొనుగోలు చేసిన వడ్లు తడిశాయి. 20 కేంద్రాల్లోని 9 వేల క్వింటాళ్లు తడిసినట్లు అధికారులు గుర్తించారు. దీన్ని వెంటనే బాయిల్డ్ రైస్ మిల్లులకు పంపే విధంగా చర్యలు చేపట్టారు. నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గంలోని పలు చోట్ల లారీల సమస్య కూడా ఉన్నట్లు రైతులు చెబుతున్నారు. ధర్పల్లి మండలంలోని ఓ కేంద్రంలో ఇద్దరు రైతులకు చెందిన 75 బస్తాల వడ్లు.. ఆరు రోజుల క్రితం తూకం వేసినా ఇంకా తడుస్తూనే ఉన్నాయి. మరోవైపు రానున్న 3 రోజుల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో మోస్తరు నుంచి భారీ వానలు కురిసే అవకాశం ఉందని కృషి విజ్ఞాన కేంద్రం వాతావరణ శాఖ తెలిపింది. దీంతో కేంద్రాల నిర్వాహకులు, వివిధ శాఖల అధికారులతో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ సమీక్షా సమావేసం నిర్వహించారు. తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయంలో రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు.


అటు కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా రెండ్రోజులుగా కురుస్తున్న వడగళ్ల వానతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఆరబెట్టిన ధాన్యంలో నిలిచిన వర్షం నీటిని బయటకు బయటకు తీసేందుకు అవస్థలు పడ్డారు. కొన్ని చోట్ల తూకం వేసిన బస్తాలు తడిసిపోయాయి. కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాల్లో భారీగా పంట నష్టం వాటిల్లింది. రాళ్ళ వానకు మామిడి నేల రాలిపోయింది. జొన్నలు, సజ్జలు, మినుములు, పెసర్లు పంట నష్ట పోయారు రైతులు.


ఏ మేర పంటనష్టం జరిగిందో అంచనా వేయాలన్న సీఎం


రాష్ట్రంలో గత రెండు రోజులుగా అక్కడక్కడ కురిసిన అకాల వర్షాలు, వడగండ్ల వానలు కురిసిన సంగతి తెలిసిందే. అక్కడక్కడా పంటలు కూడా దెబ్బతిన్నాయి. ఈ క్రమంలోనే రెండ్రోజుల క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. కరీంనగర్‌, చొప్పదండి, నిజామాబాద్ సహా మరికొన్ని ప్రాంతాల్లో కురిసిన వడగళ్ల వర్షాల వల్ల పంటలు బాగా దెబ్బతిన్నాయి. అందుకే ఏయే ప్రాంతాల్లో ఎంత మేరకు పంటలు దెబ్బతిన్నాయో అంచనా వేయడానికి చర్యలు చేపట్టాలని రాష్ట్ర చీఫ్‌ సెక్రెటరీ శాంతి కుమారికి ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి ఆయా జిల్లాల్లో దెబ్బతిన్న పంటలకు సంబంధించిన రిపోర్టులు తెప్పించాలని ఆదేశించారు.