నేడు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బులు 


నేడు అనంతపురం జిల్లా నార్లప వేదికగా ముఖ్యంత్రి జగన్ మోహన్ రెడ్డి వసతి దీవెన నిధులు విడుదల చేయనున్నారు 9,55,662 మంది విద్యార్థులకు సంబంధఇంచిన డబ్బులను వారి తల్లుల ఖాతాల్లో రూ.912.71 కోట్లు జమ చేయనున్నారు. దీంతో ఇప్పటివరకు 25,17,245 మంది విద్యార్థులకు సంబంధించి రూ.4,275.76 కోట్లు వేసినట్టు అవుతుంది. 


వసతి దీవెన పథకం కింద ఉన్నత చదువులు చదివే విద్యార్థుల భోజన, వసతి ఖర్చుల కోసం ఈ డబ్బులు వేస్తున్నారు. ఏటా రెండుసార్లు ఈ డబ్బులు వేయనున్నారు. ఐటీఐ విద్యార్థులకు పదివేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు పదిహేను వేలు, డిగ్రీ, మెడిసన్, ఇంజనీరింగ్ చదవే విద్యార్థులకు ఇరవై వేలు చొప్పువ ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం చేస్తోంది. 


నేడు ఇంటర్ రిజల్ట్స్‌


ఇంటర్మీడియట్‌ ఫలితాలను నేడు (ఏప్రిల్ 26) విడుదల చేయనున్నారు. సాయంత్రం 5 గంటలకు విజయవాడలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేస్తారని ఇంటర్‌ విద్యామండలి కార్యదర్శి ఎంవీ శేషగిరిబాబు ఏప్రిల్ 25న ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్మీడియట్ జనరల్, ఒకేషనల్ ఫస్టియర్, సెకండియర్ పరీక్ష ఫలితాలను ఒకేసారి వెల్లడించనున్నట్లు బోర్డు తెలిపింది. ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్లతోపాటు ఇతర మీడియా వెబ్‌సైట్లలోనూ ఫలితాలను అందుబాటులో ఉంచనున్నారు. 


ఫలితాలు ఇలా చూసుకోండి...


స్టెప్-1: ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఏప్రిల్ 26న సాయంత్రం 5.00 గంటలకు ఫలితాలను విడుదల చేస్తారు. 


స్టెప్-2: ఇంటర్ ఫలితాలు విడుదల కాగానే అభ్యర్థులు https://bie.ap.gov.in/ లేదా https://examresults.ap.nic.in వెబ్‌సైట్లను సందర్శించాలి.









స్టెప్-4: ఫలితాలకు సంబంధించిన లింక్ మీద క్లిక్ చేయగానే లాగిన్‌తో కూడిన కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. 


స్టెప్-5: లాగిన్ పేజీలో అభ్యర్థులు తమ హాల్‌టికెట్ నంబర్ నమోదు చేయాలి. 


స్టెప్-5: తర్వాత 'SUBMIT' బటన్‌ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఫలితాలు కంప్యూటర్ హోం స్క్రీన్‌పై కనిపిస్తాయి.


స్టెప్-6: ఫలితాల కాపీని ప్రింట్ తీసుకుని, భవిష్యత్ అవసరాల కోసం భద్రపరుచుకోవాలి.


ముందస్తు బెయిల్‌పై టెన్షన్


వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ వైఎస్ అవినాష్ రెడ్డి దాఖలు చేసుకున్న పిటిషన్‌పై విచారణను ఇవాళ జరగనుంది. నిన్న విచారించిన హైకోర్టు బుధవారానికి వాయిదావేసింది. ముందుగా ఈ కేసు విచారణ ఉదయం ధర్మాసనం ముందుకు వచ్చింది. అయితే  సుప్రీం కోర్టు ఆర్డర్ కాపీ ఇంకా అందలేదని అవినాష్ తరపు లాయర్ కోర్టుకు చెప్పారు. దీంతో ఆర్డర్ కాపీని చూసిన తర్వాతే తుది తీర్పును వెల్లడిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఆర్డర్ కాపీ అందిన  తర్వాత మధ్యాహ్నం మళ్లీ విచారణ జరిగింది. ఈ సందర్భంగా వాదనలు బుధవారం వింటామని న్యాయమూర్తి .. కేసును వాయిదా వేశారు. గత విచారణలో ఈనెల 25 వరకు అవినాష్‌ రెడ్డిని అరెస్ట్ చేయొద్దని, తాము చెప్పిన విధంగా అవినాష్‌ను విచారించాలని సీబీఐ అధికారులకు తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. అలాగే అవినాష్ మధ్యంతర బెయిల్‌ను తెలంగాణ హైకోర్టు మంజూరు చేసింది. దీనిపై సునీతరెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. మధ్యంతర బెయిల్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది.  అలాగే ముందస్తు బెయిల్‌పై హైకోర్టులోనే తేల్చుకోవాలని సుప్రీం అవకాశం కల్పించింది. ఈ క్రమంలో  హైకోర్టులో అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై వాదనలు జరగాల్సి ఉంది. బుధవారం ముందస్తు బెయిల్ వస్తుందా లేదా అన్నదానిపై క్లారిటీ వస్తుంది.  


రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు VS కోల్‌కతా నైట్‌రైడర్స్


ఐపీఎల్‌ 2023లో మ్యాచులు ఆసక్తికరంగా సాగుతున్నాయి. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య నేడు రెండో మ్యాచ్‌ జరుగుతోంది. తొలి పోరులో 81 రన్స్ తేడాతో ఓడిన ఆర్సీబీ ఈసారి ప్రతీకారం కోసం పట్టుదలగా ఉంది. వరుస ఓటములతో వెనకబడ్డ కేకేఆర్ మళ్లీ గెలుపు బాట పట్టాలని ప్రయత్నిస్తోంది. మరి ఇద్దరిలో విజయం ఎవరిదో!


కోహ్లీ కెప్టెన్సీతో జోష్‌!


రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు (Royal Challengers Bangalore) విరాట్‌ కోహ్లీ (Virat Kohli) జోష్‌ తీసుకొస్తున్నాడు. డుప్లెసిస్‌కు ఫిట్‌నెస్‌ ఇబ్బందులు ఉండటంతో చివరి రెండు మ్యాచుల్లో సారథ్యం వహించాడు. తనదైన అగ్రెషన్‌తో రెండింట్లోనూ విజయం అందించాడు. ఏదేమైనా టాప్‌ ఆర్డర్‌ ఆడినంత వరకు ఆర్సీబీకి ఫర్వాలేదు. జట్టు చేసిన మొత్తం పరుగుల్లో కోహ్లీ, డుప్లెసిస్‌, మాక్స్‌వెల్‌ వాటానే ఎక్కువ! మిడిల్‌ నుంచి లోయర్‌ వరకు ఎవరూ కంట్రిబ్యూట్‌ చేయడం లేదు. కేకేఆర్‌ స్పిన్నర్లు వరుణ్‌, నరైన్‌ ఈ ముగ్గుర్నీ ఔట్‌ చేస్తే ఇబ్బందులు తప్పవు. బౌలింగ్‌ యూనిట్‌ మాత్రం ఫర్వాలేదు. మహ్మద్‌ సిరాజ్‌ (Mohammad Siraj) కెరీర్‌లోనే బెస్ట్‌ ఫామ్‌లో ఉన్నాడు. స్క్రాంబుల్‌ సీమ్‌తో పవర్‌ప్లేలో వికెట్లు అందిస్తున్నాడు. టైట్‌ లెంగ్తుల్లో బంతులేస్తున్నాడు. హర్షల్‌ పటేల్‌ తోడుగా ఉన్నాడు. హసరంగ తన స్పిన్‌తో మాయాజాలం చేస్తున్నాడు. ఆసీస్‌ పేసర్‌ జోష్‌ హేజిల్‌వుడ్‌ వస్తే తిరుగుండదు.


వరుసగా 4 ఓటములు!


కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (Kolkata Knight Riders) ఈ సీజన్లో ప్లేఆఫ్ చేరాలంటే అద్భుతమే చేయాలి! ఎందుకంటే వరుసగా నాలుగు మ్యాచుల్లో ఓటమి పాలై విన్నింగ్‌ మూమెంటమ్‌ కోల్పోయింది. ఎంత కష్టపడ్డా.. ఏదో ఒక దశలో వెనకబడుతోంది. వ్యూహాలు, ఆటగాళ్ల ఎంపికలో పదేపదే తప్పులు జరుగుతున్నాయి. ఈ సీజన్లో కేకేఆర్‌ ఓపెనింగ్‌ జోడీ కాంట్రిబ్యూషన్‌ ఏమీ లేదు! వెంకటేశ్‌ అయ్యర్‌, నితీశ్‌ రాణా, రింకూ సింగ్‌ (Rinku Singh) మాత్రం మంచి ఫామ్‌లో ఉన్నారు. జేసన్‌ రాయ్‌ విధ్వంసకరంగా ఆడుతున్నాడు. శార్దూల్‌ నిలబడితే బాదగలడు. ఆండ్రీ రసెల్‌ ఇప్పటి వరకు తన స్థాయి ఇన్నింగ్స్‌ ఆడనేలేదు. బౌలింగ్‌ డిపార్ట్‌మెంట్‌ వీక్‌గా ఉంది. వికెట్లు తీయడం లేదు. పైగా విపరీతంగా పరుగులు ఇస్తున్నారు. ప్రత్యర్థులు భారీ స్కోర్లు చేస్తుండటంతో బ్యాటర్లకు ప్రెజర్‌ పెరుగుతోంది. కొన్నిసార్లు వరుణ్ చక్రవర్తి, సునిల్‌ నరైన్‌ వికెట్లు పడగొడుతున్నారు. కానీ వారినీ బ్యాటర్లు అటాక్‌ చేస్తున్నారు. ఈ సీజన్లో ఏ పేసర్‌ కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. 


ఏపీ భవన్‌ విభజనపై భేటీ


ఢిల్లీలోని ఏపీ భవన్ విభజనపై ఇవాళ మరో భేటీ జరగనుంది. షెడ్యూల్ ప్రకారం సోమవారమే జరగాల్సి ఉన్న భేటీ ఇవాల్టికి వాయిదా వేశారు. కేంద్ర హోంశాఖ ఆఫీస్‌ నార్త్ బ్లాక్‌లో కేంద్ర హోంమంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి అధ్యక్షతన ఈ సమావేశం జరగబోతోందు. ఈ భేటీకి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరఫున ఆదిత్యనాథ్ దాస్, రావత్, ప్రేమ చంద్రారెడ్డి హాజరుకానున్నారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున రామకృష్ణారావు, గౌరవ్ ఉప్పల్ సమావేశంలో పాల్గొంటారు. విభజన చట్టం ప్రకారం ఏపీ భవన్‌ ఎప్పుడో విభజన కావాల్సి ఉన్నప్పటికీ ఇంతవరకు తేలలేదు. ఇప్పుడు ఈ భవన్‌ 48శాతం తెలంగాణ 52 శాతం ఏపీ వాటాగా పంచుకొని కార్యకలాపాలు నిర్వహించుకుంటున్నారు. 


సిసోడియా  బెయిల్ పై నేడు నిర్ణయం


ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం సిసోడియా  బెయిల్ పిటిషన్ పై ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు నేడు సాయంత్రం 4 గంటలకు తీర్పు వెలువరించనుంది.


వన్ ఎర్త్, వన్ హెల్త్' ప్రారంభించనున్న మోదీ


ఢిల్లీలోని ప్రగతి మైదాన్ లో జరుగుతున్న 'వన్ ఎర్త్, వన్ హెల్త్' సదస్సును ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ గా ప్రారంభించనున్నారు.