ఇందూరు గడ్డ అసాంఘీక కార్యక్రమాలకు అడ్డాగా మారింది. ఓ వైపు పీఎఫేఐ కార్యకలాపాలు చాలా కాలం నుంచి జరుగుతున్నా పోలీసులు లేట్ గా స్పందించారు. ఆదిలోనే వీరి మూమెంట్స్ ను పసిగట్టలేకపోయారన్న ఆరోపణలు వస్తున్నాయ్. నిజామాబాద్ జిల్లా కేంద్రాన్నే ప్రధాన శిక్షణ కేంద్రంగా చేసుకుని పీఎఫ్ఐ సభ్యులు ట్రైనింగ్ నడిపారు. ఇది ఇంత లేట్ పోలీసులు తెలుసుకోవటంపై ఆరోపణలు వస్తున్నాయ్. ఓ వైపు తల్వార్లతో దాడులు, మరోవైపు గుప్పుమంటున్న గంజాయ్ వ్యాపారం, డ్రగ్స్ అమ్మకాలు, మట్కా, పేకాటతో బతుకులు చిత్తు చేసుకుంటున్నా.... పోలీసుల నిఘా వైఫల్యంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయ్. 

 

రెండేళ్లుగా పీఎఫ్ఐ కార్యకలాపాలు

 

నిజామాబాద్ జిల్లాలో పోలీసు వ్యవస్థపై అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయ్. జిల్లాలో ఉగ్రనీడ వ్యాపిస్తుంటే ఆలస్యంగా తేరుకున్నారు పోలీసులు. ఏకంగా పీఎఫ్ఐ జిల్లాను కేంద్రంగా చేసుకుని ఉగ్ర కలాపాలను నూరి పోస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారన్న ప్రశ్న తలెత్తుతోంది. పీఎఫ్ ఐ కీలక సభ్యులు నిజామాబాద్ లోనే ఉండి ట్రైనింగ్ ఇచ్చారు. ఇది ఆలస్యంగా పోలీసులు తెలుసుకోవటం ఏంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయ్. 

 

ఫ్రెండ్లీ పోలీసు ముసుగులో పోలీస్ స్టేషన్లు పైరవీకారులకు అడ్డాగా మార్చేశారన్న ఆరోపణలు వస్తున్నాయ్. శాంతిభద్రతలు గాలికి వదిలి స్వలాభం కోసం పోలీసు అధికారులు ప్రయత్నం చేస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయ్. చాప కింద నీరులా విస్తరించిన పీఎఫ్ఎస్ఐ నిషేధిత సంస్థ కార్యకలాపాలను ఎన్ఎస్ఐఏ గుర్తించేంత వరకు జిల్లా పోలీసులకు గురి లేదంటే ఇంతకంటే ఫెయిల్యూర్ లేదంటూ జిల్లా పోలీసుపై ప్రజల నుంచి ఆరోపణలు వ్యక్తమౌతున్నాయి.

 

నిజామాబాద్ జిల్లా అనేక ఏళ్ళుగా ఉగ్రవాదులకు అడ్డాగా మారింది. నాటి ఉగ్రవాది అజాంఘోరి నుంచి నేటి పీఎఫ్ఎస్ఐ జిల్లా కన్వీనర్ షాదుల్లా వరకు అనేక మంది నిజామాబాద్ ను షల్టర్ చేసుకుని ఉగ్ర కార్యకలాపాలను నిర్వహించారు. అనేక ఏళ్లుగా సద్దుమణగగా ఇటీవల మళ్ళీ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఉగ్రకార్యకలాపాలు బయటపడ్డాయి.

 

ఏకంగా నిజామాబాద్ కేంద్రంగా 400 మందికి శిక్షణ ఇవ్వడం సంచలనం రేపుతుంది. మత విద్వేషాలు రెచ్చగొట్టడం, అల్లర్లకు పాల్పడడం, కరాటే, మారుణాయుధాలు వినియోగించడంలో నైపుణ్యాన్ని నేర్పించడానికి నిజామాబాద్ ను అడ్డాగా ఎంచుకున్నారంటే ఇక్కడి పోలీసు వ్యవస్థ ఎంత అస్తవ్యస్తంగా ఉందో స్పష్టమౌతుంది.

 

జగిత్యాల్ జిల్లాకు చెందిన అబ్దుల్ ఖాదర్ నిజామాబాద్ ను అడ్డాగా చేసుకుని ఉగ్ర కార్యకలాపాలను దాదాపు రెండేళ్లుగా నిర్వర్తిస్తున్నప్పటికీ పోలీసులు గుర్తించకపోయారు. 400 మందికి శిక్షణ ఇవ్వడం వెనుక పీఎఫ్ఎస్ఐ సంస్థ నిజామాబాద్‌ను ఎన్నుకున్నారంటే ఇక్కడి పోలీసు వ్యవస్థ ఎంత నిర్వీర్యంగా పని చేస్తుందో అనే దానికి ఉదాహరణ.
 

విచ్చలవిడిగా గంజాయి స్మగ్లింగ్

 


నిజామాబాద్ గంజాయికి అడ్డగా మారిపోయింది. 3 నెలల కిందట హాడావుడి చేసిన పోలీసులు ఆ తర్వాత గంజాయి స్మగ్లర్లపై నిఘా కొరవడింది. జిల్లా కేంద్రం నుంచి నిత్యం గంజాయి సరఫరా అవుతున్నప్పటికీ పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారన్న అరోపణలు వెల్లువెత్తుతున్నాయ్. అటు మహారాష్ట్ర, ఇటు కర్ణాటక నుంచి వస్తున్న గంజాయి నిజామాబాద్ మీదుగా జోరుగా సరఫరా అవుతోందని సమాచారం. 3 నెలల క్రితం గంజాయి అక్రమ రవాణపై ప్రత్యేక దృష్టి సారించిన పోలీసులు వరుసగా కేసులు నమోదు చేశారు. తర్వాత పట్టించుకున్న వారు లేరనే ఆరోపణలు వినిపిస్తున్నాయ్. గంజాయి ఈజీగా నగరంలో సరఫరా చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. యువత దీనికి బానిసలుగా మారుతున్నారు. పాన్ షాపుల్లో సైతం గంజాయి ఈజీగా దొరుకుతుందంటున్నారు. 

 

జోరుగా మట్కా, పేకాట. 

 

మట్కా, పేకాట జిల్లాలో ఓ దందాగా మారిపోయింది. దీనిపై పోలీసులు ఏ మాత్రం స్పందించటం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయ్. పేకాట స్థావరాలు అపార్ట్‌మెంట్లలో, ఫాంహౌసుల్లో నడుపుతున్నా.... పోలీసులు అటువైపు కన్నేత్తి చూడటం లేదన్న వాదనలూ వినిపిస్తున్నాయ్.  రోజురోజుకు టెక్నాలజి పెరుగుతుంటే అందుకు తగ్గట్టుగా పోలీసులు జిల్లాలో జరుగుతున్న నేరాలను, అక్రమ వ్యవహరాలను పసిగట్టే అవకాశం ఉన్నప్పటికీ విఫలం కావడం వెనుక నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందని అంటున్నారు.

 

జిల్లాలో రోజురోజుకు నేరాల సంఖ్య పెరిగిపోతుంది. అక్రమార్కులు దర్జాగా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. గంజాయి అక్రమ రవాణాకు అడ్డులేకుండాపోతుంది. డ్రగ్స్ సంస్కృతి హెచ్చుమీరిపోయింది. గుట్కా, మట్కా. పేకాట జోరుగా సాగుతుంది. దొంగతనాలు విచ్చలవిడిగా జరుగుతూనే ఉన్నాయి. ఇలా జిల్లాలో పోలీసులు ఫెయిల్యూర్‌తో అరాచకాలు పెరిగిపోతున్నాయనే భావన ప్రజల్లో కలుగుతోంది.

 

నిజామాబాద్ నగరంతో పాటు పల్లెల్లో కూడా గంజాయి, డ్రగ్స్ వాడే సంస్కృతి పాకింది. భారీ ఎత్తున జిల్లాకు గంజాయి, డ్రగ్స్ సరఫరా అవుతుంది. నగరంలో విచ్చలవిడిగా దొరుకుతున్నాయి. ప్రధానంగా యువకులు గంజాయి, డ్రగ్స్ భారిన పడి బానిసలుగా మారుతున్నారు. ఆర్మూర్, బోధన్ పట్టణాల్లో భారీగా అమ్మకాలు జరుగుతున్నాయి. అనేక ఏళ్ళుగా గంజాయి రవాణా విశాఖపట్టణం నుంచి నిజామాబాద్‌కు జరుగుతుంది. రాష్ట్రంలోనే తొలి పీడీ యాక్టు కేసును నిజామాబాద్ కు చెందిన గంజాయి స్మగ్లర్ పై విధించారు.