నిజామాబాద్ జిల్లాలో ఓ పెళ్లి కూతురు వివాహానికి కొద్ది సేపు ముందు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. జిల్లాలోని నవీపేట మండలంలో ఈ ఘటన జరిగింది. అయితే, పెళ్లి కొడుకు వేధింపులు తట్టుకోలేకే యువతి ఆత్మహత్య చేసుకున్నట్లుగా ఆమె తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పెళ్లి వేడుకలో కూడా చక్కగా డాన్సులు చేసిన రవళి, పెళ్లి కొడుకు సంతోష్‌తో ఫోన్‌లో మాట్లాడిన తర్వాతే విచారకరంగా మారిపోయిందని తల్లిదండ్రులు ఫిర్యాదులో చెప్పారు. ఆమె ఉద్యోగం చేయాలని, ఆస్తి కోసం పెళ్లి కొడుకు సంతోష్‌ ఒత్తిడి చేశాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన నిజామాబాద్ పోలీసులు వేర్వేరు కోణాల్లో దర్యాప్తు మొదలుపెట్టారు. పెళ్లి కూతురు ఆత్మహత్య చేసుకున్న కేసులో పోలీసులు తాజాగా వరుడు సంతోష్‌పై 306 సెక్షన్‌ కింద కేసు నమోదు చేశారు. 


విచారణలో భాగంగా పోలీసులు రవళి - సంతోష్‌ మాట్లాడుకున్న కాల్‌ డేటాను సేకరిస్తున్నారు. అమ్మాయి కచ్చితంగా జాబ్‌ చేయాలని పట్టుబట్టాడని, ఆస్తిలో వాటా కూడా కావాలని డిమాండ్‌ చేశాడని ఆరోపిస్తున్నారు. 


అయితే, అవన్నీ అవాస్తవాలని సంతోష్‌ కొట్టిపారేశారు. తనపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. అప్పటివరకు కుటుంబసభ్యులు, ఫ్రెండ్స్‌తో కలిసి సరదాగా ఉన్న రవళి అంతలోనే ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏంటనే అంశంలో నిజానిజాలేంటన్నది పోలీసులు తేల్చే పనిలో ఉన్నారు. కాల్ డేటా పూర్తి స్థాయిలో విశ్లేషించాక దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.


అసలు ఏం జరిగిందంటే..


పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండల కేంద్రానికి చెందిన ర్యాగల రవళిని నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన సంతోశ్​ కు ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే అమ్మాయి, అబ్బాయిలు అప్పుడప్పుడూ ఫోన్ లో మాట్లాడుకునేవారు. పెళ్లి తర్వాత జీవితం చాలా బాగుంటుందని భావించిన ఆ అమ్మాయికి.. అతడిపై అనుమానం మొదలైంది. అతడు మాట్లాడే మాటలు చూస్తుంటే తనను బాగా చూసుకోలేడనే భావన కలిగింది. కానీ తన పెళ్లి అని సంతోషంగా ఉన్న ఆ తల్లిదండ్రులకు ఈ విషయం తెలిస్తే ఎక్కడ బాధపడతారో అని తన మనసులోనే దాచుకుంది. పైకి నవ్వుతూ, పెళ్లి ఏర్పాట్లలో పాల్గొంటూనే లోలోపల మదనపడుతోంది. అయితే ఆదివారం నిజామాబాద్‌లో మధ్యాహ్నం 12:15 గంటలకు వివాహం జరిపేందుకు తల్లిదండ్రులు అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ అతనితో కలిసి అస్సలే జీవించలేనని భావించిన ఆ అమ్మాయికి ఏం చేయాలో పాలుపోలేదు. పెళ్లికి ముందే ప్రాణం తీసుకుంటే తన వల్ల కుటుంబ సభ్యుల పరువు పోదని, తనకు బాధతప్పుతుందని భావించింది. ఇంట్లో అందరూ చుట్టాలు ఉండగానే.. ఓ గదిలోకి వెళ్లి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.


అయితే చాలా సేపటి నుంచి కూతురు కనిపించకపోవడంతో అందరూ ఆమె గురించి వెతికారు. చివరకు రూంలో ఉందనుకొని తలుపులు కొట్టారు. ఎంతకూ గది తలుపులు తెరవకపోవడంతో.. తలుపులు పగులగొట్టారు. మరికొన్ని గంటల్లో పెళ్లి కూతురులా ముస్తాబై, ఆనందంగా అత్తగారింటికి వెళ్లాల్సిన ఆ అమ్మాయి ఉరికి వేలాడుతూ కనిపించింది. ఇది చూసి షాకైన తల్లిదండ్రులు అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. కన్నీరుమున్నీరుగా విలపిస్తూనే ఉన్నారు. పెళ్లి చూసేందుకు వచ్చిన బంధువులు, స్నేహితులు కూడా యువతి అంత్యక్రియల్లో పాల్గొనాల్సి వస్తోందంటూ కంటతడి పెట్టారు. స్థానికుల ద్వారా విషషయం తెలుసుకున్న పోలీసులు రంగ ప్రవేశం చేశారు. పెళ్లి కుమారుడు మానసికంగా వేధించడంతోనే తమ కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిందని యువతి తల్లిదండ్రులు పోలీసులకు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అలాగే పోస్టుమార్టం నిమిత్తం రవళి మృతదేహాన్ని నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.