సుగంధ ద్రవ్యాల బోర్డు సభ్యునిగా బీజేపీ నేత, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అర్వింద్ ధర్మపురి ఎన్నికయ్యారు. దీనికి సంబంధించి స్పైస్ బోర్డు సభ్యులుగా లోక్ సభ ఎంపీలు అర్వింద్ ధర్మపురి, బాలశౌరి వల్లభనేని లు ఎన్నికైనట్లు పార్లమెంట్ బులిటెన్ విడుదల చేసింది. ఈ సందర్భంగా ఎంపీ అర్వింద్ మాట్లాడుతూ.. స్పైస్ బోర్డు సభ్యునిగా ఎన్నికవ్వడంపై ఎంపీ అర్వింద్ సంతోషం వ్యక్తం చేశారు. తాజా నియామకంతో నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని పసుపు రైతులకు మరింత సేవ చేసే అవకాశం లభించిందని అన్నారు. పసుపు, మిర్చి రైతుల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తానని ఎంపీ అర్వింద్ హామీ ఇచ్చారు. తన ఎన్నికకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు చెప్పారు. 


పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికైన 8 నెలల కాలంలోనే మోదీ ప్రభుత్వం నిజామాబాద్ కేంద్రంగా రీజినల్ ఆఫీస్ కం ఎక్స్టెన్షన్ సెంటర్  మంజూరు చేసిందన్నారు. దీని ద్వారా బోర్డు 30 కోట్ల బడ్జెట్ ను 2022-2025 మధ్య మూడేళ్ల కాలానికి ఆమోదించిందని చెప్పారు. 1986 నుండి 2020 వరకు 35 ఏళ్లలో కూడా రానటువంటి బడ్జెట్ ను ఈ మూడేళ్ల కాలానికే తీసుకొచ్చామని, అందులో ఇదివరకే 9 కోట్ల రూపాయల నిధులు విడుదల అయ్యాయని బీజేపీ ఎంపీ అర్వింద్ పేర్కొన్నారు.


గతంలో కవిత ఏమన్నారంటే.. 
ఎంపీ అర్వింద్‌పై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత గతంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి విమర్శించడం తెలిసిందే. మోసపూరిత హామీలతో అర్వింద్‌ ఎంపీగా గెలిచారని అన్నారు. ఎన్నికలకు ముందు చెప్పిన పసుపు బోర్డు ఏమైందని ప్రశ్నించారు. హామీ నిలబెట్టుకోకపోతే గ్రామాల్లో అడ్డుకుంటామని హెచ్చరించారు. తాను ఎంపీగా ఉన్న సమయంలో 2016 లోనే పసుపు బోర్డు గురించి ప్రధానమంత్రి మోదీని కలిశానని, 2017 లో తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి ఉత్తరం కూడా రాసిందని కవిత గుర్తు చేశారు.


పసుపు ఎక్కువగా పండించే నిజామాబాద్ పరిధిలో 2018 ఎన్నికలకు ముందు పసుపు బోర్డు అంశం కీలకం అయింది. అప్పటి ఎంపీ కవిత పసుపు బోర్డు తేలేదని నిరసన వ్యక్తం చేస్తూ 178 మంది రైతులు ఆమెకు వ్యతిరేకంగా నామినేషన్లు వేశారు. ఆ ఎన్నికల హామీల్లోనే బీజేపీ ఎంపీగా గెలిచిన తరువాత పసుపు బోర్డును తీసుకురాకపోతే రాజీనామా చేస్తానంటూ ధర్మపురి అర్వింద్ బాండ్ పేపర్‌పై రాసిచ్చారు. అన్న మాట అది నిలబెట్టుకోలేకపోవడంతో ఆయనపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా సుగంధ ద్రవ్యాల బోర్డు సభ్యునిగా ఎంపీ అరవింద్ ఛాన్స్ కొట్టేశారు.


నిజామాబాద్ లో పసుపు రైతులు ఆగ్రహం
ఎంపీ ధర్మపురి అరవింద్ గత ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీపై పలుమార్లు బీఆర్ఎస్ నేతలు అరవింద్‌ను ప్రశ్నించారు. ఎంపీ అర్వింద్ పసుపు రైతులను మోసం చేశారంటూ ఆర్మూర్ మండలం పెర్కిట్ లోని ఎంపీ అర్వింద్ నివాసం ముందు పసుపు కొమ్ముల పంటను కుప్పగా పోసి పలుమార్లు నిరసన తెలిపారు. ఇటీవల ఎమ్మెల్సీ కవిత ఎంపీ అరవింద్ పసుపు రైతులకు చేసిన ద్రోహాన్ని ఆర్టీఐ సమాచారంతో బట్టబయలు చేశారు. దీంతో అరవింద్ ఓట్ల కోసం తమ మనోభావాలతో ఆడుకున్నాడని పసుపు రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.