తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మల్ పర్యటనను స్వాగితిస్తూనే,  గతంలో ఇచ్చిన హామీలపై ప్రశ్నిస్తోంది బీజేపీ. ఈ మేరకు బీజేపీ నేత, నిర్మల్ మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. ఈ ప్రాంతానికి చెందిన వేలాది మంది నిరుద్యోగులు గల్ఫ్ దేశాల్లో మగ్గుతున్నారు, పరిశ్రమలు స్థాపించి వారికి రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి కల్పించలేదు అని విమర్శించారు. సాగునీటి ప్రాజెక్టులు ఉన్నా అనుంబంధ పరిశ్రమలు స్థాపించకుండా నిర్లక్ష్యం చేశారు. ప్రాణహిత, చేవెళ్ల ప్యాకేజీ కెనాల్స్ తో గుంట భూమికి కూడా సాగు నీరు అందివ్వలేదని లేఖలో పేర్కొన్నారు.


చిన్న రాష్ట్రాలు, చిన్న జిల్లాలు, ప్రాంతాలతో రాష్ట్రం డెవలప్ అవుతుందని బీజేపీ నేతలు భావిస్తున్నారు. అందులో భాగంగా చిన్న రాష్ట్రమైన తెలంగాణ ఏర్పాటుకు బీజేపీ మద్దతు ఇచ్చిందన్నారు. ఈ క్రమంలోనే నిర్మల్ జిల్లా ఏర్పాటుకై నిర్మల్ జిల్లా సాధన సమితి పేరుతో ఈ ప్రాంత మేధావులు, ఉద్యోగులు, నిరుద్యోగులు జిల్లా ఏర్పాటు కోసం ఉద్యమించారు. ఇక్కడి ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా నిర్మల్ జిల్లాను ఏర్పాటుచేశారు. కానీ డెవలప్ మెంట్ జరగడం లేదని, రాష్ట్ర ఏర్పాటు ఫలాలు కొంతమంది వ్యక్తులకు, ఒక్క కుటుంబానికి దక్కడం విచారకరం అన్నారు ఏలేటి మహేశ్వర్ రెడ్డి. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు తీరుపై ప్రశ్నిస్తూ కేసీఆర్ కు లేఖ రాశారు. 


నిర్మల్ జిల్లా వ్యవసాయ ఆధారిత జిల్లా. కడెం, ఎస్ఆర్ఎస్పీ, స్వర్ణ, గడ్డెన్న ప్రాజెక్టులున్నాయి. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేస్తే వేలాదిమందికి ఉద్యోగాలు లభిస్తాయి. నిర్మల్ నియోజకవర్గం నుంచే 10 వేల మంది యువకులు గల్ఫ్ దేశాల్లో మగ్గుతున్నారు. 2007లో అప్పటి ప్రాణహిత చేవెళ్ల, ఇప్పటి కాళేశ్వరం పేరుపై 27, 28వ ప్యాకేజీ నిర్మల్, ముథోల్ నియోజకవర్గంలో హైలెవల్ కెనాల్ ప్రారంభించారు. ఇప్పటివరకూ రూ.1000 కోట్లకు పైగా ఖర్చుచేసి కాంట్రాక్టర్లు, నాయకలు వారి కమీషన్ల దందాకే పరిమితమై రైతుల నోట్లో మట్టికొట్టారు. ఒక్క గుంట భూమికి కూడా నీళ్లు అందించలేదు.  


నిర్మల్ ప్రజల చిరకాల కోరిక రైల్వేలైన్ హామీ మీరిచ్చిందే ముందు దానిని నెరవేర్చండి. ప్రతి ఎన్నికల్లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హామీ ఇస్తున్నా తీరని హామీ ఇది. ఉమ్మడి ప్రాజెక్టులో రాష్ట్ర వాటా చెల్లించి రైల్వే లైన్ కు సహకరించండి. టూరిజానికి అనువైన శ్యా్మ్ ఘడ్, బత్తీస్ ఘడ్, సదర్ మహల్, ఇస్సురాళ్ల గుట్ట, ఖిల్ల గుట్ట, నిర్మల్ కొయ్య బొమ్మలు, ఎన్నో కోటలు, బురుజులు, గొలుసుకట్టు చెరువులు ఉన్నాయి. కానీ నిర్వహణ లేక కొన్ని కూలిపోయే దశలో ఉండగా, కొన్ని కబ్జాలకు గురవుతున్నాయని, ప్రభుత్వం నిధులు మంజూరు చేసి ఇక్కడ టూరిజం డెవలప్ మెంట్ చేయాలని కోరారు.


మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సొంత భూముల విలువ పెంచుకునేందుకు ప్రజలకు అనువుగా లేని ప్రాంతాల్లో కలక్టరేట్ మెడికల్ కాలేజీ కట్టడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. నిర్మల్ జిల్లాకు చెందిన విద్యార్థులు ఇంజినీరింగ్ చదివేందుకు హైదరాబాద్ వెళ్తున్నారు. నియోజకవర్గంలో ఇంజినీరింగ్ కాలేజ్ ఏర్పాటు చేయాలని రిక్వెస్ట్ చేశారు. 


పోడు భూములకు పట్టాలు పంపిణీ చేయాలి, నిర్మల్ ను పర్యాటక ప్రాంతంగా అభివృద్ది చేయాలి. ఇల్లులేని వారందరికీ డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇవ్వాలి, కేంద్ర ప్రభుత్వ పథకాలను అమలు చేయాలి. రాష్ట్రం ఏర్పడి 9 ఏళ్లు పూర్తవుతున్నా గ్రుహ నిర్మాణ మంత్రిగా స్థానిక మంత్రి పనిచేసినా కేవలం నిర్మల్ పట్టణంలో 15 వేల మందికి పైగా ఇల్లులేని నిరుదపేదలు ఉండగా.. 1500 మందికి కూడా నేటికీ ఇళ్ల పంపిణీ జరగలేదు. నిర్మల్ పట్టణ అండర్ గ్రైనేజీ పనుల కోసం 150 కోట్ల నిధులు మంజూరు చేయాలి. మున్సిపాలిటీలో 44 ఉద్యోగాల అక్రమ నియమాకాల విషయంలో బాధ్యుతలపై చర్యలు తీసుకోవాలి. చెరువుల కబ్జాలు, డీపట్టాల పేరుతో ఆక్రమణలపై చర్యలు తీసుకోని నిర్మల్ ప్రజలకు న్యాయం చేయాలి. రైతుల వద్ద క్వింటాలకు ధాన్యం 5 కిలోల తరుగు తీస్తూ రాబందుల్లా అన్నదాతలను దోచుకుంటున్నారు. కనుక రైతు పండించిన ధాన్యానికి తరుగు లేకుండా, సరైన తూకం వేసి కొనుగోలు చేయాలని సీఎం కేసీఆర్ కు రాసిన లేఖలో బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.