తమ నోటీసులు బేఖాతరు చేయడంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అడిషనల్ సెషన్ కోర్ట్ ఆదేశాలతో నిర్మల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ వాహనాన్ని పోలీసులు సీజ్ చేశారు. ఆ వివరాలిలా ఉన్నాయి.. నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండలం బామ్ని గ్రామానికి చెందిన 21 మంది రైతులకు చెందిన 40 ఎకరాల భూమి శ్రీరామ్ సాగర్ జలాశయం కింద ముంపునకు గురైంది. భూమిని కోల్పోయి 20 ఏళ్లు గడుస్తున్నా తమకు న్యాయం జరగడం లేదని రైతులు ఆరోపించారు. 
తాము గత రెండు దశాబ్దాల నుంచి ప్రభుత్వ కార్యాలయాలు, రెవెన్యూ అధికారుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగినా ఎవరు పట్టించుకోకపోవడంతో చివరకు ఆ రైతులు కోర్టు మెట్లు ఎక్కారు. వారికి నష్టపరిహారం చెల్లించాలని రెవెన్యూ అధికారులకు కోర్టు పలుమార్లు ఆదేశాలు జారీ చేసింది. కానీ అధికారులు కోర్టు నోటీసును బేఖాతారు చేశారు. దీంతో నిర్మల్ అదనపు కలెక్టర్ రాంబాబు వాహనాన్నీ జప్తు చేయాలని అడిషనల్ సెషన్ కోర్ట్ మంగళవారం ఆదేశించింది. కోర్టు సిబ్బంది కలెక్టర్ కార్యాలయ సిబ్బందికి నోటీసులు అందజేసి అడిషనల్ కలెక్టర్ వాహనాన్ని సీజ్ చేసి కోర్టుకు తరలించారు.
శ్రీరామ్ సాగర్ ముంపు జలాశయంలో నర్సాపూర్ మండలం బామ్ని గ్రామానికి చెందిన 21 మంది రైతులకు చెందిన 40 ఎకరాలు ముంపుకు గురైంది. ముంపుకు గురై  ఏళ్లు గడుస్తున్నా ఆ రైతులకు ఒక్క రూపాయి నష్టపరిహారం అందలేదు. రెవెన్యూ అధికారులకు ఎన్ని ఆర్జీలు పెట్టుకున్న ఫలితం దక్కకపోవడంతో 2004 సంవత్సరంలో ఆ రైతులంతా కోర్టును ఆశ్రయించారు. భూములు కోల్పోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని అడిషనల్ సెషన్ కోర్టు పలుమార్లు ఆదేశాలు జారీ చేసినా రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో కోర్టు మంగళవారం అదనపు కలెక్టర్ రాంబాబు వాహనాన్ని సీజ్ చేయలాని ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలతో సిబ్బంది కలెక్టర్ కార్యాలయ సిబ్బందికి నోటీసులు ఇచ్చి, అడిషనల్ కలెక్టర్ వాహనాన్ని సీజ్ చేసి కోర్టుకు తరలించారు.