Ramagundam Latest News: మావోయిస్టు సిద్ధాంతాన్ని ప్రజలు తిరస్కరించారని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా అభిప్రాయపడ్డారు. మంగళవారం ఆయన ఎదుట మావోయిస్టు పార్టీకి చెందిన ఇద్దరు నేతలు లొంగిపోయారు. రాష్ట్ర కమిటీ సభ్యుడు ఆత్రం లచ్చన్న అలియాస్‌ గోపన్న, ఆయన భార్య చౌదరి అంకుభాయి(డీసీఎం) జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. 

Continues below advertisement

మావోయిస్టు నేతలు లొంగిపోయిన సందర్భంగా సీపీ మాట్లాడుతూ..."నేటి ప్రపంచంలో మావోయిజం కాలం చెల్లిన సిద్ధాంతంగా మిగిలిపోయింది. హింసను ప్రేరేపించే సిద్ధాంతాన్ని ప్రజలు తిరస్కరించారు. ప్రపంచంలోని అనేక దేశాల్లో మావోయిజం కనుమరుగైపోయింది." అని అన్నారు. 

మావోయిస్టులకు నేటి యువత దూరంగా ఉంటోందని సీపీ అభిప్రాయపడ్డారు. ప్రస్తుత సమాజంలో యువత చైతన్యవంతంగా వ్యవహరిస్తున్నదని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారని చెప్పారు. "మావోయిస్టు పార్టీలోకి రిక్రూట్‌మెంట్‌ పూర్తిగా తగ్గిపోయింది. చదువుకున్న వారు ఎవరు మావోయిస్టు పార్టీలోకి వెళ్ళడం లేదు. అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులను జన జీవన స్రవంతిలోకి రావాలి." అని  కమిషనర్ అంబర్ కిషోర్ ఝా కోరారు. 

Continues below advertisement

తెలంగాణ మావోయిస్టులు గ్రామాలకు తిరిగి రావాలని, తెలంగాణ అభివృద్ధికి తోడ్పడాలని కోరుతున్నట్టు సీపీ విజ్ఞప్తి చేశారు. అజ్ఞాత మావోయిస్టులు వారి గ్రామాలకు తిరిగి వస్తే, తెలంగాణ ప్రభుత్వం లొంగిపోయిన మావోయిస్టులకు ఇచ్చే పునరావాస పథకాలు, ఇతర సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పారు. వారు స్వతంత్రంగా జీవించే విధంగా ప్రభుత్వం వారికి అన్ని విధాల తోడ్పాటు అందిస్తుందన్నారు. 

కొంతమంది వ్యక్తులు ప్రజాసంఘాల ముసుగులో శాంతి భద్రతలకు భంగం కలిగించే రీతిలో వ్యవహరిస్తున్నారని సీపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వారిపై పోలీసుల నిఘా కొనసాగుతుందన్నారు. వారు శాంతి భద్రతలకు విఘాతం కలిగించినట్లయితే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

35 ఏండ్లుగా అజ్ఞాత వాసం... 35కి పైగా కేసులు

దళ సభ్యుడి నుంచి రాష్ట్ర కమిటీ సభ్యుడి దాకా ప్రస్థానం సాగించారు ఆత్రం లచ్చన్న అలియాస్ గోపన్న అలియాస్ రాజప్ప. మావోయిస్టు పార్టీలో 35 ఏండ్ల నుంచి పనిచేస్తున్నారు. వయసు మీద పడటం.. ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్రం మావోయిస్టు పార్టీ నేతలను ఏరి వేస్తుండటంతో ఆయన భార్యతో సహా లొంగిపోయారు.

మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం పారిపెల్లికి చెందిన లచ్చన్న 1983లో దళ సభ్యునిగా చేరి చెన్నూర్ దళంలో పని చేశాడు. 1988లో ఏరియా కమిటీ సభ్యుడిగా పదోన్నతి పొంది సిర్పూర్ దళానికి డిప్యూటీ కమాండర్ పనిచేశాడు. 1989 సంవత్సరంలో చౌదరి ఆంకుభాయి అలియాస్ అనితక్కని వివాహం చేసుకున్నాడు. ఆ తరువాత పార్టీ అతడిని 1995 వ సంవత్సరంలో టెక్నికల్ డిపార్ట్మెంట్‌కి బదిలీ చేసి పట్టణ ప్రాంతానికి పార్టీ పని నిమిత్తం పంపించారు. 2002 సంవత్సరంలో DCMగా పదోన్నతి పొంది తిరిగి DK SZCలోని టెక్నికల్ డిపార్ట్మెంట్‌కి బదిలీ అయ్యాడు. 2007 సంవత్సరంలో పార్టీ అతడిని నార్త్ బస్తర్ DVC టెక్నికల్ డిపార్ట్మెంట్‌కి ఇంచార్జ్‌గా నియమించింది. 2023 సంవత్సరంలో ఇతనికి పదోన్నతి లభించింది. మంగళవారం లొంగిపోయేంతవరకు లచ్చన్న అక్కడే పనిచేస్తున్నాడు. ఆత్రం లచ్చన్నపై తెలంగాణలోని వివిధ జిల్లాలలో 35 కేసులు నమోదు అయ్యాయి. 

చౌదరి ఆంకుభాయి అలియాస్ అనితక్క అలియాస్ లక్ష్మి కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలానికి చెందిన వారు. అనితక్క 1988లో ఆమె అన్న చౌదరి చిన్నన్న ప్రోత్సాహంతో దళ సభ్యురాలిగా చేరారు. సిర్పూర్ దళం లో పనిచేసింది. అలా సిర్పూర్ దళంలో పని చేస్తుండగా సిర్పూర్ దళం డిప్యూటీ కమాండర్‌గా పని చేస్తున్న ఆత్రం లచ్చన్నని వివాహం చేసుకుంది. 1995 వరకు సిర్పూర్ దళంలోనే పనిచేసి 1995లో తన భర్తతో పాటు పట్టణ ప్రాంతానికి బదిలీ అయ్యారు. 2002లో ACM గా పదోన్నతి పొంది తిరిగి DK SZCలోని టెక్నికల్ డిపార్ట్మెంట్ కి తన భర్తతోపాటు బదిలీ అయ్యింది. 2007 సంవత్సరంలో అనితక్క నార్త్ బస్తర్ DVC టెక్నికల్ డిపార్ట్మెంట్‌కి బదిలీ అయ్యింది. ఆమె ప్రస్తుతం నార్త్ బస్తర్ DVC లోని టెక్నికల్ డిపార్ట్మెంట్‌లో DCMగా పని చేస్తున్నారు. చౌదరి ఆంకుభాయిపై కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 14 కేసులు నమోదయ్యాయి. 

లచ్చన్నకు ప్రస్తుతం 65 సంవత్సరాలు కాగా, అకుంభాయికి 55 సంవత్సరాలు వయోభారంతోపాటు ఇప్పుడు ఉన్న పరిస్థితుల నేపథ్యంలో వారు లొంగిపోవాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో మంగళవారం ఇద్దరు దంపతులు కలిసి రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఎదుట లొంగిపోయారు.