Mancherial News: పక్కింటి వాళ్లతో జరిగిన గొడవ కారణంగా తీవ్ర మనస్తాపానికి గురైన ఓ మహిళ పురుగుల మందు తాగింది. విషయం గుర్తించిన కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆమె చనిపోయింది. పుట్టెడు దుఃఖంతో భార్య మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్తుండగా.. భర్త రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఈక్రమంలోనే తీవ్ర గాయాలపాలైన అతడు.. అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. భార్య అంత్యక్రియలు కాకముందే భర్త కూడా చనిపోవడంతో... కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 


అసలేం జరిగిందంటే..?


మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట మండలంలోని ఎల్లారం గ్రామానికి చెందిన 31 ఏళ్ల మల్లికార్జున రావు, 29 ఏళ్ల శరణ్య దంపతులు. అయితే వీరికి పక్కింటి వారితో గొడవ జరిగింది. ఈక్రమంలోనే తీవ్ర మనస్తాపం చెందిన శరణ్య ఈనెల 13వ తేదీన పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. విషయం గుర్తించిన కుటుంబ సభ్యులు ఆమెను కరీంనగర్ లోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే అక్కడే చికిత్స పొందుతూ శరణ్య శనివారం రోజు మృతి చెందింది. అయితే ఈరోజు మతదేహాన్ని అంబెలెన్సులో స్వగ్రామానికి తరలిస్తుండగా.. లక్షెట్టిపేటలోని కరీంనగర్ చౌరస్తా వద్ద మల్లికార్జున రావు వస్తున్న బైక్ ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మల్లికార్జున తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. భార్యాభర్తలు ఇద్దరూ చనిపోవడంతో... పిల్లలు అనాథలయ్యారని కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి    
Join Us on Telegram: https://t.me/abpdesamofficial