Beer Shortage Kingfisher Beers News: మంచిర్యాల: గత కొన్ని రోజులుగా పలు జిల్లాల్లో లైట్ బీర్లు దొరకడం లేదని, తమకు కావాల్సిన బీర్లు అందుబాటులో ఉంచితే తెలంగాణ ప్రభుత్వానికి ఆదాయం పెంచుతాం అంటున్నారు మందుబాబులు. మంచిర్యాల జిల్లాలో కొద్ది రోజులుగా కింగ్ ఫిషర్ లైట్ బీర్లు వైన్ షాపులు, బార్లలో లభ్యం కావడం లేదు అని తాగుబోతుల సంక్షేమ సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షుడ్ని అంటూ ఓ వ్యక్తి అధికారులకు ఫిర్యాదు చేశాడు. తమ జిల్లాతో పాటు ఆసిఫాబాద్, భూపాలపల్లి, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి లాంటి జిల్లాల్లో గత కొన్ని రోజులుగా కింగ్ ఫిషర్ లైట్ బీర్లు దొరకడం లేదని మంచిర్యాల జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సూపరిండెంట్ (DSP)కి రాసిన లేఖ వైరల్ అవుతోంది.




ఆ లేఖలో ఏముందంటే..
గత 18 రోజులలో రాష్ట్రానికి మద్యం అమ్మకాల ద్వారా 670 కోట్ల రూపాయల ఆదాయాన్ని తీసుకురావడం సంతోషంగా ఉందని తాగుబోతుల సంక్షేమ సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. అసలే వేసవికాలం, ఎండ తీవ్రత కారణంగా లైట్ బీర్లు తాగుదామంటే దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. మంచిర్యాల జిల్లాలో గత కొన్ని రోజుల నుంచి ఏ వైన్ షాప్ లో గాని, బార్లలో గాని కింగ్ ఫిషర్ లైట్ బీర్లు లభ్యం కావడం లేదు. లైట్ బీర్లను తాగడం ద్వారా మత్తు తక్కువగా ఉంటుంది, కొంత సమయం వరకే ఉంటుంది. పైగా మా పనులు మేం చేసుకోగలుగుతాం. 


స్ట్రాంగ్ బీర్లు తాగితే అనారోగ్య సమస్యలు 
అదే స్ట్రాంగ్ బీర్లు తాగడం వల్ల  కడుపులో మంట, తీవ్రమైన తలనొప్పి, వాంతులు, వికారం వంటి అనారోగ్య సమస్య తలెత్తుతుంది. మాకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండడానికి  కింగ్ ఫిషర్ ర్ బీర్లను అన్ని వైన్ షాపులలో బార్లలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ శాఖ డీఎస్పీకి రాసిన లేఖలో అతడు పేర్కొన్నాడు. కింగ్ ఫిషర్ లైట్ బీర్లు తాగే అందరి తరపున మిమ్మల్ని కోరుతున్నాం, ఈ విషయంలో మాకు సహకరిస్తే రాష్ట్ర ఆదాయాన్ని మరింత రెట్టింపు చేయడానికి కృషి చేస్తామని లేఖలో రాశాడు.


తక్కువ మార్జిన్ వస్తుందని స్టాక్ తెస్తలేరని ఆరోపణలు


కొన్ని వైన్ షాపులు సిండికేట్ అయి కింగ్ ఫిషర్ లైట్ బీర్లు విక్రయించడం లేదని ఫిర్యాదులో మందుబాబులు ఆరోపించారు. తక్కువ మార్జిన్ వస్తుందని కింగ్ ఫిషర్ లైట్ బీర్లు తెప్పించడం లేదని తాము భావిస్తున్నట్లు పేర్కొన్నాడు. వారి లాభాల కోసం తమకు కొత్త కొత్త రకం బీర్లను అలవాటు చేస్తున్నారని, గతిలేక అవి తాగుతున్నామని తెలిపారు. కానీ అలాంటి బీర్లు తాగడం ద్వారా తమ ఆరోగ్యాలు పాడయ్యే అవకాశం ఉందని, ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని తాము కోరినట్లుగా జిల్లాలో లైట్ బీర్ల స్టాక్ ఉండేలా సహకరించాలని ఎక్సైజ్ శాఖ డీఎస్పీకి రాసిన లేఖలో పేర్కొన్నాడు.


Also Read: కర్ణాటకలో రేవంత్ ఎన్నికల ప్రచారం, ఢిల్లీ పోలీసుల సమన్లపై కీలక వ్యాఖ్యలు