Farmers Hunger Strike Day 3: మంచిర్యాల జిల్లాలో గూడెం ఎత్తిపోతల పథకం ద్వారా కడెం ప్రాజెక్టు ఆయకట్టు పంట పొలాలకు సాగునీరందక పంటలు ఎండిపోతున్నాయి. తడి అందక నెర్రలు బారుతున్నాయి. వందల ఎకరాల్లో పెట్టుబడి పెట్టిన రైతులు ఆశతో సాగు చేయగా.. గూడెం లిఫ్ట్ ఇరిగేషన్ పైప్ లైన్ లో తరుచూ సాంకేతిక సమస్యలు ఎర్పడటం, పైప్ లైన్ ల లీకేజీలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇప్పటికి పలుమార్లు అధికారులు ప్రజాప్రతినిధులకు విషయం చెప్పిన, ధర్నాలు రాస్తారోకోలు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గూడేం ఎత్తిపోతల పథకం ద్వారా పోలాలకు సాగు నీరందించాలని డిమాండ్ చేస్తూ దండేపల్లిలో రైతులు.. జిల్లా కాంగ్రెస్ పార్టీ నేతలు ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారు. ఈ ఆమరణ నిరాహారదీక్ష బుధవారం రెండో విజయవంతంగా పూర్తయింది. రైతులు కాంగ్రెస్ నేతలు సాగునీటి కోసం చేపట్టిన ఆమరణ నిరాహారదీక్షకు మద్దతుగా మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ దీక్షలో పాల్గొన్నారు. రైతులకు సాగు నీరందించేంత వరకు అండగా ఉండి పోరాడతామని అన్నారు. మంచిర్యాల జిల్లాలో సాగు నీరందక నష్టపోతున్న రైతులపై ఏబీపీ దేశం ప్రత్యేక కథనం.


దిక్కుతోచని స్థితిలో ఆమరణ నిరాహార దీక్ష


మంచిర్యాల జిల్లాలో పొలాల్లో సాగు నీరందక భూములు నెర్రలు బారుతున్నాయి. తడి ఇవ్వకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయి. అసలే భారీ వర్షాలకు నష్టపోయిన రైతులు, ఇప్పుడు కడేం ఆయకట్టుకు గూడేం ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరందక ఇబ్బందులు పడుతున్నారు. మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి, లక్షెటిపేట్, హాజీపూర్ మండలాలలోని రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. దిక్కు తోచని స్థితిలో అన్నదాతలు తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికే పలుమార్లు ధర్నాలు, రాస్తారోకోలు చేసినా తీరు మారలేదు. దీంతో సాగు నీరందించాలని డిమాండ్ చేస్తూ రైతులు దండేపల్లిలో ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారు. రైతులకు అండగా కాంగ్రెస్ పార్టీ నిలిచింది. మంచిర్యాల డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు రైతులతో కలిసి ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారు. ఫిబ్రవరి 28న ఈ ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారు. ఈ ఆమరణ నిరాహారదీక్ష విజయవంతంగా కొనసాగింది. 




ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చేంత వరకు..


ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, ఆమరణ నిరాహారదీక్ష చేపట్టిన రైతులు కాంగ్రెస్ నేతలు ఏబీపీతో మాట్లాడారు. గూడెం ఎత్తిపోతల పథకం ద్వారా సాగు నీరు సరఫరా చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. తరచూ లిఫ్ట్ ఇరిగేషన్ పైపు లైన్లు పగిలిపోయి పంటలకు నీరు అందడం లేదని, దండేపల్లి, లక్షెట్టిపేట, హజీపూర్ మండలాలకు సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని, ఎవరికి చెప్పిన పట్టించుకొవడం లేదని, ఇలాంటి పరిస్థితుల్లో ఆమరణ నిరాహారదీక్ష చేపట్టడం జరిగిందన్నారు. అధికారులు, పాలకుల అలసత్వం వల్లనే రైతులు నష్టపోతున్నారని.. తక్షణమే వాటికి శాశ్వత పరిష్కారాన్ని చూపి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం, అధికారుల నుండి స్పష్టమైన హామీ వచ్చేంత వరకు కడేం ఆయకట్టు, గూడేం ఎత్తిపోతల ద్వారా రైతులకు సాగు నిరందించేంత వరకు అండగా ఉంటామన్నారు. అప్పటి వరకు రైతుల ఈ ఆమరణ నిరాహార దీక్ష కొనసాగుతుందన్నారు.


మరోవైపు దండేపల్లి, లక్షెట్టిపేట, హాజీపూర్ మండలాల్లోని కడెం ప్రాజెక్టు చివరి ఆయకట్టును స్థిరీకరించేందుకు ఈ లిఫ్ట్ నిర్మించారు. ఈ మూడు మండలాల్లోని 30వేల ఎకరాలకు ఎల్లంపల్లి ప్రాజెక్టు బ్యాక్ వాటర్ నుంచి 3 టీఎంసీల నీటిని అందించాల్సి ఉంది. 2015లో లిఫ్ట్ ను  ప్రారంభించినప్పటి నుంచి ఏనాడూ పూర్తి స్థాయిలో నీళ్లివ్వలేదు. నాసిరకం పైపులు వేయడం వల్ల తరచూ పగిలిపోతున్నాయి. రెండు మోటార్లు ఆన్ చేస్తే ప్రెషర్ కు పైపులు పైకి లేస్తున్నాయి. దీంతో నీటి సరఫరాకు అంతరాయం కలుగుతున్నది. నిరుడు జులైలో గోదావరికి వచ్చిన వరదల్లో లిఫ్ట్ పూర్తిగా మునిగిపోయింది. ఇటీవల రిపేర్లు చేసి మోటార్లు స్టార్ట్ చేయగా మొరాయిస్తున్నాయి. గత డిసెంబర్ నుంచి ఒక్కరోజు కూడా సజావుగా నీళ్లు ఇయ్యలేకపోతున్నారు. 30 వేల ఎకరాల ఆయకట్టుకు గాను యాసంగిలో 20 వేల ఎకరాల్లో వరి, మక్క పంటలు వేశారు. ఇప్పటికే సుమారు 10 వేల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి. బావులు, బోర్లు అడుగంటిపోయాయి. రైతులు వేలల్లో ఖర్చు పెట్టి జేసీబీలతో బావుల లోతు తీయిస్తున్నారు. మరికొందరు కొత్తగా బావులు తవ్విస్తున్నారు. ఇప్పటికే ఎకరానికి రూ.25వేల వరకు నష్టపోయామని, ప్రభుత్వం తమని ఆదుకోవాలని వేడుకుంటున్నారు. 


చివరి ఆయుకట్టు రైతులకు సాగు నీరందండం లేదు..


దండేపల్లి మండలంలోని తానిమడుగు సమీపంలో రెండు రోజుల క్రితం పైప్ లైన్ పగిలిపోయింది. దీంతో సమీప ఆయకట్టు రైతుల పోలాలకు సాగు నీరందక బెంబేలెత్తారు. అటు దండేపల్లిలో రైతులు గూడేం ఎత్తిపోతల ద్వారా సాగు నీరందించాలని కాంగ్రెస్‌ పార్టీ ఆద్వర్యంలో ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారు. సాంకేతిక సమస్యలు పైపు లైన్ల లీకేజిలతో తరుచూ ఇలాంటి ఇబ్బందులు పడుతున్నామని తానిమడుగు రైతులు ఏబీపీతో చెప్పుకొని బాధపడ్డారు. తానిమడుగు సమీపంలో పగిలిన పైప్ లైన్ కు మరమ్మతులు చేపట్టారు. పైప్ లైన్ లీకేజీ .. మోటారు వేసినప్పుడు పైప్ లైన్ పగిలి ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయని, చివరి ఆయకట్టు రైతులకు మాత్రం సాగు నీరందడం లేదని, దిగువన కడేం ఆయకట్టు నుండి సాగు నీరందక అనేక రైతుల పోలాలు ఎండిపోతున్నాయని ఇలాంటి సమస్యలు తలెత్తకుండా శాశ్వత పరిష్కారం చెపట్టి రైతులకు న్యాయం చేయాలన్నారు.