ముఖ్యమంత్రి కేసీఆర్ బీర్కూర్‌లోని తెలంగాణ తిరుమల సందర్శన సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వేంకటేశ్వర స్వామి కల్యాణోత్సవంలో పాల్గొని, స్వామివారిని దర్శించుకొన్న అనంతరం కొండ దిగువన ఏర్పాటు చేసిన ధన్యవాద సభలో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. తాను కూడా ముసలోణ్ని అవుతున్నానని సరదా వ్యాఖ్యలు చేశారు. తనకు 69 ఏళ్లు వచ్చాయని చెప్పారు. 


‘‘శ్రీనన్న (పోచారం శ్రీనివాస్) తన వయసు పెరుగుతుందని అంటున్నడు. నేను కూడా ముసలోణ్ణి అవుతున్నా. 69 ఏళ్లు వచ్చినయి. నేను ఉన్నన్ని రోజులు మీరు కూడా ఉండాల్సిందే. బాన్సువాడకు సేవ చేయాల్సిందే. మీ మాట బలంగా ఉంటది. ఎవరితోనైనా మాట్లాడి పనులు చేయించుకునే తత్వం ఉంది. నిజాయతీగా ప్రజల కోసం పాటుపడే వ్యక్తి మీరు. మా శ్రీనన్నపైన ఉన్న అభిమానంతో ముఖ్యమంత్రి స్పెషల్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌ కింద రూ.50 కోట్లు మంజూరు చేస్తున్నా. ఇవి బాన్సువాడ అభివృద్ధికి ఖర్చు పెట్టుకోవచ్చు’’ అని అన్నారు. 


గుడి అభివృద్ధికి రూ.7 కోట్లు


‘‘గతంలో తిమ్మాపూర్ కి వచ్చినప్పుడు ఇది ఒక గుడి మాదిరిగా ఉండేది. అందమైన, ప్రకృతి రమణీయత మధ్య ఆలయం చక్కని స్థలంలో ఉంది. గుట్టపైకి పోయినప్పుడు చుట్టూ సుమారుగా ఎనిమిది కిలోమీటర్ల దూరం కనిపించేట్టు మంచిగున్నది. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్న గుడిని మరింత అభివృద్ధి చేయాలనే శ్రీనన్న నన్ను ఇక్కడికి తీసుకొచ్చిండు. ఇప్పటిదాక ఆయన కోరుకున్న దాని కన్నా మంచిగా పుణ్యక్షేత్రం రూపుదిద్దుకుంది. భగవంతుడి దయ శ్రీనన్న మీద ఉంది. నన్ను పిలిపించుకుని ఆయనే పని చేయించుకున్నాడు. స్వామి కరుణ, దయ బాన్సువాడ మీదనే కాదు. మొత్తం రాష్ట్రంపై ఉండాలి. పంటలతో సుభిక్షంగా ఉండాలి. ప్రజలంతా సుఖ, సంతోషాలతో వర్ధిల్లాలి. ఇప్పటివరకు ఈ ఆలయానికి రూ.23 కోట్లను మంజూరు చేశాం. ఇంకా రూ.7 కోట్లు మంజూరు చేస్తాం. ఇక్కడ వివాహాలు కూడా బాగా జరుగుతున్నాయి’’ అని కేసీఆర్ మాట్లాడారు.